వెంకటేష్ త్రిపాత్రాభినయం చేస్తున్న చిత్రం ‘నాగవల్లి’. అనుష్క, రిచాగంగోపాథ్యాయ్,
శ్రద్ధాదాస్, కమలినీ ముఖర్జీ, పూనమ్కౌర్ కథానాయికలుగా నటిస్తున్న ఈ చిత్రానికి పి.వాసు
దర్శకత్వం వహిస్తున్నారు. బెల్లంకొండ సురేష్ నిర్మాత. ఈ సినిమాలోని పాటలు ఇటీవల
విడుదలై ఘనవిజయం సాధించిన సందర్భంగా డబుల్ప్లాటినమ్ డిస్క్ వేడుకను
నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో వెంకటేష్, పరుచూరి బ్రదర్స్, పి.వాసు, బెల్లంకొండ సురేష్,
బి.గోపాల్, రాఘవేంద్రరావు, సురేష్బాబు, రిచా, అనుష్క, కమలినీ, శ్రద్ధాదాస్,
చంద్రబోస్, సంగీతదర్శకుడు గురుకిరణ్, బోయపాటి శ్రీను, శ్రీనువైట్ల తదితరులు
పాల్గొన్నారు.
వెంకటేష్ మాట్లాడుతూ- ‘చంద్రబోస్ సాహిత్యం, గురుకిరణ్ సంగీతం ఈ వేడుకకు
కారణం. సంగీతం విజయం సాధించడంతో తొలిపరీక్ష పాస్ అయ్యాం. ఈ సినిమా ఓ వైవిధ్యమైన
ప్రయత్నం. ‘చంటి’తో కొత్తకోణంలో ఆవిష్కరించిన దర్శకుడు వాసు నన్ను ఈ చిత్రంలోనూ కొత్త
కోణంలో చూపించారు. మరో హిట్చిత్రమిది’ అన్నారు.
పి.వాసు మాట్లాడుతూ- ‘ఆడియో విజయం ఎప్పుడూ..సంగీత దర్శకుడు,
సాహిత్యకారులదే. చంద్రబోస్ మీటరుకి తగ్గ సాహిత్యం ఇచ్చారు. అందుకు తగ్గ సంగీతం
గురుకిరణ్ ఇచ్చారు. నేపథ్య సంగీతం హైలైట్ అవుతుంది. స్క్రిప్టు విషయంలో పరుచూరి
సహకారానికి కృతజ్ఞతలు. ఆడియోలానే సినిమా పెద్ద విజయం సాధించాలి’
అన్నారు.
బెల్లం కొండ సురేష్ మాట్లాడుతూ - ‘డిసెంబర్ 16న సినిమా వస్తోంది. ఆడియో
డబుల్ ప్లాటినం సాధించడం అదృష్టంగా భావిస్తున్నా. వెంకీ మార్క్ చిత్రమిది. డాక్టర్గా,
రారాజుగా ఆయన నటన అసమానం. అనుష్కతో ఫ్లాష్బ్యాక్లో వచ్చే రాజావారి పాత్ర సినిమాకే
హైలైట్. సాహిత్యం, సంగీతం అస్సెట్స్. సినిమా రిలీజ్ తర్వాత అభిమానుల, ప్రేక్షకుల
మధ్య 3రోజులపాటు విజయోత్సవాన్ని భారీగా నిర్వహిస్తాం’ అన్నారు.
పరుచూరి బ్రదర్స్ మాట్లాడుతూ-‘ఐదుగురు నాయికల్లో ఎవరు వెంకీ హీరోయిన్ అనేది
సస్పెన్స్. ప్రతి ఫ్రేమ్ పంచకన్యలతో రంగులమయంగా ఉంటుంది. నాగవల్లి ఎవర్ని
ఆవహిస్తుందనేది సస్పెన్స్’ అన్నారు .
గురుకిరణ్ మాట్లాడుతూ ‘ఆడియోకి ఈ స్థాయి విజయాన్నిచ్చిన శ్రోతలకు కృతజ్ఞతలు.
చంద్రబోస్ సహకారం మరువలేనిది’ అన్నారు.