ఫిలిం న్యూస్
 
 
 
 
కొత్తగా ‘మనసే మందారం’
సరికొత్త ప్రేమకథాంశంతో అలయెన్స్‌ పిక్చర్స్‌ సంస్థ ‘మనసే మందారం’ పేరుతో ఓ చిత్రం రూపొందిస్తోంది. శ్రీకి-ఆకాంక్ష హీరోహీరోయిన్లుగా పరిచయమవుతున్నారు. జయతీర్థ దర్శకత్వంలో బి.గోవిందరాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. షూటింగ్‌ కార్యక్రమాలు దాదాపుగా పూర్తి చేసుకున్న ఈ చిత్రం పోస్ట్‌ ప్రొడక్షన్‌ కార్యక్రమాలు సైతం సమాంతరంగా జరుపుకుంటోంది.

దర్శకుడు జయతీర్థ మాట్లాడుతూ- 'సినిమా పుట్టాక ఇప్పటివరకూ లెక్కలేనన్ని ప్రేమకథలు వచ్చాయి. సరికొత్తగా ఆవిష్కరించిన ప్రేమకథలన్నీ దాదాపుగా ఘనవిజయం సాధించాయి. ప్రేమలో ఓ కొత్త కోణాన్ని ఆవిష్కరిస్తూ కథనం ఉంటుంది. రెండు యదార్థ సంఘటనల ఆధారంగా కథను రూపొందించాం. యువతరానికే కాకుండా అందరికీ నచ్చే ప్రేమకథ ఇది' అని అన్నారు.

నిర్మాత బి.గోవిందరాజు మాట్లాడుతూ...'కథకు కొత్త తారలే బాగా సూట్‌ అవుతారు. అందుకే కొత్త హీరోహీరోయిన్లు పరిచయం చేస్తున్నాం. తొలి ప్రేమకు ఫీల్‌గుడ్‌ మ్యూజిక్‌ ఇచ్చిన దేవా చక్కటి అనుభూతినచ్చే బాణీలు కూర్చారు. ఇందులో మొత్తం ఆరుపాటలుంటాయి. ఆంధ్రప్రదేశ్‌ నుంచి కాశీ వరకూ ఏడు రాష్ట్రాల్లో చిత్రీకరణ చేస్తున్నాం. షూటింగ్‌ తుదిదశకు చేరుకుంది. మరో పక్క పోస్ట్‌ప్రొడక్షన్స్‌ కూడా జరుగుతోంది. త్వరలో ఆడియోను విడుదల చేస్తాం' అని అన్నారు.

నాజర్‌, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, వేణుమాధవ్‌, సూర్య, శరణ్‌, రంగాయన రఘు, కుమారి ముత్తు, వెంకట్‌ తదితరులు ఇతర పాత్రలు చేస్తున్న ఈ చిత్రానికి కెమెరా :రవి ఎస్‌.కుమార్‌, ఫైట్స్‌: రామ్‌లక్ష్మణ్‌, డి.డానీ, పాటలు: రామజోగయ్యశాస్ర్తి, అనంత్‌శ్రీరామ్‌.