Bookmark and 

Share   Cinevinodam Subscribe
 
'కథ-స్క్రీన్‌ప్లే-దర్శకత్వం:అప్పల్రాజు'
     రామ్‌గోపాల్‌వర్మ దర్శకత్వంలో సునీల్‌ హీరోగా, స్వాతి హీరోయిన్‌గా తెరకెక్కే ‘కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం అప్పల్రాజు’ సినిమా ప్రారంభోత్సవం అన్నపూర్ణ స్టూడియోలో ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా ‘టాలెంట్‌ ఎవడబ్బ సొత్తూ కాదు’ అనే పల్లవితో సాగే పాట సీడీని విడుదల చేసా రు. ఈ పాటలో తనతో సహా అందరు ప్రముఖ దర్శకులపైనా సెటైర్లు ఉండడం విశేషం. 'నా వ్యక్తిగత జీవితాన్నే తెరకెక్కిస్తున్నాను. హ్యాస్యాన్ని మేళవించి తీస్తున్నా. దర్శకుడు కావాలనుకున్న వ్యక్తి ఈ రంగంలో ఎలా ఆలోచిస్తాడో, అసలు దర్శకులు ఎలా ఉంటారో వ్యంగ్యంగా చూపిస్తున్నా'అని దర్శకుడు రామ్‌గోపాల్‌వర్మ తన తాజా సినిమా గురించి చెప్పుకొస్తున్నాడు. శ్రీదేవి ఈ చిత్రానికి హాజరు కావడం విశేషం. బోనీకపూర్‌, అక్కినేని నాగార్జున, గుణశేఖర్‌, కె.రాఘవేంద్రరావు, శ్రీనువైట్ల, బోయపాటి శ్రీను, రానా, స్వాతి తదితరులు హాజరయ్యారు. పరిశ్రమలోని పలువురి దర్శకులపై రికార్డు చేసిన ఓ పాటను కూడా వినిపించారు. రొటీన్‌గా వుండే స్విచ్చాన్‌ పద్దతి లేకుండా సునీల్‌పై ముహూర్తపుషాట్‌ తీశారు. దీనికి శ్రీదేవి, నాగార్జున సంయుక్తంగా క్లాప్‌ కొట్టారు. అనంతరం వర్మ మాట్లాడుతూ '12 సంవత్సరాల తర్వాత తెలుగులో చేస్తున్న సినిమా ఇది. నాగార్జున, శ్రీదేవిలను అతిథులుగా పిలవడం వెనుక ఓ కథ ఉంది. నా సినీ జీవితానికి నాగ్‌ క్లాప్‌ ఇచ్చాడు. శ్రీదేవిని చూడ్డానికి లైన్‌లో నిలుచొని టిక్కెట్‌ కొని చూసిన రోజులున్నాయి. నేనీ రంగాన్ని ఎంచుకోవడానికి కారణం ఆమె. అందుకే ఈ రోజు ఇలా కలిశాం' అన్నారు.

శ్రీదేవి మాట్లాడుతూ-'చాలాకాలం తర్వాత మనవాళ్లను కలుసుకునే అవకాశం వచ్చినందుకు ఆనందంగా ఉంది. ఇలా రావడానికి రామూనే కారణం. నాగ్‌తో నా తొలి సినిమా 'ఆఖరిపోరాటం' అనుభవాలు మర్చిపోలేను. ఆయన మంచి వ్యక్తి. వర్మ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం పెద్ద విజయం సాధించాలి. సిల్వర్‌జూబ్లీకి మళ్లీ నేను, నా భర్త కలిసి హాజరవ్వాలి' అన్నారు. నాగార్జున మాట్లాడుతూ...'రామూ వస్తే కొత్త టెక్నీషియన్స్‌కు పని దొరుకుతుంది. ఆయన తీస్తున్న 'రక్తచరిత్ర' పాటలు, ట్రైలర్స్‌ ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. ఆ సినిమా కోసం ఎదురుచూస్తున్నా. సునీల్‌ నటిస్తున్న ఈ చిత్రం విజయం సాధించాలి' అన్నారు. సునీల్‌ వ్యాఖ్యానిస్తూ...'ఊహించనివన్నీ జరుగుతున్నాయి. వర్మ 'ప్రేమకథ' సినిమాలో నటించాలని ప్రయత్నించా. పోటీ ఎక్కువగా ఉండడం వల్ల ఎంపికవ్వలేదు. అప్పుడు మిస్సయింది ఇప్పటికీ వచ్చిందేమో. శ్రీదేవికి వీరాభిమానిని' అని చెప్పారు. ఈ చిత్రంలో స్వాతి, బ్రహ్మానందం, అలీ, తనికెళ్లభరణి, ఎం.ఎస్‌, వేణుమాధవ్‌ తదితరులు నటిస్తున్నారు. కెమెరా: వై.సుధాకరరెడ్డి, ఆర్ట్‌:ఆర్‌.కృష్ణ, సంగీతం:కోటి, సమర్పణ: వందిత కోనేను, బ్యానర్‌: శ్రేయా ప్రొడక్షన్స్‌, నిర్మాత: కిరణ్‌ కుమార్‌ కోనేరు.

Copy right reserved for www.cinevinodam.com 2005 :: mail to:rambabu_adla@cinevinodam.com