రాజశేఖర్ తండ్రీ కొడుకుగా ద్విపాత్రాభినయం చేస్తున్న చిత్రం ‘అర్జున’. ఎ.ఎ. ఆర్ట్స్ పతాకంపై కణ్మణి దర్శకత్వంలో కె.చంద్రశేఖర్, ఉదయ్శంకర్ నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ హైదరాబాద్లో జరుగుతోంది. ఈ సందర్భంగా శనివారం ఏర్పాటు చేసిన ప్రెస్మీట్లో రాజశేఖర్ మాట్లాడుతూ - ‘‘ఏడాది క్రితమే ఈ కథ విన్నాను. ఈ ఏడాది కాలంలో ఈ కథను మరింత మెరుగుపరిచారు. కణ్మణిగారి గత చిత్రాలు చూశాను.
ఆయన పనితనం నచ్చింది. ఈ సినిమా సహజంగా ఉంటుంది. వెలిగొండ శ్రీనివాస్ ఇచ్చిన మాటలు, వందేమాతరం శ్రీనివాస్ అందించిన పాటలు బాగున్నాయి. పొలిటికల్, ఫ్యామిలీ సబ్జెక్ట్ ఉన్న చిత్రం ఇది’’ అన్నారు. కణ్మణి మాట్లాడుతూ -‘‘హాలీవుడ్కి ఒక ‘గాడ్ ఫాదర్’, బాలీవుడ్కి ఒక ‘సర్కార్’లా టాలీవుడ్కి ‘అర్జున’ అవుతుంది. తండ్రి మాటకు అనుగుణంగా నడుచుకునే కొడుకు కథ ఇది. విజయవాడ బ్యాక్డ్రాప్లో సినిమా సాగుతుంది’’ అని చెప్పారు.రాజశేఖర్తో తనకిది నాలుగో సినిమా అని, ఏఏ ఆర్ట్స్లో ఎక్కువ సినిమాలకు పనిచేశానని, ఈ చిత్రకథ చాలా పవర్ఫుల్గా ఉందని, మంచి పాటలు కుదిరాయని వందేమాతరం అన్నారు. ఈ సమావేశంలో శివాజీరాజా, రేఖ, వెలిగొండ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఈ చిత్రానికి సహనిర్మాతలు: జి. మహేష్చౌదరి, వి. కళ్యాణచక్రవర్తి.
|