ఫిలిం న్యూస్
 
 
 
 
యువతరం ‘దునియా’

క్రాంతి, నిశాంత్, డిక్కు, రీనా జైన్, అలీషా బేగ్ ప్రధాన పాత్రలు పోషించిన చిత్రం ‘దునియా’. ఎల్.కె.రావు దర్శకత్వంలో కె.గీతాశ్రీ నిర్మించిన ఈ చిత్రం పాటలను దిల్‌రాజు చేతుల మీదుగా హైదరాబాద్‌లో విడుదల చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ-‘‘అందరూ కొత్తవాళ్లతో చేసిన సినిమా ఇది. సినిమా అంటే ఇష్టంతో ఈ రంగంలోకి అడుగుపెట్టారు వీళ్లంతా. కొన్నాళ్ల క్రితం అదే ఇష్టంతో వ్యాపారాలను పక్కనపెట్టి ఈ రంగంలోకి అడుగుపెట్టి, మంచి నిర్మాతను కాగలిగాను. అలాగే వీళ్లు కూడా సక్సెస్ సాధిస్తారని ఆశిస్తున్నాను.

నిర్మాత కె.గీతాశ్రీ నా దగ్గరకు వచ్చి కలిసినప్పుడు ‘మీరు విన్న కథ తెరపై సంతృప్తికరంగా వస్తేనే సినిమాను విడుదల చేయండి’ అని చెప్పాను. రెండోరోజు వచ్చి సినిమాపై కాన్ఫిడెంట్‌గా ఉన్నామని చెప్పారు. వారి విశ్వాసం నాకు నచ్చింది. తప్పకుండా సినిమా సక్సెస్ సాధించాలని కోరుకుంటున్నాను. ఈ రోజుల్లో సినిమా తీయడం కంటే... సినిమాకు ప్రేక్షకులను రప్పించుకోవడం కష్టమైన విషయం.

అందుకు సంబంధించిన ప్రయత్నాలను నేటి నుంచే ప్రారంభిస్తారని ఆశిస్తున్నాను’’అని చెప్పారు. అవకాశం ఇచ్చిన దర్శక, నిర్మాతలకు సంగీత దర్శకుడు రమణ్‌రాథోడ్ కృతజ్ఞతలు తెలిపారు. నిర్మాత మాట్లాడుతూ- ‘‘ఇదొక వినూత్న ప్రయత్నం. యువతరాన్ని వినోదంతో పాటు సందేశాన్ని ఇస్తున్నాం’’ అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: కె.రాజేష్, ఆర్ట్: కేవీ సుబ్బారావు, నిర్మాణం: ఇన్‌టెక్ ఫిలింస్.