సినీనటుడు రాజశేఖర్ హైదరాబాద్లో కొత్తగా 'నేచర్' పేరుతో స్కూలు ఏర్పాటు చేస్తున్నట్లు
ప్రకటించారు. నేటి పోటీలో పిల్లలు తీవ్రమైన ఒత్తిడి ఎదుర్కుంటున్నారని, వీటన్నింటికి అతీతంగా
తమ స్కూల్లో స్వేచ్ఛాయుత వాతావరణంలో బోధన సాగుతుందని రాజశేఖర్, జీవితలు
నిర్వహించిన విలేకరుల సమావేశంలో వెల్లడించారు. నర్సరీ నుంచి హైస్కూల్ విద్య వరకు ఈనెల
10 నుంచి అడ్మిషన్లు జరుగుతాయన్నారు.
21న సీఎం రోశయ్య జూబ్లీహిల్స్ రోడ్డునెం.45లోని స్కూల్ను ప్రారంభిస్తారన్నారు. వివిధ కారణాల
వల్ల ప్రస్తుతం తల్లిదండ్రులు పిల్లలపై పూర్తిస్థాయిలో శ్రద్ధ చూపలేకపోతున్నారని, ఈ లోటును తమ
స్కూలు ద్వారా భర్తీచేసేలా అత్యంత శ్రద్ధ తీసుకుంటున్నామని వివరించారు. పిల్లలపై కాలుష్య
ప్రభావం పడకుండా ఎకోఫ్రెండ్లీ తరహాలో స్కూలు నిర్మాణం జరుగుతుందని చెప్పారు.
తెలుగుదనం, సంస్కృతి సంప్రదాయాలపై విద్యార్థులకు చిన్నప్పటి నుంచే అవగాహన కలిగే
విధంగా బోధనా సిబ్బందిని ఏర్పాటు చేయడం నేచర్ స్కూలు ప్రత్యేకతని జీవిత వివరించారు.
ఒక్కో తరగతిలో 25 సీట్లు ఉన్నాయని, ఫీజులు రూ.20వేల నుంచి ప్రారంభమవుతాయని చెప్పారు.
ఒకటి నుంచి ఐదో తరగతి వరకు ఎలాంటి ఎంట్రన్స్ టెస్టులు లేకుండా విద్యార్థులను
చేర్చుకుంటున్నామన్నారు. ఇతర వివరాలకు WWW.natureschool.in వెబ్సైట్ సంప్రదించవచ్చు.