ఎన్.శంకర్ స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్న చిత్రం 'జై బోలో తెలంగాణ'. తెలంగాణ సంప్రదాయాలు, ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం ప్రాణాలు త్యాగం చేసిన విద్యార్థుల వీర గాథల ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కుతుంది. ఈ చిత్రంలో అందరూ కొత్తవారే నటిస్తున్నారు. హైదరాబాద్లో ఈ చిత్రం ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి ప్రముఖ దర్శకులు కె.రాఘవేంద్రరావు క్లాప్నిచ్చారు. తెలంగాణ జెఏసీ కో కన్వీనర్ మల్లేపల్లి లక్ష్మయ్య కెమెరా స్విచ్ఛాన్ చేశారు. ప్రొఫెసర్ జయశంకర్ గౌరవ దర్శకత్వం వహించారు. 'జై బోలో తెలంగాణ' టైటిల్ లోగోను ఆంధ్రజ్యోతి దినపత్రిక ఎమ్డి వేమూరి రాధాకృష్ణ, శాసన సభ్యులు కె.టి.రామారావులు సంయుక్తంగా ఆవిష్కరించారు. కె.టి.రామారావు మాట్లాడుతూ ''ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు వలన చిత్ర పరిశ్రమకు ఎలాంటి నష్టం రాదు. సినిమాల్లో తెలంగాణ నటులు, సాంకేతిక నిపుణులను తగిన విధంగా ప్రోత్సహించండి''అన్నారు. ఎన్.శంకర్ మాట్లాడుతూ ''తెలంగాణ ప్రజలే కాకుండా ఆంధ్రప్రదేశ్ యావత్తు ప్రేక్షకులకు నచ్చే అంశాలు ఈ చిత్రంలో ఉంటాయి. సెప్టెంబరు 3 నుంచి నిరవధికంగా చిత్రీకరణ కొనసాగుతుంది. డిసెంబరులో చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామ''న్నారు. ఈ కార్యక్రమంలో భాజపా నేతలు బండారు దత్తాత్రేయ, విద్యాసాగర్రావు, సినీ ప్రముఖులు అశ్వనీదత్, పరుచూరి గోపాలకృష్ణ, కోదండరామిరెడ్డి, బి.గోపాల్, మురళీమోహన్, కె.ఎస్.రామారావు, సి.కల్యాణ్, ఇ.వి.వి.సత్యనారాయణ, శివాజీ, సుద్దాల అశోక్తేజ, అందెశ్రీ, గోరటి వెంకన్న, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత, గద్దర్, చుక్కారామయ్య, నందిని సిద్దారెడ్డి, సంధ్య, విమలక్క, ప్రకాష్, దిలీప్కుమార్, జయరాజ్ తదితరులు పాల్గొన్నారు.
|