మంచి సినిమాని ప్రోత్సహిస్తున్న ‘హైదరాబాద్ ఫిలింక్లబ్’ ‘‘షార్ట్ & డాక్యుమెంటరీ ఫిల్మ్ ఫెస్టివల్
ఆఫ్ హైదరాబాద్’’ పేరుతో చిత్రోత్సవాన్ని రవీంద్రభారతిలో సెప్టెంబర్ 24 నుండి 28 వరకూ
నిర్వహిస్తోంది. ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫిలిం టివి అండ్ థియేటర్ డవలప్ మెంట్ కార్పొరేషన్ వారు దీనికి పూర్తి
సహకారాన్ని అందిస్తున్నారు. ఈ చిత్రోత్సవం విశేషాలను వివరించే సమావేశంలో సమాచారశాఖ
కమీషనర్, ఎ.ఫి.ఎఫ్.టి.డి.సి మేనేజింగ్ డైరెక్టర్ సి.పార్థసారధి మాట్లాడుతూ - మంచి
చిత్రాలను ప్రోత్సహించాలనే ప్రభుత్వ విధానంలో భాగంగానే‘హైదరాబాద్ ఫిల్మ్ క్లబ్’ నిర్వహిస్తున్న ఈ
చిత్రోత్సవానికి తోడ్పాటును అందిస్తున్నాం. ఇందులో దాదాపు 100 ఎంట్రీలు వచ్చే అవకాశం ఉంది.
వీటిని ఇంగ్లీషు సబ్ టైటిల్స్ తో ప్రదర్శిస్తారని అన్నారు. తనికెళ్ళ భరణి మాట్లాడుతూ - గత 36
ఏళ్ళుగా నిరాటంకంగా నిర్వహిస్తున్న ‘హైదరాబాద్ ఫిల్మ్ క్లబ్’ ఆధ్వర్యంలో ఈ ఉత్సవం భారీస్థాయిలో
మంచి జాపకంగా మిగిలి పోతుంది. ఈ ఉత్సవంలో ప్రకాష్ రాజ్, విష్ణు తదితర సినీప్రముఖులు కూడా
పాల్గొంటారని అన్నారు.
ఫెస్టివల్ డైరెక్టర్ ప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ - జాతీయ స్థాయిలో జరిగే ఈ ఫెస్టివల్ లో 30 నిముషాలు
మించని షార్ట్, డాక్యుమెంటరీ, యానిమేషన్ చిత్రాలతో పాటు ఔత్సాహికులు నిర్మించే క్యాంపస్
చిత్రాలను కూడా ఇందులో ప్రదర్శిస్తాం. ఎంట్రీలను సెప్టెంబర్ 10లోగా 500 రూపాయిల ఫీజుతో
అందజేయవచ్చునని అన్నారు. ఫెస్టివల్ కో డైరెక్టర్ ఎం.వి.రఘు మాట్లాడుతూ - డిజిటల్ టెక్నాలజీ
వచ్చాక చిత్ర నిర్మాణంలో విప్లవం వచ్చింది. మంచి ఆలోచన వస్తే చాలు,ఎక్కువ ఖర్చు లేకుండా చేసే
అవకాశం కలిగింది. చాలా మంది యువకులు మంచి చిత్రాలు చేస్తున్నారు. ఈ ఫెస్టివల్ లో భాగంగా
డిజిటల్ సినిమా, ఫిల్మ్ మేకింగ్ తదితర అంశాలపై వర్క్ షాప్ లు కూడా నిర్వహిస్తామని అన్నారు.
ఈ సమావేశంలో ఫెస్టివల్ వెబ్ సైట్ ని, పోస్టర్ ని సి.పార్థసారధి ఆవిష్కరించారు. కృష్ణమోహన్ రెడ్డి
కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.