ఎన్టీఆర్ కథానాయకుడిగా వైష్ణవి ఆర్ట్స్ ప్రై.లి. సంస్థ నిర్మించిన చిత్రం 'అదుర్స్'. నయనతార, షీలా కథానాయికలు. వి.వి.వినాయక్ దర్శకుడు. ఎన్టీఆర్ - వినాయక్ కలయికలో రూపుదిద్దుకున్న మూడో చిత్రం 'అదుర్స్'. సంక్రాంతి సందర్భంగా జనవరి రెండో వారంలో చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. నిర్మాత వల్లభనేని వంశీమోహన్ మాట్లాడుతూ ''ప్రేక్షకుల్లో ఉత్సాహాన్ని రేకెత్తించే కాంబినేషన్ మా హీరో - దర్శకులది. సంక్రాంతికి కావల్సినంత వినోదాన్ని పంచేలా ఉంటుంది మా చిత్రం'' అన్నారు. ''ఎన్టీఆర్ తప్ప మరెవ్వరూ చేయలేని విధంగా 'అదుర్స్'లోని రెండు పాత్రల్నీ పోషించారు. ఆయన నటన ప్రధాన ఆకర్షణ. ఇటీవల విడుదల చేసిన పాటలకు మంచి ఆదరణ వస్తోంది. కథపరంగానూ, సాంకేతికంగానూ ఉన్నత విలువలతో రూపుదిద్దుకొంది'' అన్నారు వినాయక్. ఈ చిత్రంలో మహేష్ మాంజ్రేకర్, సాయాజీ షిండే, నాజర్, ఆశిష్ విద్యార్థి, బ్రహ్మానందం, ఎమ్మెస్ నారాయణ, వేణుమాధవ్, రమాప్రభ, రాజ్యలక్ష్మి, సుధ తదితరులు నటించారు. సమర్పణ: కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని), కథ-మాటలు: కోన వెంకట్, కెమెరా: ఛోటా కె.నాయుడు, సంగీతం: దేవిశ్రీప్రసాద్.
|