ఫిలిం న్యూస్
 
 
 
 
వరసగా ఆరు సినిమాలు
రెండు తెలుగు, మూడు తమిళ చిత్రాలతో అందాలనటి హన్సిక బిజీబిజీగా వున్నారు. ఒకేసారి ఐదు సినిమాలకు సైన్ చేయడం అంటే మాటలు కాదు. డేట్స్ ఖచ్చితంగా ప్లాన్ చేసుకోకపోతే షూటింగ్స్ కి ఆటంకం వాటిల్లే ప్రమాదంవుంది. అయితే ‘మిస్ ఫర్ ఫెక్ట్’ అనిపించుకోవాలన్నది హన్సిక ధ్యేయం. అందుకే చేతిలో వున్న ఐదు సినిమాలకు పర్ ఫెక్ట్ గా డేట్స్ ఇచ్చి, ఏ షూటింగ్కూ ఆటంకం కలగకుండా చూసుకుంటున్నారామె. ‘దేశముదురు’, ‘కంత్రి’, ‘మస్కా’.. ఇలా తెలుగులో పలు విజయవంతమైన చిత్రాల్లో నటించిన ఈ టీనేజ్ బ్యూటీ దాదాపు ఏడాది తర్వాత తెలుగులో కమిట్ అయిన చిత్రం ‘కందిరీగ’. ఎందుకింత గ్యాప్ తీసుకున్నారు? అని అడిగితే - ‘తెలుగులో నా గత చిత్రం నిరాశపరచింది. ఈసారి సంతృప్తిపరిచే సినిమా చేయాలనే ఆలోచనతోనే మంచి సినిమా కోసం ఆగాను. నేను తీసుకున్న ఈ గ్యాప్ నాకు మంచే చేసింది. ‘కందిరీగ’ లాంటి ఎగ్జయిటింగ్ ప్రాజెక్ట్ కి అవకాశం వచ్చింది. ఈ చిత్రకథ, నా పాత్ర చాలా బాగున్నాయి. ‘మస్కా’ తర్వాత మళ్ళీ రామ్ తో సినిమా చేయడం ఆనందంగా వుంది. అలాగే ఈ గ్యాప్ లో నాకు తమిళ పరిశ్రమ నుంచి అవకాశాలు వచ్చాయి. అవి బాగుండడంతో అంగీకరించాను. తమిళంలో ఒక్క సినిమా కూడా విడుదల కాక మునుపే మూడు సినిమాలకు అవకాశం వచ్చింది. అన్నీ మంచి సినిమాలే ఒప్పుకున్నాను. తమిళీయులు నన్ను ‘చిన్న ఖుష్బూ’ అంటూ అభిమానం కనబరుస్తున్నారు అని పొంగిపోతోంది హన్సిక.తమిళంలో తొలిసినిమా ‘మాప్పిళ్ళయ్’ విడుదలయి్యంది. ఇది మంచి సినిమా. మాస్ ఎంటర్ టైనర్. పెద్ద విజయం సాధిస్తుందని నమ్మకం. ఈ విజయంతో కోలీవుడ్ ప్రేక్షకులకు మరింత దగ్గరవుతా. ఇంకా తమిళంలో ‘ఎంగేయుమ్ కాదల్’, ‘వేలాయుధం’, ‘ఒరు కాల్ ఒరు కన్నాడి’ సినిమాలు చేస్తున్నాను. ఈ మూడు సినిమాలు ఈ ఏడాదే విడుదలవుతాయి. అలాగే తెలుగులో అగ్ర నిర్మాణ సంస్థలైన బెల్లంకొండ శ్రీ సాయిగణేష్ ప్రొడక్షన్స్ ప్రై.లి. నిర్మిస్తున్న ‘కందిరీగ’, దిల్ రాజు శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ ‘ఓ మై ఫ్రెండ్’చిత్రాలు ఈ ఏడాదే తెరపైకి వస్తాయి. ఒకే సంవత్సరంలో ఆరు సినిమాలు విడుదల కావడం ఆనందంగావుంది. సో.... 2011నాదే అని చెబుతోంది హన్సిక.