విజయవంతంగా నంది నాటకోత్సవాలు

రంగస్థల నాటకం చూసి చెడిపోయిన వారెవరూ లేరని ప్రసిద్ధ రంగస్థల కళాకారుడు, 2009 ఎన్టీఆర్‌ రంగస్థల పురస్కార విజేత ఆచార్య చాట్ల శ్రీరాములు అభిప్రాయపడ్డారు. తొమ్మిది రోజులుగా ఖమ్మంలో జరుగుతున్న నంది నాటకోత్సవాలు-2009 ముగింపు వేడుకల్లో రాష్ట్ర మంత్రి రాంరెడ్డి వెంకటరెడ్డి చేతుల మీదుగా ఆయన పురస్కారం అందుకున్నారు. తన జీవితంలో లభించిన అత్యంత ప్రతిష్టాత్మకమైన పురస్కారంగా ఆచార్య చాట్ల పేర్కొన్నారు. అవార్డు ద్వారా తనకు లభించిన రూ.లక్ష నగదును రంగస్థల కళాకారుల కోసం తాను నిర్వహిస్తున్న ట్రస్టుకు ఖర్చు చేస్తామన్నారు. బాలల విభాగంలో నాటకాలను ప్రవేశపెట్టడాన్ని ఆయన అభినందించారు. తన వద్ద ఎంతో మంది పెద్దపెద్ద కథానాయకులు నటన నేర్చుకున్నారని, అదంతా వారి గొప్పదనమేనన్నారు. ఈ సందర్భంగా మంత్రి రాంరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ కళాకారులు ఎప్పుడో ఒకసారి నటిస్తుంటారని, రాజకీయనాయకులు మాత్రం నిత్యం నాటకాలు ఆడుతుంటారని వ్యాఖ్యానించారు. అయితే ఆ నాటకాలను ప్రజలు ఎంతో కాలం నమ్మరన్నారు. కళాకారుల సంక్షేమానికి తాను ముఖ్యమంత్రితో చర్చిస్తానని హామీ ఇచ్చారు. వారికి ఇళ్ల పట్టాలు, రేషన్‌కార్డులు, ఆరోగ్యశ్రీ వర్తించేలా కృషి చేస్తామన్నారు.

ఉత్తమ ప్రదర్శనలకు బహుమతుల ప్రదానం..: తొమ్మిది రోజులుగా జరుగుతున్న నంది నాటకోత్సవాల్లో విభాగాల వారీగా నంది అవార్డులను అందించారు. పద్యనాటక విభాగంలో 'విప్రనారాయణ' (ప్రథమ), 'శ్రీఖడ్గతిక్కన' (ద్వితీయ), 'విరాటపాండవీయం' (తృతీయ) స్థానాలను సాధించాయి. సాంఘిక నాటక విభాగంలో 'సైసై..జోడెడ్లాబండి' (ప్రథమ), 'ఇక్కడ కాసేపు ఆగుదాం' (ద్వితీయ), బొరుసులేని బొమ్మ (తృతీయ), సాంఘిక నాటిక విభాగంలో 'అరవై దాటాయి' (ప్రథమ), గాయత్రి డాటర్‌ ఆఫ్‌ బషీర్‌ అహ్మద్‌ (ద్వితీయ), 'అమ్మో..ఇసప్పురుగు' (తృతీయ), బాలల విభాగంలో 'బాపూ కలలుగన్న దేశం' (ప్రథమం), 'విజయదశమి' (ద్వితీయ), 'బుక్కీ' (తృతీయ) స్థానాలను సాధించాయి. బాలల విభాగంలో సాయిరాం, బాలనటి కనకలక్ష్మిలకు అద్భుత నటనా పురస్కారాలు లభించాయి. బళ్లారి రాఘవ అవార్డు గుమ్మడి గోపాలకృష్ణ (వేమన పాత్రధారి), ఉత్తన నటి అవార్డును సురభి ప్రభావతి (విప్రనారాయణలో వేదవతి పాత్రధారి)కి లభించాయి.

 
 
 
 
 
 

Copy right reserved for www.cinevinodam.com 2005 :: mail to:rambabu_adla@cinevinodam.com