మసాలా
 
 
 
 
సాధారణ జీవితంలోకి రాగేశ్వరి
నటన, మోడలింగ్, యాంకరింగ్.. ఇలా అన్ని రంగాల్లోనూ రాగేశ్వరి లూంబా తన సత్తా చాటుకుంది. అయినా ఆమె ఇంతటితో ఊరుకోవడానికి సిద్ధంగా లేదు. ఇప్పుడు తన దృష్టంతా క్రాసోవర్ (దేశాంతరాల సినిమా) సినిమాలపై ఉంది. రాగేశ్వరి ఇప్పటి వరకు ఆఖే, మై ఖిలాడీ తూ అనాడీ వంటి సినిమాల్లో నటించింది. 2003లో విడుదలైన ముంబై సే ఆయా మెరా దోస్త్ ఈ 39 ఏళ్ల బ్యూటీ ఆఖరి చిత్రం. ఇందులో ఆమె జర్నలిస్టుగా కనిపించింది.

స్వతంత్ర దృక్పథంతో అత్యద్భుత సినిమాలు తీయగలిగే వారితో కలిసి పనిచేయాలని అనుకుంటున్నానని రాగేశ్వరి చెప్పింది. ‘నాకు క్రాసోవర్ సినిమాలు చేయాలని ఉంది. అయితే కథ అద్భుతంగా ఉండాలి. స్వేచ్ఛాయుత దృక్పథంతో మంచి సినిమాలు చేసే మంచి దర్శకులు చాలా మంది ఉన్నారు. ఒక మంచి అవకాశం కోసం నేను ఎదురుచూస్తున్నాను. ఎన్నో సినిమాల్లో నాకు అవకాశాలు వస్తున్నాయి కానీ పాత్రలు బాగుండడం లేదు’ అని చెప్పింది. ఎంతో జనాదరణ పొందిన రియాలిటీ షో బిగ్‌బాస్‌లో పాల్గొన్న రాగేశ్వరి.. ఇక ముందు కూడా ఇలాంటి వాటిలో పాల్గొనడానికి అభ్యంతరం లేదని చెప్పింది.

టాక్‌షోలు, సినిమాలకు కూడా సిద్ధమేనని ప్రకటించింది. రాగేశ్వరికి 2000లో బెల్స్‌పాల్సీ సోకడంతో ముఖం ఎడమభాగానికి పక్షవాతం వచ్చింది. గొంతు కూడా దెబ్బతింది. ఈ జబ్బు నుంచి కోలుకొని సాధారణ జీవితం గడుపుతున్నానని తెలిజేయడానికే బిగ్‌బాస్‌లో కనిపించానని చెప్పింది. తాను తిరిగి మామూలు మనిషిని కావడానికి యోగాభ్యాసమే కారణమని చెప్పింది. క్యాన్సర్‌బాధితుల కోసం రాగేశ్వరి టెర్రీఫాక్స్ రన్, ఇండియాడెఫ్ ఎక్స్‌పో వంటి సేవా కార్యక్రమాల్లోనూ చురుగ్గా పాల్గొంటోంది. పేద, మనోవైకల్యం గల చిన్నారుల కోసం నిర్వహించే ‘డ్యాన్స్ విత్ జాయ్’కు ప్రచారకర్తగానూ పనిచేస్తోంది.