అల్లరి నరేష్ హీరోగా వంశీ దర్శకత్వంలో ఓ చిత్రం మొదలైంది. 'సరదాగా కాసేపు' పేరుతో రూపొందుతున్న ఈ చిత్రాన్ని శ్రీకీర్తి కంబైన్స్ పతాకంపై ఎం.ఎల్. పద్మకుమార్ చౌదరి నిర్మిస్తున్నారు. నరేష్ సరసన మధురిమ నాయికగా నటిస్తోంది. ‘అష్టాచమ్మా’ ఫేమ్ అవసరాల శ్రీనివాస్ ముఖ్యపాత్ర పోషిస్తున్నారు.
చిత్ర విశేషాలను నిర్మాత వివరిస్తూ- ‘ఇటీవలే పూజా కార్యక్రమాలతో నిరాడంబరంగా చిత్రీకరణ మొదలైంది. 19 నుంచి రాజమండ్రిలో భారీ షెడ్యూల్ చేయబోతున్నాం. 20 రోజులు జరిపే ఈ షెడ్యూల్లో కీలక సన్నివేశాలతోపాటు రెండు పాటలను చిత్రీకరిస్తాం’ అన్నారు.
చిత్ర సమర్పకుడు రవి సదాశివుని మాట్లాడుతూ- ‘వంశీ శైలిలో సాగే పూర్తిస్థాయి వినోదాత్మక చిత్రమిది. టైటిల్కు తగినట్లే సినిమా అంతా సరదాగా ఉంటుంది. చక్రి సంగీతం సమకూరుస్తున్నారు. మొత్తం ఐదు పాటలున్నాయి. భాస్కరభట్ల, కందికొండ, ప్రవీణ్ లక్మ ఈ పాటలు రాస్తున్నారు. ఇప్పటికే రికార్డింగ్ పూర్తయింది. రెండుపాటలు బాగా వచ్చాయని’ తెలిపారు.
ఆహుతిప్రసాద్, జయలలిత, జీవా, సన, ఎమ్మెస్ నారాయణ, కొండవలస, రమ్యశ్రీ, దువ్వాసిమోహన్, కృష్ణేశ్వరరావు తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కథ: శంకరమంచి, స్క్రిప్ట్ కో-ఆర్డినేటర్: వేమూరి సత్యనారాయణ, మాటలు: పడాల శివసుబ్రహ్మణ్యం, కెమెరా: లోకి, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: సందీప్.