ఆడియో
 
 
 
 
'విశ్వ విజేత' పాటలు
ప్రపంచ శాంతిదూత, క్రీస్తు మత ప్రబోధకుడు డా కె.ఎ.పాల్‌ జీవితచరిత్ర ‘విశ్వవిజేత’ పేరుతో సినిమాగా వస్తోంది. ప్రపంచ హెవీ వెయిట్‌ బాక్సింగ్‌ మాజీ ఛాంపియన్‌ ఇవాండర్‌ హోలీఫీల్డ్‌ ఈ కాన్సెప్ట్‌ చిత్రానికి సమర్పకుడు. తిమోతి దర్శకత్వం వహిస్తూ..రచన, సంగీతం కూడా అందించారు. జీవన్‌ థామస్‌, సాకేత్‌ సాయిరామ్‌, జయశ్రీ సంయుక్తంగా పాటలకు బాణీలందించారు. ‘విశ్వవిజేత’ ఆడియో హైదరాబాద్‌లో ఆవిష్కరించారు.

సిపిఐ రాష్టక్రార్యదర్శి నారాయణ ఆడియో తొలిప్రతిని ఆవిష్కరించి హీరో రాజశేఖర్‌కి అందించారు. ఆడియో వేడుకలో కె.ఎ.పాల్‌, హోలీఫీల్డ్‌, జీవిత, దర్శకుడు శ్రీనివాసరెడ్డి, పిఆర్‌పి నేత శోభారాణి, దేవీప్రసాద్‌, శివనాగేశ్వరరావు, సాగర్‌, కవిత, మంత్రులు పద్మనాభమ్‌ (ఎక్స్‌), లాల్‌ జాన్‌ పాషా, ఐపిఎస్‌ అధికారి సునీల్‌ కుమార్‌, ఐఎఎస్‌ ఎల్వీ ప్రసాద్‌, మాకిరెడ్డి శ్రీనివాస్‌, పైడిబాబు, అశోక్‌ కుమార్‌, బ్రాహ్మణి స్టీల్స్‌ రామచంద్రరావు, శుభవార్త చానెల్‌ అధినేత నెహ్రూ ధైర్యం తదితరులు పాల్గొన్నారు.

హోలీఫీల్డ్‌ మాట్లాడుతూ ‘గురువుగారు పాల్‌తో 14ఏళ్ల అనుబంధముంది. ఆయన జీవితచరిత్రను ఆవిష్కరించే సినిమాకు సమర్పకుడిగా వ్యవహరించడం నా అదృష్టం’ అన్నారు. రాజశేఖర్‌ మాట్లాడుతూ ‘పేదలు, ఆకలితో ఉన్నవారిని ఆదుకునే గొప్ప దేవుడు కె.ఎ.పాల్‌. ఆయన ఉన్న స్టేజిపై మాట్లాడడం ఆనందంగా ఉందన్నా’రు.

కె.ఎ.పాల్‌ మాట్లాడుతూ ‘మిడిల్‌ ఈస్టులో పరిస్థితులను చక్కదిద్దడానికి హోలీఫీల్డ్‌, నేను సంకల్పించాం. అయితే ఆ సమయంలో అతని కుమారుడు చనిపోయాడు. అయినా తన మాటకు కట్టుబడి నాతో ముందుకొచ్చారు. బాక్సింగ్‌ దిగ్గజం మైక్‌టైసన్‌తో తలపడుతున్నప్పుడు ఆయన భార్య నాకు ఫోన్‌ చేసి ఆశీర్వదించమని అడిగారు. నేను ప్రార్థన చేశాను. ఆ మ్యాచ్‌లో హోలీఫీల్డ్‌ నెగ్గారు. దేవుడు నాతో ఉండడం వల్లే ఇవన్నీ చేయగలుతుగున్నాను. నేనేమిటో ఈ సినిమా ద్వారా చూపించారు’ అన్నారు. దేశ, విదేశాల్లో కీర్తినార్జించిన ఏకైక తెలుగువాడు పాల్‌..అని వక్తలంతా ప్రశంసించారు. ఈ చిత్రానికి పాటలు: బండారు దానయ్య (కవి), కెమెరా: రాజశేఖర్‌ గవర.