|
సినిమారంగంలో పుకార్లు సహజం. వాటి గురించి పట్టించుకోవడం మానేశాను. కాకుంటే, స్నేహంగా ఉంటూనే హాని చేసే వాళ్ళను చూస్తే బాధ అనిపిస్తుంది. త్రిషకి, నాకు మధ్య అటువంటిదే జరిగింది. త్రిష నాకు స్నేహితురాలు కాదు... అలానే శత్రువూ కాదు. మిత్రులతో కలిసి అప్పుడప్పుడూ పార్టీల్లో పాల్గొనేవాళ్ళం. అక్కడ ఒకరితో ఒకరు బాగానే మాట్లాడుకునే వాళ్ళం. అయితే, మా వెనుక లేనిపోని మాటలు పుట్టించి, ఇద్దరి మధ్య గొడవలకి కొంతమంది తీవ్రంగా ప్రయత్నించి, సక్సెస్ అయ్యారు. ఆ విషయం మా ఇద్దరికీ తెలుసు. పరిస్థితిని సరిదిద్దుకోవాలని ప్రయత్నించాం. కానీ, వీలుకాలేదు. దాంతో మా మధ్య కొన్నాళ్ళు 'కోల్డ్వార్' నడిచింది - అంటూ త్రిషతో తన సంబంధాల విషయమై చెబుతోంది నయనతార.
వ్యాపార ప్రకటనలకి నేను దూరంగా ఉంటాను. పదేపదే టివి ప్రకటనల్లో కనిపిస్తే, ఇక నన్ను చూడటానికి ప్రేక్షకులు థియేటర్కి ఎందుకొస్తారు? అందుకనే ఎంతోమంది అడిగినా అంగీకరించలేదు. మద్యం ప్రకటనకి భారీ ఆఫర్ ఇచ్చారు. అయినా ఆ ప్రకటనలో చేయడానికి నాకు మనస్కరించలేదు. మంచి నటినని నిరూపించుకోవడానికి గ్లామర్లేని పాత్రలు చేయాల్సిన అవసరం లేదని నేను అనుకుంటాను. మేకప్ వేసుకుని కూడా మంచి నటనతో మంచి నటిని అనిపించుకోవచ్చునని చాలా మంది నిరూపించారు. మలయాళంలో నేను ఓ సీరియస్ పాత్ర పోషిస్తున్నాను. ఆ పాత్ర నటిగా నాకు బాగా నచ్చింది. నా మనసుకి నచ్చిన పాత్రలు చేస్తాను. అలాగే నా మనసుకి నచ్చినట్లు ఉంటాను. ఎవరేమనుకున్నా నేను పట్టించుకోను. ఇప్పుడు అంత ఆత్మ విశ్వాసం ఉంది నాలో - అని అంటోంది.
|