దోషులు ఎందరు తప్పించుకున్నా ఫర్వాలేదు కానీ... ఒక్క నిర్ధోషికి మాత్రం శిక్ష పడకూడదు అన్నది న్యాయశాస్త్రంలోని ముఖ్య సిద్ధాంతం. అనాలోచితంగా తీసుకునే నిర్ణయాల వల్ల అమాయకులకు అన్యాయం జరిగే ప్రమాదం ఉంది. అందుకే... ఎంతటి సమస్య అయినా సరే... ఆలోచించకుండా నిర్ణయాలు తీసుకోకూడదు. మనసు విప్పి మాట్లాడుకుంటే ఏ సమస్యకైనా తప్పనిసరిగా పరిష్కారం లభిస్తుంది... అనే మంచి కాన్సెప్ట్తో రూపొందిన చిత్రం 'ఒక్క క్షణం'.
రాజీవ్కనకాల, కోట శ్రీనివాసరావు, గిరిబాబు, ఆహుతి ప్రసాద్, తెలంగాణ శకుంతల, ఎల్బీ శ్రీరాం, జీవా, వైజాగ్ ప్రసాద్, నారాయణరావు, రక్ష ముఖ్య పాత్రలు పోషించిన ఈ చిత్రానికి కొడాలి వెంకటేశ్వరరావు దర్శకుడు. ఎమ్మెస్ రెడ్డి 'బాలరామాయణం' చిత్రంలో రావణ పాత్ర పోషించిన స్వాతి బాలినేని ఈ చిత్రాన్ని నిర్మించడం విశేషం. నిర్మాత స్వాతి బాలినేని మాట్లాడుతూ-"దాదాపు దశాబ్ధంన్నర క్రితం 'బాల రామాయణం' చిత్రంతో సినీ కెరీర్ ప్రారంభించాను. తర్వాత మళ్లీ ఇన్నాళ్లకు నిర్మాతగా మీ ముందుకు రావడం చాలా ఆనందంగా ఉంది.
ఇది మంచి ప్రయోగాత్మక చిత్రం. మా ఈ ప్రయత్నాన్ని దిగ్విజయం చేస్తారని ఆశతో ఉన్నాం' అన్నారు. "నేటి సమాజంలో జరుగుతున్న పరిణామాలకు స్పందించాల్సిన అవసరం ప్రజలకే వస్తే... వారి మానసిక ధోరణి ఎలా ఉండాలి? అనే కథాంశంతో ఈ చిత్రం రూపొందింది. ప్రతి ఒక్కరినీ ఆలోచింపజేసే సినిమా ఇది. తక్కువ బడ్జెట్తో జనరంజకంగా సినిమాను తీర్చిదిద్దాం. అందరికీ నచ్చుతుందని మా నమ్మకం' అని దర్శకుడు తెలిపారు. ఈ చిత్రానికి మాటలు: శౌరి, కెమెరా: ఏకేఎస్, సంగీతం: అర్జున్, సహ నిర్మాతలు: జి.నివేదిత రెడ్డి, భరత్ వి.రెడ్డి, ఎంపీ తేజ్బాబు, సమర్పణ: జి.జ్ఞాన్చందర్ రెడ్డి, నిర్వాహణ: కొడాలి అనిత, నిర్మాణం: సెవెన్హిల్స్ టెలినెట్వర్క్.