సుధా సినిమా పతాకంపై రూపొందుతున్న చిత్రం 'దగ్గరగా దూరంగా'. సుమంత్ కథానాయకుడు. వేదిక, సింధు
తులానీ నాయికలు. చావలి రవికుమార్ దర్శకుడు. జె.సాంబశివరావు నిర్మాత. ఈ చిత్రం ఆడియో విడుదల
కార్యక్రమం హైదరాబాద్లోని ప్రసాద్ల్యాబ్స్లో జరిగింది. తొలి సీడీని అక్కినేని నాగేశ్వరరావు విడుదల చేసి
మంచు మోహన్బాబుకు అందజేశారు.
మోహన్బాబు మాట్లాడుతూ "నిర్మాత సాంబశివరావు మా సినిమాలకు పనిచేశాడు. చెప్పిన పనిని
సమర్థవంతంగా చేయగలడు. అతను నిర్మాతగా మంచి స్థానానికి చేరుకోవాలని ఆకాంక్షిస్తున్నాను. సుమంత్
నాకు బిడ్డలాంటి వాడు. విష్ణు, మనోజ్లలాగా మా ఇంట్లో బిడ్డ. సినిమా విజయం కావాలని కోరుకుంటున్నాను''
అని అన్నారు.
చిత్ర దర్శకుడు రవికుమార్ చావలి మాట్లాడుతూ "రఘుకుంచె అందించిన సంగీతం మెప్పిస్తుంది. ఈ
సినిమాలో పనిచేసిన వారందరికీ కృతజ్ఞతలు'' అని అన్నారు. రఘుకుంచె చెబుతూ "ఈ చిత్ర రూపకర్తలకు
పనిని ఎలా రాబట్టుకోవాలో తెలుసు. దర్శకుడు ప్రతిభావంతుడు. ఈ సినిమాలోనూ ఓ జానపదగీతాన్ని
జోడించాం. 'పెద్దపులి'.. పాటను రీమేక్ చేశాం. ఒరిజినల్ను పాడిన ఈశ్వర్ చేత ఈ పాటను పాడించామ''ని
అన్నారు.
నిర్మాత మాట్లాడుతూ "ఈ సినిమా అన్ని వర్గాల వారికీ నచ్చేలా ఉంటుంది. పాటలు మెప్పిస్తాయి. సుమంత్
కెరీర్లో మంచి సినిమాగా మిగులుతుంద''ని చెప్పారు.
సుమంత్ మాట్లాడుతూ "ఈ ఏడాది నావి రెండు చిత్రాలు విడుదలయ్యాయి. ఒకటి హిట్. ఒకటి ఆడలేదు. ఈ
సినిమా నాకు పాజిటివ్ సినిమా అవుతుందని భావిస్తున్నాను. మా యూనిట్ వారందరికీ నా కృతజ్ఞతలు
చెబుతున్నాను'' అని అన్నారు.
అక్కినేని నాగేశ్వరరావు మాట్లాడుతూ "టైటిల్ నాకు బాగా నచ్చింది.
ఎవరైనా నాలుగు రోజులు దూరంగా ఉంటే ఐదో రోజు మరింత దగ్గరవుతారు. అందులో మజా ఉంటుంది. నేను
పాటలతో బతికిన వ్యక్తిని. అందుకే పాటలంటే ఇష్టం. అభిరుచిగల నిర్మాతతో పాటు మంచి కథ, ప్రతిభావంతుడైన
దర్శకుడు దొరికితే చక్కటి సినిమా తయారవుతుంది. సుమంత్ దర్శకత్వంలో కోర్సు చేశాడు. ఎప్పటికైనా ఓ
సినిమా దర్శకత్వం వహిస్తాడన్న నమ్మకం ఉంది'' అని అన్నారు.
ఇంత మంచి సినిమాలో పనిచేసినందుకు ఆనందంగా ఉందని వేదిక, కేదార్నాథ్, కాసర్ల శ్యామ్ తదితరులు
ఆనందాన్ని వ్యక్తం చేశారు. 'దగ్గరగా దూరంగా' చిత్రం, పాటలు విజయవంతం కావాలని కె.సి.శేఖర్బాబు,
అశోక్కుమార్, ప్రసన్నకుమార్, అచ్చిరెడ్డి, రమేష్ పుప్పాల, సి.కల్యాణ్, నందమూరి హరి తదితరులు
ఆకాంక్షించారు. ఆడియో ఆదిత్య ద్వారా విడుదలైంది.