ఫిలిం న్యూస్
 
 
 
 
రామ్‌చరణ్‌ 'రచ్చ' ప్రారంభం
‘మెగాపవర్ స్టార్’ రామ్‌చరణ్‌ కథానాయకుడిగా, మిల్క్ బ్యూటీ తమన్నా కథానాయికగా ‘ఏమైంది ఈవేళ’ చిత్రంతో విజయాన్ని సొంతం చేసుకున్న సంపత్ నంది దర్శకత్వంలో మెగా సూపర్‌గుడ్‌ ఫిలింస్‌ బ్యానర్‌పై ఆర్‌.బి.చౌదరి సమర్పణలో నిర్మాతలు ఎన్.వి.ప్రసాద్, పారస్ జైన్ సంయుక్తంగా నిర్మిస్తున్న ‘రచ్చ’ చిత్రం రామానాయుడు స్టూడియోస్‌లో అత్యంత వైభవంగా ప్రారంభమైంది. మెగాస్టార్ చిరంజీవి క్లాప్ నివ్వగా, ప్రముఖ నిర్మాత డి.సురేష్ బాబు కెమెరా స్విచ్ ఆన్ చేశారు. ఈ కార్యక్రమానికి పరిశ్రమలోని అనేక మంది నిర్మాతలు, దర్శకులు కళాకారులు హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రామ్ చరణ్ మాట్లాడుతూ- ‘మూడు నెలలకుపైగా ఈ చిత్రం యూనిట్ అందరూ చాలా హార్డ్ వర్క్ చేసి ఈ కథ సిద్ధం చేశారు. ముఖ్యంగా ఈ చిత్రం కథాంశంలో హీరో క్యారెక్టరైజేషన్, కమర్షియల్ పాయింట్ నాకు చాలా బాగా నచ్చాయి. మెగా అభిమానులకు కావలసిన అన్ని హంగులూ ఈ కథలో వుండేలా సంపత్ నంది చూసుకున్నారు. తమన్నాతో ఇదే నా మొదటి చిత్రం, అంతేకాదు పరుచూరి బ్రదర్స్తో పనిచేయడం కూడా ఇదే మొదటిసారి. తప్పకుండా మా కాంబినేషన్ విజయం సాధిస్తుందని నమ్ముతున్నాను’’ అన్నారు.

రచయిత పరుచూరి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ- ‘ఎన్నో సూపర్‌హిట్‌ చిత్రాల్ని తీసినా, ఎప్పటికప్పుడు జాగ్రత్తలు తీసుకొంటూ సూపర్‌గుడ్‌ సంస్థ కథను పక్కగా ప్రారంభిస్తుంది. ఇది వారి ఆనవాయితి. ఈ సంస్థలో మేము ఆల్‌రెడీ మూడు సినిమాలు చేశాం. ఇక ఇప్పుడు రామ్‌చరణ్‌ కథానాయకుడుగా నిర్మిస్తున్న చిత్రానికి మొదటిసారిగా పనిచేస్తున్నాం. మగధీరుడ్ని మించే స్థాయిలో ఇవ్వాలని కష్టపడి పని చేస్తున్నాం. ఇక దర్శకుడు సంపత్‌ నంది సకలకళావల్లభన్‌ అన్ని చేసి చూపించగలడు. దీన్ని సూపర్‌హిట్‌ చేసి తన సత్తా నిరూపించుకోగలడని మా నమ్మకం. మాతోపాటు స్టార్‌ వరల్డ్‌ టెక్నీషియన్స్‌ని సూపర్‌గుడ్‌ అధినేతలు పెట్టడం విశేషం. ఇది మా సంపత్‌ నందికి హిట్‌ సినిమా కావాలి’ అన్నారు.

తమన్నా మాట్లాడుతూ- ‘రామ్ చరణ్ తో చేయడం చాలా సంతోషంగా వుంది. ఈ సంవత్సరం నాకు చాలా లక్కీ సంవత్సరం. సూపర్ గుడ్ లాంటి సూపర్ బ్యానర్లో పనిచేయడం, సంపత్ నంది గారు చెప్పిన స్టోరీ చాలా ఇంప్రెసివ్ గావుండడంతో వెంటనే అంగీకరించాను’ అన్నారు.

నిర్మాతల్లో ఒకరైన ఎన్‌.వి.ప్రసాద్‌ మాట్లాడుతూ- ‘ఒక సూపర్‌హిట్‌ చిత్రం ఇవ్వాలని ఎంతో తాపత్రాయంగా మా యూనిట్‌ అందరు కలిసి పని చేస్తున్నాం. 'రచ్చ'కి అన్నీ సమపాళ్ళల్లో కుదిరాయి. చిరంజీవి, రామ్ చరణ్ అభిమానులను, ప్రేక్షకులను ఈ చిత్రం తప్పకుండా అలరిస్తుంది. మణిశర్మ సంగీతం, ఆనంద్ సాయి ఆర్ట్ ఈ చిత్రానికి హైలైట్గా వుంటాయి' అని అన్నారు.

చిత్ర సమర్పకులు ఆర్‌.బి.చౌదరి మాట్లాడుతూ- ‘మా సంస్థలో మంచి కథతో రామ్‌చరణ్‌కి ఈ చిత్రాన్ని అందిస్తున్నాం. ఆల్‌రెడీ గతంలో రామ్‌చరణ్‌తో మొదలుపెట్టిన 'మెరుపు' పెండింగ్‌లో ఉంది. 'రచ్చ' చిత్రాన్ని ముందు పూర్తి చేస్తాం. ఓ మంచి కథను దీనికి ఎంపిక చేశాం. ఇది రామ్‌చరణ్‌ అభిమానుల్ని, అలాగే అన్ని తరగతలవారిని ఆకట్టుకునే చిత్రమ వుతుంది. కొన్ని కారణాల వల్ల ఆగివున్న 'మెరుపు'ని వచ్చే సంవత్సరంలో చేస్తాం. 'రచ్చ'కి పనిచేస్తున్న వారందరికీ నా అభినందనలు’ అని అన్నారు.

దర్శకుడు సంపత్‌ నంది మాట్లాడుతూ- ‘రామ్‌చరణ్‌తో అద్భుతమైన చిత్రం చేసే అవకాశం ఇచ్చిన మెగాస్టార్‌ చిరంజీవి గారికి, హీరో రామ్‌చరణ్‌ గారికి, సూపర్‌గుడ్‌ అధినేతలు చౌదరి గారికి, ప్రసాద్‌ గారికి, పారాస్‌జైన్‌ గార్లకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. రామ్ చరణ్ క్యారెక్టరైజేషన్ డిఫరెంట్ గా వుంటుంది. ఆయన కెరీర్లో ఈ పాత్ర ఓ మైలురాయిగా నిలబడిపోతుంది. మెగాస్టార్‌ భిమానులందరినీ ఆనందపరిచే విధంగా దీన్ని తీర్చిదిద్దుతాను' అని అన్నారు.

రామ్ చరణ్, తమన్నా, ప్రకాష్‌రాజ్‌, ముఖేష్‌ రుషి తదితరులు ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: మణిశర్మ, కెమెరా: సమీర్‌ రెడ్డి, ఎడిటింగ్‌: గౌతంరాజు, కళ: ఆనంద సాయి, రచన: పరుచూరి బ్రదర్స్, సమర్పణ: ఆర్‌.బి.చౌదరి, నిర్మాతలు: ఎన్‌.వి.ప్రసాద్‌, పారస్‌జైన్‌, కథ-కథనం-దర్శకత్వం: సంపత్‌నంది.