నాగార్జున నటిస్తున్న తాజా చిత్రం 'కేడి'. మమతా మోహన్దాస్ నాయికగా చేస్తున్న ఈ చిత్రానికి కిరణ్ దర్శకుడు. కామాక్షి కళా మూవీస్ పతాకంపై డి.శివప్రసాద్ రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రం పాటల ఆవిష్కరణ హైదరాబాద్లో జరిగింది. ఆడియో సీడీని నాగార్జున విడుదల చేసి మమతా మోహన్దాస్కి అందజేశారు. ఈ సందర్భంగా నాగార్జున మాట్లాడుతూ -"ఈ చిత్రం సంగీత దర్శకుడు సందీప్ చౌతా ఇంతకు ముందు నేను నటించిన నిన్నే పెళ్ళాడతా, చంద్రలేఖ, సూపర్ చిత్రాలకు మంచి సంగీతాన్ని అందించాడు. ఇప్పుడు ఈ 'కేడి' చిత్రానికి వాటికి మించిన బాణీలను ఆయన సమకూర్చాడు.
ఈ ఆవిష్కరణ కంటే ముందే ఆడియో మార్కెట్లోకి విడుదలైంది. మంచి స్పందన కూడా వస్తోంది. ఈ చిత్రంలో నాన్నగారు నటించిన 'అదృష్టవంతులు' చిత్రంలోని 'ము.. ము.. ముద్దంటే చేదా..' పాటను ప్రత్యేక గీతంగా రీ-మిక్స్ చేయడం జరిగింది. ఈ పాటలో నేను చేశాను. ఇది చిత్రానికి హైలైట్గా నిలుస్తుంది' అన్నారు. శివప్రసాద్రెడ్డి మాట్లాడుతూ -"ఇప్పటి వరకు మా సంస్థలో వచ్చిన అన్ని చిత్రాలు మ్యూజికల్గా మంచి విజయాన్ని సాధించాయి.
ఈ చిత్రంలో కూడా అన్ని పాటలు చాలా వైవిధ్యంగా వుంటాయి. సందీప్ చౌతా కొత్తగా ప్రయత్నించాడు. తప్పకుండా ఈ ఆడియోతో పాటు చిత్రం కూడా మంచి విజయాన్ని సాధిస్తుందన్న నమ్మకం వుంది' అని చెప్పారు. మమతా మోహన్దాస్ మాట్లాడుతూ -" 'కింగ్' తర్వాత మళ్ళీ నాగార్జున గారితో కలిసి చేయడం ఎంతో సంతోషంగా వుంది. ఈ చిత్రంలో నేను పోషిస్తున్న పాత్ర నాకు బాగా నచ్చింది. శివప్రసాద్రెడ్డి గారి సంస్థలో కూడా మళ్ళీ నటించాలని వుంది' అన్నారు.
ఈ చిత్రంలోని పాటలన్నీ కథలో భాగంగా వుంటాయని, చిన్నిచరణ్, చైతన్య కథకు అనుగుణంగా మంచి సాహిత్యాన్ని అందించగా, సందీప్ చౌతా సూపర్ మ్యూజిక్ను ఇచ్చారని, కమర్షియల్ స్టైలిష్ ఎంటర్టైనర్గా చిత్రం రూపొందుతోందని దర్శకుడు కిరణ్ అన్నారు. ఈ కార్యక్రమంలో చిన్నిచరణ్, కృష్ణ చైతన్య, ఆదిత్య మ్యూజిక్ ప్రతినిధి దయానంద్, సర్వేష్ మురారి కూడా పాల్గొన్నారు.