ఒక సబ్జెక్ట్ను ఎంచుకొని దాన్ని చాలా సీరియస్గా తెరకెక్కించే నటుడు, నిర్మాత అమీర్ఖాన్. ఆయన తాజా చిత్రం 'పీప్లీలైవ్' (తెలుగులో నగసత్యం
అని అర్థం) త్వరలో విడుదలకు సిద్ధం కాబోతోంది. ఆగస్టు 13న ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు ప్లాన్ చేస్తున్నాడు. సినిమా ప్రమోషన్లో
భాగంగా ఢిల్లీలో విలేకర్ల సమావేశం ఏర్పాటు చేసాడు. రైతుల జీవన పరిస్థితులపై అమీర్ఖాన్ తీసుకొస్తున్న చిత్రమిది. ముఖ్యంగా రైతు
ఆత్మహ్యత్యలు, వలస, పట్టణాలకు, గ్రామాలకు మధ్య పెరుగుతున్న అంతరాలు మొదలైన అంశాలు ఈ చిత్రంలో ప్రస్తావించబోతున్నాడు. ఇలాంటి
అంశాలు తీసుకొని సినిమా ఎందుకు తీస్తున్నారు అని ఆయన్ని అడిగితే...'నేడు గ్రామల్లో ఉన్న మనుషుల జీవన పరిస్థితులపై ఓ చిత్రం
చేయాలనుకున్నా. ఇక్కడున్న పలు అంశాలపై వ్యంగ్యంగా తెరకెక్కించాం. దీన్నే ఎందుకు ఎంచుకున్నారని అడుగుతున్నారు...సహజంగా
కనిపించేదే మనకు నవ్వులాటగా ఉంటుంది. అయినా ఇదంతా చూసే మనపై ఆధారపడి ఉంటుంది. దాని నుంచి ఏం గ్రహించాం అనేది వ్యక్తి వ్యక్తికీ
మారుతుంది' అని సమాధానమిచ్చారు.నిర్మాత అమీర్ఖాన్, రచయిత-దర్శకుడు అనుషా రిజ్వీ మాటల్లో...చెప్పాలంటే...' చిత్రంలోని కథంతా 'నాథా'
అనే రైతు చుట్టూ తిరుగుతుంది. ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకుంటాడు. కారణం పేదరికాన్ని జయించలేకపోవడం. ఇతనొక్కడే కాదు 'నాథా'
లాంటి రైతులెందరో ఉన్నారు. ఇక్కడ వారి పరిస్థితుల్ని చూపాం. జీవితాన్ని చూపాం. మొత్తంగా చెప్పాలంటే...ఇదొక పేదవాడి కథ'.
'ఇలాంటి చిత్రాలెన్నో వచ్చాయి. దానివల్ల సమాజంలో ఎలాంటి మార్పులూ రాలేదుగా..?' అన్న విలేకర్ల ప్రశ్నకు...'ఏదో విప్లవం తీసుకొస్తుందని
ఆశించి తీయడం లేదు. దేశవ్యాప్తంగా ఉన్న సినీ ప్రేక్షకుల దృష్టికి తీసుకురావడం మా లక్ష్యం' అని సమాధానమిచ్చారు.
'పీప్లీలైవ్' చిత్రంలో జర్నలిస్ట్గా నటించిన ఓ నటుడు మాట్లాడుతూ...'అమీర్ఖాన్కు పిచ్చెక్కింది. ప్రతీ చిత్రాన్ని లగాన్లా తీయలేం' అని అన్నారు.
సినిమా పట్ల అమీర్ఖాన్ కనబరిచే సీరియస్ను నర్మగర్భంగా ఆ నటుడు తెలిపాడు. దీనికి అమీర్ బదులిస్తూ...'నాపై అనేక కథనాలు, రూమర్స్,
జోక్స్ వస్తున్నాయి. వస్తుంటాయి కూడా. మరికొన్ని ఇలాంటి వచ్చినా నాకేం బాధలేదు' అని అన్నారు.
|