మసాలా
 
 
 
 
సయాలీ చెప్పిన బాలీవుడ్ బాగోతాలు
‘‘కొంతమంది మగాళ్లు ఆడవాళ్లను మాంసం ముక్కలా భావిస్తారు. ప్రతి ఒక్కరూ ఆ ముక్క కావాలనుకుంటారు. ఆ మాంసం ముక్కను దక్కించుకోవడానికి ఏం చేయడానికైనా వెనుకాడరు’’ అని ఘాటుగా స్పందిస్తున్నారు సయాలీభగత్. ‘ది ట్రైన్’ అనే హిందీ చిత్రం ద్వారా పరిచయమైన ఈ మరాఠీ బ్యూటీ ‘బ్లేడ్ బాబ్జీ’ చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయమయ్యారు. ఇటీవల ముంబయి మీడియావారికి ఆమె లిఖితపూర్వకంగా ఓ స్టేట్‌మెంట్ ఇచ్చారు. అందులో తనపట్ల కొంతమంది బాలీవుడ్ ప్రముఖులు అభ్యతరకరంగా ప్రవర్తించారని, లైంగిక వేధింపులకు కూడా గురి చేశారని పేర్కొన్నారు.

బిగ్ బి అమితాబ్ బచ్చన్, షైనీ అహూజా, సాజిద్‌ఖాన్, ఆర్యబబ్బర్ తనపట్ల అమానుషంగా ప్రవర్తించారని ఆమె ఆరోపించడం పలువుర్ని షాక్‌కి గురి చేసింది. టినువర్మ రూపొందించిన ‘దిస్ వీకెండ్’ ఫస్ట్ లుక్ ఆవిష్కరణలో ఆ మధ్య పాల్గొన్నానని, అదే వేడుకలో ముఖ్య అతిథిగా పాల్గొన్న అమితాబ్ బచ్చన్‌కి గౌరవంగా పాదాభివందనం చేశానని ఆమె చెబుతూ, ఆ సమయంలో అమితాబ్ తాకకూడని చోట తాకడం తనను దిగ్భ్రాంతికి గురిచేసిందని, తన తాత వయసులో ఉన్న అమితాబ్ బచ్చన్ ఆ విధంగా ప్రవర్తించడంతో చెంప చెళ్లుమనిపించాలనేంత కోపం ఏర్పడిందని కూడా ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు.

అలాగే ‘హౌస్‌ఫుల్’ సినిమాలో అవకాశం ఇస్తానంటూ సాజిద్‌ఖాన్ ఆఫీసుకు రమ్మంటే వెళ్లానని, తన ముందు నగ్నంగా నిలబడితే అవకాశం ఇస్తానని ఆయన అన్నారని, భయంతో అక్కడ్నుంచి వెంటనే బయటపడ్డానని కూడా సయాలీ చెప్పారు. హీరో ఆర్యబబ్బర్ ఇంకా దారుణంగా ప్రవర్తించాడని, అభ్యంతరకర ఎస్సెమ్‌ఎస్‌లు పంపించడంతో పాటు, వెగటు పుట్టించే ఫొటోలు పంపించేవాడని, సెల్‌ఫోన్ అంటే భయం కలిగేట్లు చేశాడని ఆమె ఆరోపించారు. కేవలం సినిమాల్లో కొనసాగాలనే తాపత్రయంతో ఇన్నాళ్లు మౌనంగా భరించానని, ఇక తన వల్ల కాదని, సినిమాలకు ముగింపు పలికేస్తున్నానని కూడా పేర్కొన్నారు సయాలీ.

కానీ సినిమా ఇండస్ట్రీని వదిలి వెళ్లేముందు తనని వేధించినవారికి సరైన బుద్ధి చెప్పాలనే పట్టుదలతో ఉన్నానని చెప్పారామె. త్వరలో అమితాబ్ బచ్చన్, షైనీ అహూజా, సాజిద్‌ఖాన్, ఆర్యబబ్బర్‌లపై కేసు పెట్టబోతున్నట్లు కూడా తెలియజేశారు సయాలీ. తనకు న్యాయం జరుగుతుందని భావిస్తున్నానని కూడా నమ్మకం వ్యక్తం చేశారామె.