"నాకెంతో ఇష్టమైన గౌతమ్మీనన్ దర్శకత్వంలో హీరోగా నటించడం చాలా ఆనందంగా ఉంది. ప్రతి మనిషి తన జీవితంలో ఏదో ఒక సమయంలో ప్రేమలో పడతారు. నిజజీవితానికి దగ్గరగా ఈ చిత్రం ఉంటుంది కాబట్టి అన్ని వర్గాల ప్రేక్షకులకు మంచి అనుభూతినిస్తుంది' అని నాగచైతన్య అన్నారు. ఆయన హీరోగా సమంత హీరోయిన్గా గౌతమ్ వాసుదేవ మీనన్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'ఏ మాయ చేసావె'.
సూపర్స్టార్ కృష్ణ సమర్పణలో ఇందిరా ప్రొడక్షన్స్ పతాకంపై సంజయ్ స్వరూప్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని మార్చి 26న విడుదల చేయాలనుకుంటున్నారు. ఈ చిత్రం ఆడియో ఆవిష్కరణ కార్యక్రమంలో నాగచైతన్య పై విధంగా స్పందించారు. సోని మ్యూజిక్ ద్వారా ఆడియో విడుదలైంది. ఈ సందర్భంగా గౌతమ్ వాసుదేవ మీనన్ మాట్లాడుతూ - "ఎ.ఆర్.రెహమాన్తో నాకిది మొదటి సినిమా. ఆయనతో కలిసి పని చేయడం థ్రిల్కి గురి చేసింది. ఈ ప్రేమకథా చిత్రానికి రెహమాన్గారు తన స్వరాలతో ప్రాణంపోశారు. తాత, తండ్రికి తగ్గట్లు నాగచైతన్య అద్భుతమైన నటుడు' అని పేర్కొన్నారు.
"ఆస్కార్ అవార్డ్, గ్రామీ అవార్డ్ విన్నర్ అయిన రెహమాన్గారు ఈ చిత్రానికి 7 అద్భుతమైన పాటల్ని ఇచ్చారు. నాగచైతన్యకు ఈ చిత్రం మంచి మలుపు అవుతుంది' అని మంజుల చెప్పారు. సంజయ్ స్వరూప్ మాట్లాడుతూ - "గౌతమ్ మంచి టెక్నీషియన్. నాగచైతన్య చాలా పెద్ద హీరో అవుతాడు. రెహమాన్లాంటి గొప్ప సంగీత దర్శకుడితో సినిమా చేయడం అదృష్టంగా భావిస్తున్నాను. ఈ ఆడియో, సినిమా సంచలనాత్మక విజయం సాధిస్తాయి' అని చెప్పారు.