అలీ కథానాయకుడిగా శ్రీ ఫిలిం ప్రొడక్షన్స్ పతాకంపై పులిరత్నం, కె.ఎస్. రత్నకుమార్
నిర్మించిన చిత్రం 'తిమ్మరాజు'. 'రాళ్ళు' అనే టెలిఫిలింకు జాతీయ అవార్డు పొందిన
వేమగిరి దర్శకుడిగా పరిచయమవుతున్నారు. షూటింగ్ పూర్తయి ఆడియో విడుదల
కార్యక్రమం మాదాపూర్లో జరిగింది.ముఖ్య అతిథి ఇ.వి.వి. సత్యనారాయణ ఆడియోను
ఆవిష్కరించారు.
ఇవివి మాట్లాడుతూ - 'చాలామంది 18 ఏళ్ళకు, 40 ఏళ్ళకు ఇండిస్టీకి
వస్తారు. అలీ మాత్రం నాలుగేళ్ళకే వచ్చి స్థిరపడ్డాడు. ఇప్పటికీ అదే నమ్రత, గౌరవం.
మంచి వ్యక్తిగా అందరి మనసులు దోచుకున్నాడు. సినిమాలో ఆలీకి రెండు సన్నివేశాలు
కేటాయించినా చాలు. దాంతోనే మెప్పిస్తాడు. ఈ సినిమా కాన్సెప్ట్ చెప్పాడు. ఆ ఆలోచన
నాకు రాలేదేనని అనిపించింది. మంచి విజయాన్ని సాధిస్తుందనే నమ్మకముంది' అని
తెలిపారు.
అచ్చిరెడ్డి మాట్లాడుతూ -'అలీ, బ్రహ్మానందం...హాస్యానికి మరోపేరు. వారు
లేకపోతే సినిమా నిలబడని రోజులు. ఎస్.వి.కృష్ణారెడ్డిని హీరోగా నిలబెట్టిన అలీ ఇప్పటివరకు
వెయ్యి భిన్నమైన పాత్రలు పోషించారు. ఇంకా మరిన్ని పాత్రలు చేయాలి' అని అన్నారు.
శివకృష్ణ మాట్లాడుతూ -'1981లో అలీకి చిన్న వేషం ఇప్పించాలని ప్రయత్నించి
ఫెయిలయ్యాను. పెద్ద స్టార్ అవుతాడని అప్పుడే అనుకున్నా, అది నిజమయింది.
నటుడికి వ్యక్తిత్వం ముఖ్యం. అది అలీలో ఉంది. ఈ చిత్రంలో రాజకీయ నాయకుడిగా
తొలిసారిగా నటించా'నని తెలిపారు.
దర్శకుడు వేమగిరి మాట్లాడుతూ -'ఇవివి, జంధ్యాల వంటి దర్శకులను
గుర్తుచేసుకొని కథ రాసుకున్నా. ఆరంభంలో ఎలా తీయాలనుకున్నానో అది నెరవేరింది. అలీ
చక్కటి సహకారాన్ని అందించారు. దర్శకునిగా పరిచయం చేసిన నిర్మాతలకు కృతజ్ఞతలు
తెలియజేసుకుంటున్నా'నని పేర్కొన్నారు.