మూడు దశాబ్దాల క్రితం బాలీవుడ్ మహారాణులు వారు. ప్రేక్షకులు హృదయాల్లో ఇహలోక సుందరాంగులు. నేనంటే నేనంటూ పోటీపడి మరీ వెండితెర పై తళుకులీనారు. ఒకరు డ్రీమ్గాళ్ హేమమాలిని, మరొకరు తన అందచందాలతో 70వ దశకంలో సెక్స్ సింబల్గా పేరొందిన గ్లామర్ క్వీన్ రేఖ. నడి వయస్సు దాటినా కూడా తరిగిపోని అందచందాలు వారి సొంతం. ఇప్పుడు ఈ మాజీ సుందరాంగులిద్దరూ ఓ సినిమాలో కలిసి నటించబోతున్నారు. ‘దీవానా’ చిత్రంతో షారూఖ్ ఖాన్ను బాలీవుడ్కు పరిచయం చేసిన ప్రముఖ దర్శకుడు రాజ్ కన్వర్ దర్శకత్వం వహించబోతున్న ఓ సినిమాలో హేమమాలిని, రేఖలు కలిసి నటించబోతున్నారు.
ఒకప్పటి స్టార్ హీరో, ప్రస్తుత ఎంపీ శత్రుఘ్ను సిన్హా కుమారుడు లవ్ సిన్హా బాలీవుడ్ తెరంగేట్రం చేయబోతున్న ‘సాదియాన్’ చిత్రంలో వీరిద్దరు నటించనున్నారు. ఈ చిత్రం త్వరలో షూటింగ్ పూర్తిచేసుకొని తెరమీదికి రానుంది. బాలీవుడ్ మాజీ బ్యూటీ క్వీన్లను ఒకే ఫ్రేంలోకి తీసుకురావడంలో రాజ్ కన్వర్ సక్సెస్ అయ్యారనే చెప్పవచ్చు. ఈ విషయం గురించి ఇటీవల మీడియాతో మాట్లాడిన దర్శకుడు రాజ్ కన్వర్ ‘‘హేమమాలిని, రేఖ గార్లతో సినిమా చేయాలని నేనెప్పుడూ అనుకుంటుండేవాన్ని, ఆ కోరిక ఇన్నాళ్ళకు నెరవేరింది. నిజం చెప్పాలంటే వారిద్దరికీ నేను పెద్ద అభిమానిని. నేను దర్శకుడిగా కెరీర్ ఆరంభించేనాటికే వారు ఇండస్ట్రీలో పెద్ద హీరోయిన్లుగా చెలామణి అవుతున్నారు.
‘సాదియాన్’ చిత్రం కోసం స్క్రిప్ట్ తయారుచేసుకుంటున్నప్పుడు, ఆ కథకు ఇద్దరు పవర్ఫుల్ లేడీస్ కావాల్సివచ్చింది. పైగా వారిద్దరూ ఒక రేంజ్లో ఉండాలి. అలాంటి సీనియర్ నటీమణుల గురించి అనుకోగానే నా మదిలో మెరిసింది హేమమాలిని, రేఖ. వీరైతేనే ఈ రోల్స్కు సరిగ్గా సరిపోతారనిపించింది. వెంటనే వారిద్దరినీ కలిశాను. నా కోరిక మన్నించి నా సినిమాలో నటించడానికి ఇద్దరు ఒప్పుకున్నారు. దీనికి వారికి నేనెంతో రుణపడి ఉన్నాను. దాదాపు మూడు దశాబ్దాలుగా బాలీవుడ్ వెండితెర రాణులుగా వెలుగొందిన ఆ ఇద్దరు సీనియర్ హీరోయిన్లతో పనిచేయడం నిజంగా నా అదృష్టం.’’ అని తన ఆనందాన్ని వ్యక్తపరిచాడు రాజ్ కన్వర్.
|