ఫిలిం న్యూస్
 
 
 
 
యాక్షన్ థ్రిల్లర్ ‘రక్షకుడు’

‘జయం’ రవి, కంగనా రనౌత్ జంటగా జీవా దర్శకత్వంలో తమిళంలో రూపొందిన ‘ధామ్ ధూమ్’ చిత్రాన్ని జ్యోతి ఆర్ట్స్ పతాకంపై యం.వి. గోపాలరావు ‘రక్షకుడు’ పేరిట తెలుగులో విడుదల చేస్తున్నారు. ఆదివారం జరిగిన ఈ చిత్రం ఆడియో ఆవిష్కరణలో అతిథిగా పాల్గొన్న ఆర్.బి.చౌదరి సీడీని విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ - ‘‘ఈ చిత్రహీరో ‘జయం’ రవి నాన్న ఎడిటర్ మోహన్‌తో నాకు మంచి అనుబంధం ఉంది.

తమిళంలో విజయం సాధించినట్లుగానే ఈ చిత్రం తెలుగులో కూడా విజయవంతం కావాలని కోరుకుంటున్నాను’’ అన్నారు. ‘‘జీవా హీరోగా మా సంస్థ నుంచి వచ్చిన’ ‘రంగం’ ఇటీవలే వంద రోజులు పూర్తి చేసుకుంది. శతదినోత్సవ వేడుకను తిరుపతిలో ఈ నెల 28న జరపనున్నాం. ఇక ‘రక్షకుడు’ విషయానికొస్తే.. కళాశాల, పులివేట వంటి విజయవంతమైన చిత్రాలను అందించిన గోపాలరావు ఈ చిత్రంతో మరో విజయాన్ని చవిచూస్తారు’’ అని అతిథులు ఎన్వీ ప్రసాద్, పరాస్ జైన్ తెలిపారు.

రచయిత శశాంక్ వెన్నెలకంటి మాట్లాడుతూ - ‘‘ఇది యాక్షన్ థ్రిల్లర్ మూవీ. ఇందులో ఓ క్యూట్ లవ్‌స్టోరీ కూడా ఉంది. ఇంత మంచి సినిమాకి మాటలు రాయడం ఆనందంగా ఉంది’’ అన్నారు. నిర్మాత యం.వి.గోపాలరావు మాట్లాడుతూ - ‘‘ఎన్నో ఆశలు పెట్టుకుని విదేశాలకు వెళ్లే మన భారతీయులకు అక్కడ ఏ విధమైన సమస్యలు ఎదురయ్యాయి అనేది ఈ చిత్రం ప్రధానాంశం. రంజాన్ కానుకగా చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నాం’’ అని చెప్పారు.