'శ్రీ శ్రీ రాజరాజేశ్వరి ఫిలింస్ పతాకంపై చెరుకూరి కౌసవేంద్రరావు సమర్పణలో కె.విశ్వనాథ్ దర్శకత్వంలో
నిర్మిస్తున్న చిత్రానికి ‘శుభప్రదం’ అని పేరు పెట్టారు. అల్లరి నరేష్, మంజరి ఫడ్నిస్ జంగా నటిస్తున్న ఈ
చిత్రం లోగోను కె.విశ్వనాథ్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఇవివి సత్యనారాయణ మాట్లాడుతూ
- కె.విశ్వనాథ్ గారి దర్శకత్వంలో నరేష్ కి అవకాశం వచ్చినందుకు అతనికంటే నేనే ఎక్కువ ఆనందపడ్డాను.
నాలాంటి కమర్షియల్ దర్శకులు ఎందరున్నా, కమర్షియల్ చిత్రాలు ఎన్ని తీసినా - మేం తీసే పది చిత్రాలకు
విశ్వనాథ్ గారి ఒక్క చిత్రం ధీటుగా నిలుస్తుంది. తెలుగు సాహిత్యం, కళలను ప్రతిబింబించేలా ఆయన చిత్రాలు
ఉంటాయి. అన్ని తరగతుల వారికీ నచ్చేలా తీస్తారు - అని అన్నారు.
మాజీ మంత్రి దాడి వీరభద్రరావు మాట్లాడుతూ - ఇటువంటి చిత్రాలను ప్రేక్షకులు చూస్తారా? అని సందేహించే
దశలో పామర జనాన్ని కూడా అలరించేలా విశ్వనాథ్ గారు చిత్రాలు తీసారు అని అన్నారు. రచయిత
సాయినాథ్ మాట్లాడుతూ - మకుటాయమానం అయ్యే చిత్రాలు ఎప్పుడో వస్తాయి. అందులో ఇది ఒకటి.
కళాత్మకం, రసాత్మకం, సందేశాత్మకంగా ఉండే ఈ చిత్రం యూనిట్ లోని అందరికీ మంచి పేరు తెస్తుందని
అన్నారు.
కె.విశ్వనాథ్ మాట్లాడుతూ - ప్రయత్నం మాది - ఫలితం భగవంతుడిది. నా చిత్రాల వరవడికి నరేష్
ఎలా సరిపోతాడని అంతా సందేహపడ్డారు. అయితే ఈ చిత్రం తర్వాత ‘అల్లరి’ నరేష్ ‘శుభప్రదం’ నరేష్ అని
పిలిపించుకునేలా కష్టపడి చేశాడు. నటీనటులు అంతా తమ శక్తి సామర్థ్యాలను మించి చేశారు. మణిశర్మ
మంచి సంగీతాన్ని, వేణు చక్కటి ఫోటోగ్రఫీని అందించారు. తక్కువ సమయంలో వేగంగా ఈ చిత్రం
పూర్తయ్యేందుకు అంతా సహకరించారు - అని అన్నారు. ఈ కార్యక్రమంలో నిర్మాతలు హరిగోపాలకృష్ణ, పీలా
నీల తిలక్ పాల్గొన్నారు.