మసాలా
 
 
 
 
అజిత చిత్రానికి ప్రశంసల జల్లు

అజిత సుచిత్ర వీర... ఈ పేరు ఎప్పుడైనా విన్నారా? కచ్చితంగా విని వుండరు. కానీ భవిష్యత్తులో ఆమె పేరుని మనం ఎక్కువసార్లు వినే అవకాశం ఉంది. ఎందుకంటే ఆమె చేసే ప్రయత్నాలు అలాంటివి. ఇంతకూ ఆమె ఎవరంటే ఓ సృజనాత్మకత కలిగిన ఫిలిం మేకర్. ఇటీవల గోవాలో జరిగిన అంతర్జాతీయ చలన చిత్రోత్సవాల్లో ఆమె తీసిన ‘రుస్తుమ్ కీ దాస్తాన్’ (ఇంగ్లీష్ సబ్‌ై టైటిల్స్‌తో ‘బ్యాలెడ్ ఆఫ్ రుస్తుమ్’ పేరిట ప్రదర్శించారు) చిత్రానికి ప్రశంసల జల్లు కురిసింది. ఈ హిందీ చిత్రాన్ని తీసిన అజిత మన తెలుగమ్మాయి. ఆమె తీసినది సాదాసీదా కాన్సెప్ట్ కాదు.

ఈ సినిమాని వీక్షించిన అనేకమంది ప్రముఖులు ఓ చక్కని పెయింటింగ్‌లా ఉందని, కాన్సెప్ట్ బాగుందని అభివర్ణించారు. వలసల నేపథ్యంలో రుస్తుమ్ అనే ప్రభుత్యోద్యోగి మానసిక సంఘర్షణను అజిత ఈ చిత్రంలో ఆవిష్కరించారు. ఈ సినిమా కోసం ఆమె లెక్కలేనన్ని కసరత్తులు చేశారు. కథ తయారీకి చాలాకాలం పడితే, ఆ కథ వెండితెర పైకి రావడానికి ఐదేళ్లు పట్టింది. ఆర్థిక వనరుల్ని తనే సమకూర్చుకుని ఈ సినిమా తీశారామె. ఆర్టిస్టుల ఎంపిక కోసం కూడా అధికంగా శ్రమించారు.

కోల్‌కత్తా, బెంగళూరు, ముంబయ్, హైదరాబాద్ నగరాలన్నీ తిరిగి నటీనటుల్ని ఎంపిక చేసుకోవడం, వారికి వర్క్‌షాపులు నిర్వహించడం, కాస్ట్యూమ్స్ డిజైన్ చేయడం... ఇత్యాది కార్యక్రమాలన్నీ ఏకవ్యక్తి సైన్యంలా పూర్తి చేశారామె. ఈ సందర్భంగా అజిత మాట్లాడుతూ -‘‘ధనార్జనే ధ్యేయంగా నేను సినిమాలు చేయడంలేదు. సినిమా అంటే నాకెంతో మమకారం. మంచి కథాంశాలతో సినిమాలు చేసి, అందర్నీ రంజింప చేయాలన్నదే నా ఆశయం.

గోవా చిత్రోత్సవాల్లో ‘రుస్తుమ్ కీ దాస్తాన్’కు మంచి ప్రశంసలు లభించాయి. ఇంకా ఈ చిత్రం మరిన్ని ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్స్‌లో ప్రదర్శితం కానుంది. త్వరలో ఈ చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నాం’’ అని చెప్పారు. గతంలో అజిత దర్శకత్వం వహించిన ‘నోట్స్ ఆన్ హర్’ అనే షార్ట్ ఫిలిమ్ ప్రతిష్టాత్మక ఆస్కార్ అవార్డ్స్‌లో నామినేషన్ పొందింది. ఆ తర్వాత ఆమె రూపొందించిన పలు షార్ట్ ఫిలిమ్స్ కూడా విమర్శకుల ప్రశంసలు అందుకున్నాయి