బాలకృష్ణ కథానాయకుడిగా బాపు దర్శకత్వంలో శ్రీ సాయిబాబా మూవీస్ పతాకంపై యలమంచిలి సాయిబాబు నిర్మించిన 'శ్రీరామరాజ్యం' చిత్రం ఎప్పుడెప్పుడా అని అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఈ సందర్భంగా బుధవారం రాత్రి హైదరాబాద్లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో బాలకృష్ణ చిత్రం విడుదల తేదీని ప్రకటించారు.
ఈ కార్యక్రమంలో బాలకృష్ణ, బాపు, యలమంచిలి సాయిబాబులు పాల్గొన్నారు.
బాలకృష్ణ మాట్లాడుతూ- స్వర్ణాంధ్రప్రదేశ్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తుంది. నాకు చాలా తృఫ్తినిచ్చిన చిత్రమిది. బాపు దర్శకత్వంలో కావ్యంగా తీర్చిదిద్దారు. కథ అందరికీ తెలిసిందే. లవకుశ నేపథ్యంలో సాగుతుంది. అప్పటి లవకుశకు, ఇప్పటి లవకుశకు వైవిధ్యం కన్పిస్తుంది. ఇళయరాజా సంగీతాన్ని బాపుగారు రాబట్టుకున్నారు. ప్రజామోదాన్ని పొందింది. విజువల్గా అద్భుతంగా వచ్చింది. తెరపై కనువిందుగా ఉంటుంది. తెలుగువారు కొత్తదనాన్ని ఆదరిస్తారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్స్ వర్క్ జరుగుతోంది. రీరికార్డింగ్ ఇటీవలే హంగేరీ టీమ్ చేశారు. ప్రీ మిక్సింగ్ పనిమీద బాపుగారు ఈరోజు రాత్రి హంగేరీ వెళుతున్నారు. అక్కడినుంచి వచ్చాక ముంబైలో ప్రీ మిక్సింగ్ కార్యక్రమాలు జరుగుతాయి. సినిమాను నవంబర్ 10న విడుదలచేస్తున్నామని'' తెలిపారు.
నిర్మాత యలమంచిలి సాయిబాబు మాట్లాడుతూ - మేం అనుకున్నట్లు చిత్రాన్ని బాపుగారు తీర్చిదిద్దారు. హంగేరీ ఆర్క్రెస్ట్రా అద్భుతంగా ప్రీమిక్సింగ్ పనులు చేస్తుంది. గ్రాఫిక్స్ వర్క్ అద్భుతంగా వచ్చింది. రాముడు గెటప్స్ త్వరలో రిలీజ్ చేస్తాం. బాలకృష్ణ కెరీర్ను ఓ మెట్టు ఎదిగేలా ఈ చిత్రం ఉంటుంది'' అన్నారు.