ఆడియో
 
 
 
 
'రత్నావళి' పాటలు
మాంగల్యానికి అర్థం శృంగారం ఒక్కటే కాదు. సమాజానికి ఆదర్శంగా భర్తని ఉద్యమ నాయకుడిగా తీర్చిదిద్దడమని నమ్మిన ఇల్లాలి ఇతివృత్తమే 'రత్నావళి' చిత్రమని దర్శకుడు అల్లాణి శ్రీధర్‌ తెలిపారు. ఎం.వి.యస్‌. క్రియేషన్స్‌ పతాకంపై మచ్చా శ్రీనివాసరావు నిర్మిస్తున్న ఈ చిత్రంలో తులసీదాస్‌ పాత్రలో సునీల్‌శర్మ, పలు హిందీ చిత్రాలలో నటించిన పూజా బాలూషీ రత్నావళి పాత్రలోను నటిస్తున్నారు. కాగా ఈ చిత్రం పాటల చిత్రీకరణ శరవేగంగా సాగిపోతోంది.

ఈ సందర్భంగా దర్శకుడు అల్లాణి శ్రీధర్ మాట్లాడుతూ- ‘పాటలతో పాటు రెండు శ్లోకాల చిత్రీకరణ కూడా ఎంతో బాగా వచ్చిందని అన్నారు. పాటల రచయిత కాపర్తి వీరేంద్ర అందించిన ఈ పాటల్లో నాటి కాలమాన పరిస్థితులలోని భాషతో పాటు ఆధునిక వాస్తవికత, అమలిన శృంగారం అలవోకగా గుండెకు హత్తుకునేలా అమిరాయని నిర్మాత వివరించారు. రషెస్‌ చూసిన తర్వాత ఈ చిత్రం బిజినెస్‌ పార్ట్‌నర్‌ మఫత్‌లాల్‌ గ్రూప్‌ ఛైర్మన్‌ మాట్లాడుతూ, రామోజీ ఫిలింసిటీలో భారీసెట్స్‌లో అధికవ్యయంతో నిర్మించిన దృశ్యాలు కొత్త వరవడిని సృష్టించేలా వున్నాయని అన్నారు. మొదటి షెడ్యూల్‌ జరిగిన తర్వాత సినీ పరిశ్రమలో మంచి స్పందన లభించిందని, ఈ షెడ్యూల్‌లో మిగిలిన పాటలు కూడా పూర్తిచేసి, త్వరలో అవుట్‌డోర్‌ షూటింగ్‌ ప్రారంభించి, వారణాశి, అయోధ్య, చిత్రకూట్‌, ప్రయాగ తదితర ప్రాంతాల్లో కొన్ని పాటలు, ముఖ్యమైన దృశ్యాలు చిత్రీకరించి, అక్టోబర్‌ ద్వితీయార్థానికి పూర్తిచేస్తామని ఆయన తెలిపారు. కాగా ఈ చిత్రం హిందీ వెర్షన్‌ని త్వరలో ప్రారంభిస్తామని నిర్మాత చెప్పారు.

ఇందులో వాణీవిశ్వనాథ్‌ రాజకుమారిగా, మీరాబాయిగా అద్భుతంగా నటిస్తోందని, ఆమె పాత్ర చిత్రానికి హైలైట్‌ అవుతుందని దర్శకుడు అన్నారు. రత్నావళిగా నటిస్తోన్న పూజా బలూటియా చాలా పెద్ద సంస్థలకు డల్‌గా పనిచేస్తోందని ఆయన తెలిపారు. ఇటీవల ఆమె నటించిన ఓ తమిళ చిత్రం వందరోజులు ఆడిందని అన్నారు. భర్త దూరమైన సన్నివేశాలలో ఎంతో ఉద్వేగభరితంగా నటించిందో భార్యాభర్తల శృంగార సన్నివేశాల్లో కూడా అంత బాగా నటించిందని చెప్పారు. అనేక టీవీ సీరియల్స్‌ ద్వారా ప్రేక్షకులకు ఎంతోదగ్గరైన సునీల్‌శర్మ తులసీదాసుగా మెప్పిస్తారని అన్నారు. సుమన్‌ కాశీరాజుగా, వింధూసింగ్‌ ఆంజనేయునిగా, ఉర్ధూ కవి రహీంఖాన్‌గా కందుకూరి రాజశేఖర్‌ నటించారని ఆయన తెలిపారు. ఈ చిత్రం కోసం రామోజీ ఫిలింసిటీలో వేసిన తులసీదాస్‌ కుటీరం, మీరాబాయి మందిరం, కాశీరాజు దర్బారు తదితర సెట్స్‌ కనువిందు చేస్తాయని దర్శకుడు వివరించారు.

ఈ చిత్రానికి సంగీతం: శశిప్రీతమ్‌, ఛాయాగ్రహణం: మధు మహంకాళి, ఎ పాటలు, ప్రాజెక్ట్‌ డిజైనర్‌: కాపర్తి వీరేంద్ర, నిర్మాత: మచ్చా శ్రీనివాసరావు, రచన, దర్శకత్వం: అల్లాణి శ్రీధర్‌.