ఇటీవల విడుదలైన 'అందరి బంధువయ' చిత్రంతో పాటుగా పలు అనువాద చిత్రాల ద్వారా తెలుగు
ప్రేక్షకులకు సుపరిచితురాలైన పద్మప్రియ సీరియస్ చిత్రాల్లో నటించి అలసిపోయినట్టుంది. పక్కా
కమర్షియల్ చిత్రంలో నటించాలని ఉత్సాహపడుతోంది.
''హ్యూమర్ అంటే నాకు చాలా ఇష్టం. పక్కా మాస్ మసాలా రొమాంటిక్ క్యామెడీ చిత్రంలో
నటించాలని ఆశపడుతున్నాను. నేను కేవలం సీరియస్ పాత్రలకు మాత్రమే సూటవుతాననే
అపోహలను తొలగించాలనుకుంటున్నాను'' అని పద్మప్రియ చెప్పింది.
ఎంబీయే చదివి ఒక ఎంఎన్సీ కంపెనీలో ఉద్యోగం చేస్తున్న పద్మప్రియ సినిమాలపై ఆసక్తితో ఫీల్ట్
మార్చుకుంది. అంతేకాకుండా తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ను ఆదర్శంగా తీసుకుని ట్రెక్కర్ల
గ్రూప్లో చేరి ఇటీవల హిమాలయ పర్వతాల్లో 11 రోజులు గడిపింది. హిమాలయ పర్వతాల్లో తాను
పొందిన అనుభవ సారాన్ని గురించి పద్మప్రియ వివరిస్తూ ''హిమాలయ పర్వతాలను సందర్శించిన
తర్వాతనే రజనీకాంత్ అంత నిరాడంబరంగా ఎందుకు ఉంటారనేది తెలిసివచ్చింది. ఆధ్యాత్మిక
ప్రాంతాల్లో కొద్ది రోజులు గడిపిన తర్వాత మాత్రమే ఎవరికైనా జీవిత సత్యం తెలుస్తుంది. భారీగా
మంచు, వర్షాలు కురుస్తుండటంతో టెంట్ దాటి బయటకు రాలేకపోయాం. అంతే కాదు దాదాపు
ఆరు రోజుల పాటు నేను దంతాలు తోముకోవటం కానీ స్నానం చేయటం కానీ చేయలేకపోయాను''
అని చెప్పింది.
హిమాలయాలను సందర్శించిన తర్వాత తాను పొందిన జ్ఞానాన్ని గురించి పద్మప్రియ వివరిస్తూ
''హిమాలయ పర్వతాలను ఎక్కేటప్పుడు నాతో పాటుగా సౌందర్య సాధనాలు, ప్రత్యేక వస్త్రాలు
తీసుకువెళ్లాను. కానీ కిందకు దిగివస్తుండగా అవన్నీ కేవలం కృత్రిమ ఆనందాన్ని మాత్రమే
ఇస్తాయని తెలుసుకున్నాను. మనిషిగా జీవించటానికి ఒక జత బట్టలు చాలు'' అని చెబుతోంది.
|