తారలపై వచ్చే గాలి కబుర్లు రహస్యం బయటపడే కొద్దీ మరింత ఆసక్తిగా మారుతుంటాయి. నిన్నా మొన్నటి వరకూ నయనతార, ప్రభుదేవాల మధ్య ప్రేమబంధం ఉందా? లేదా? అనే విషయం గురించి తర్జనభర్జనలుపడ్డారు. ఇప్పుడది మరింత బలపడింది అనే విషయం పక్కాగా తెలిశాక తరవాత ఏమిటీ అనే ఆసక్తి చూపిస్తున్నారు. ఈ నెల 6న తమిళ సినీ పరిశ్రమ కరుణానిధిని ఘనంగా సత్కరించింది. ఈ కార్యక్రమంలో నయన్, ప్రభుల జంట ఓ పాటకు నృత్యం చేసి వీక్షకులను అలరించింది. అప్పట్నుంచి వారిద్దరు కలిసే తిరుగుతున్నారట. 'మై నేమ్ ఈజ్ ఖాన్' చిత్రాన్ని చెన్నైలో కలిసి చూశారట. ప్రేమికుల రోజును పురస్కరించుకుని ఆదివారంనాడు ప్రభుదేవా - నయన్కు కాండిల్ లైట్ డిన్నర్ రుచి చూపించాడట. విలువైన బహుమతులను ఇచ్చిపుచ్చుకున్నారట. అంతే కాదు.. ఈ వ్యవహారం గురించి నయన్ని అడిగితే - ''నేను ఎవరినైనా ఇష్టపడితే వారి కోసం ఏం చేయడానికైనా సిద్ధపడతాను. నేను ప్రభు పేరును చేతి మీద పచ్చ పొడిపించుకుంటే మిగిలినవాళ్లకి కలిగిన ఇబ్బందేమిటో నాకు అర్థం కావట్లేదు. నలుగురూ నాలుగు రకాలుగా అనుకుంటారని వాళ్లందరి దగ్గరకూ వెళ్ళి నచ్చజెప్పుకోవడం సాధ్యం కాదు కదా. నేను నా కోసం బతుకుతున్నాను'' అని ఆవేశపడింది. మొత్తానికి ఇలాగైనా ప్రభుదేవా మీదున్న ప్రేమ బయటపెట్టింది. ఇక ఇద్దరూ ఒక ఇంటివారు కావడమే మిగిలింది.
|