శ్రీకాంత్, విమలారామన్ నాయకానాయికలుగా గోల్డెన్ లయన్ ఫిల్మ్స్ మరియు గాడ్ ఫాదర్ ఫిల్మ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ‘రంగా ది దొంగ’ చిత్రం రామానాయుడు స్టూడియోలో ప్రారంభమైంది. ఈ చిత్రానికి దర్శకత్వం సుధాకర్ నాయుడు (జి.వి). నిర్మాతలు సి.ఆర్.మనోహర్, సుధాకర్ నాయుడు (జి.వి). ముహూర్తపు సన్నివేశానికి డా.డి.రామానాయుడు స్విచ్ ఆన్ చేయగా హీరో నందమూరి బాలకృష్ణ క్లాప్ నిచ్చారు. ప్రముఖ దర్శకుడు బి.గోపాల్ గౌరవ దర్శకత్వం వహించారు.
ఈ సందర్భంగా నిర్మాత మనోహర్ మాట్లాడుతూ ‘‘మహాత్మ’ చిత్రం తరువాత వరుసగా శ్రీకాంత్తో ఈ చిత్రం చేయడం చాలా ఆనందంగా వుంది. జి.వి అద్భుతమైన కథ సిద్ధం చేసారు. ఈ నెల 28నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించి మార్చి, ఏప్రిల్, మే నెలల్లో 15 రోజులు చొప్పున షూటింగ్ చేయడం జరుగుతుంది’’ అన్నారు. కథానాయకుడు శ్రీకాంత్ మాట్లాడుతూ ‘‘జి.వి నేను కలిసి చాలా సినిమాల్లో నటించాం. రెండు సంవత్సరాల త్రమే నాకు ఈ కథ వినిపించాడు. ఈ పాత్ర నాకు ఛాలెంజ్ అనిపించింది. ‘మహాత్మ’ తరువాత చేద్దాం అనుకున్నాను. ఒక నటుడుగా వుంటూ ఇటువంటి కథలు జి.వి తయారు చేసుకోవడం నిజంగా గొప్ప విషయం. మాస్ ఎంటర్టైనర్గా వుండే ఈ సినిమా కచ్చితంగా నాకు మరో మంచి సినిమా అవుతుంది’’ అన్నారు. దర్శకుడు సుధాకర్ నాయుడు (జి.వి) మాట్లాడుతూ ‘‘శ్రీకాంత్ నాకు ఫోన్ చేసి అప్పుడు చెప్పిన కథ మళ్ళీ వినిపించమన్నారు. దానిని చిన్న మార్పులు చేసి ‘రంగా ది దొంగ’ స్క్రిప్ట్ సిద్ధం చేసి వినిపించాను. ఆయనకెంతో నచ్చింది. ఇది ఎవరినీ ఉద్ధేశించి చేసిన కథ మాత్రం కాదు. ప్రతి మనిషికి ఆయా రంగాల్లో విజయం సాధించాలనే ఆకలి వుంటుంది. అటువంటి ఇతివృత్తంతో అందరిని అలరించే విధంగా చేస్తున్నదే ఈ సినిమా’’ అన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో శివాజీ రాజా, సంగీత దర్శకుడు చక్రి, యల్బీ శ్రీరాం, జ్యోతి తదితరులు పాల్గొన్నారు.