అన్నపూర్ణ స్టూడియోస్ పతాకంఫై విజయేంద్ర ప్రసాద్ దర్శకత్వంలో అక్కినేని నాగార్జున ఈ చిత్రాన్ని నిర్మించారు.
దేశ స్వాతంత్రం కోసం నలుగురు మిత్రులతో కలిసి తెల్లవాళ్ళని ఎదుర్కొన్న రాజన్న దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత పోరాటానికి స్వస్తి చెప్పి స్వగ్రామం ఆదిలాబాద్ జిల్లా నేలకొండపల్లికి బయల్దేరుతాడు. అక్కడికి చేరే సరికి.... భారతదేశంలో ఇంకా కలవని నిజాం పాలకులు రజాకార్లతో, దొరల తోడుతో సాగిస్తున్న అమానుష పాలన చూసి చలించిపోతాడు. అణగారిన ప్రజల్లో తన పాటతో పోరాట పటిమను పెంచుతాడు. రజాకార్లను, దొరలను తరిమి కొట్టేలా చేస్తాడు. లక్ష్మమ్మను పెళ్లి చేసుకుంటాడు. అయితే వీరి తిరుగుబాటును సహించని నిజాం సర్కార్ వారిఫై భారీ దాడికి సన్నాహాలు చేస్తుంది. వారిని నిలువరించడానికి సిద్ధమైన రాజన్నకు స్వాతంత్ర పోరాటంలో అతనితో కలిసి పాల్గొన్న నలుగురు మిత్రులు వచ్చి బాసటగా నిలుస్తారు. పెద్ద పెట్టున వచ్చిన నిజాం సైనికులతో పోరాడుతూ రాజన్న బృందం నేలకొరుగుతారు. రాజన్న భార్య పారిపోతూ ప్రాణాలు విడుస్తుంది. వారి కూతురు మల్లమ్మను ఊరిలో ఒకరు పెంచుకుంటారు. మల్లమ్మకు పాటంటే ప్రాణం. ఆ ఊరి దొరసాని ఓసారి మల్లమ్మని పాడోద్దంటూ నిషేధం విధిస్తుంది. అలా పాడినందుకు శిక్షించడానికి వస్తే తప్పించుకు పారిపోతుంది. దొరల కష్టాలు పోవాలంటే - డిల్లీ వెళ్ళి ప్రధాని నెహ్రూని కలిసి పరిస్థితిని వివరించాలని సంగీతం మాస్టర్ చెప్పిన దాని ప్రకారం ఢిల్లీ ప్రయాణమవుతుంది. అలా వెళ్ళిన మల్లమ్మ ఢిల్లీ చేరి, తను అనుకున్నది ఎలా సాధించింది అనేది చిత్రంలో చూడాలి.
ఈ తరహా కధాంశంతో, భారీ ఖర్చుతో సినిమా చెయ్యడం నిజంగా సాహసమే. అయితే నటుడిగా ఈ తరహా పాత్ర చెయ్యాలనే కోరిక వల్లనో... తెలంగాణా వాదులను సంతృప్తి పరచాలనే ఆలోచనతోనో నాగార్జున సొంత బేనర్ ఫై ఈ చిత్రాన్ని చేసారు. పోరాట సన్నివేశాలకు రాజమౌళి రూపకల్పన చేస్తానని చెప్పడం కూడా నాగార్జున సాహసానికి బలాన్నిచ్చి వుంటుంది. అయితే పోరాట సన్నివేశాలకే కాకుండా సినిమా అంతా రాజమౌళి పర్యవేక్షణలోనే జరిగినట్లు సినిమా పరిజ్ఞానం ఉన్నవారికి తేలిగ్గా అర్ధమవుతుంది. మల్లమ్మగా అనీ నటన, కీరవాణి సంగీతం, నాగార్జున పోరాట సన్నివేశాలు ఈ చిత్రంలో ప్రత్యేకతలు. చారిత్రక నేపధ్యం అంటూనే పూర్తి కల్పిత గాధను సినిమా టిక్ గా తెరకెక్కించారు. సినిమా ప్రారంభంలో మల్లమ్మతో చేసిన సన్నివేశాలు చాలా బాగున్నాయి. ప్రధానంగా- మల్లమ్మను వూరివారంతా సాగనంపే సన్నివేశం. దొంగ బారినుండి డబ్బును వదిలేసి, మట్టిని దక్కించుకునే సన్నివేశం. ఇంటర్వెల్ ముందు నాగార్జున ఎంట్రీలో... బ్రిటిష్ వారితో పోరాటంలో హీరో ఇమేజ్ ని పెంచే ప్రయత్నం చేస్తూ, సహజత్వానికి దూరమైపోయారు. సినిమా రెండవ భాగం ప్రారంభం నుండి వరుసగా రజాకార్ల దురాగతాలను చూపే సన్నివేశాలు ప్రేక్షకులను స్పందింప జేస్తాయి. వీటిలో ముఖ్యంగా- దొరల బండి ముందు అవ్వ కొడుకు పరుగెడుతూ చనిపోవడం, అందానికి పన్ను కట్టమనే సన్నివేశం. ' వెయ్' అంటూ రాజన్న తన పాట... డప్పు దరువుతో గ్రామస్తులను చైతన్యవంతులను చేసే సన్నివేశాలు స్పూర్తిదాయకంగా ఉన్నాయి. అందులో ప్రధానంగా - పోచవ్వ పోరాటం, చిన్న పిల్లాడు ముందుకు రావడం, దొర దగ్గర కుర్రాడి తిరుగుబాటు. క్లైమక్స్ లో మిత్రులతో కలిసి నాగార్జున చేసే భారీ పోరాట సన్నివేశాలు ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటాయి. హీరో శత్రువులను వరుసపెట్టి చీల్చి చెండాడే ఇటువంటి సన్నివేశమే 'మగధీర' లో రాజమౌళి చేసారు. దాన్ని దృష్టిలో పెట్టుకునే 'సింహా'లో బోయపాటి శ్రీను చేసారు. ఇప్పుడు మరోసారి ఈ చిత్రంలో చూస్తాము. తేడా అంతా- ఇందులో హీరోతో పాటు మరో నలుగురు మిత్రులు వుండటం. పోరాటం చివరిలో మిత్ర బృందం అంత ఒకే చోటా చేరి తనువులు చాలించడం మనసులను కదిలిస్తుంది. అయితే ఆదిలాబాద్ నుంచి పదేళ్ళ మల్లమ్మ సుదూరం లో ఉన్న డిల్లీకి వెళ్ళడం... నెహ్రుని కలవడం వంటివి ప్రేక్షకులకు కొరుకుడు పడవు. తెలుగుతనంతో, పల్లె పలుకులతో, వీనుల విందుగా సాగిన కీరవాణి పాటలు, నేపధ్య సంగీతం ఈ చిత్రంలోని చాలా లోపాలను కప్పేసింది. చాలా సన్నివేశాలకు ప్రాణం పోసింది. “వేయరా వేయ్”, "అమ్మా అవనీ" వంటిపాటలు సినిమాకి వన్నె తెచ్చాయి.
పోరాటకారుడు రాజన్నగా నాగార్జున తన పూర్వ విధానానికి పూర్తి భిన్నమైన గెట్అప్ తో పాత్రకు పూర్తి న్యాయం చేసారు. అతని కుమార్తె మల్లమ్మగా సినిమాకు ప్రధానమైన పెద్ద పాత్రలో అనీ అద్భుతంగా నటించింది. రాజన్న భార్యగా స్నేహ, అతని మిత్రులుగా అజయ్, సుప్రీత్, శ్రావణ్, ప్రదీప్ రావత్ , సంగీతం మాస్టార్ గా నాజర్, దొరసానిగా శ్వేతా మీనన్, ఇతర పాత్రల్లో ముకేష్ రుషి, శకుంతల, హేమ, విజయకుమార్, శ్రీధర్, సత్యనాగ్ నటించారు. మల్లమ్మ తాత పాత్రలో చేసిన సమ్మెట గాంధీ కూడా చాలా బాగా చేసాడు. శ్యాం, అనిల్ భండారిల మంచి ఫోటోగ్రఫీ... కోటగిరి ఎడిటింగ్... రవీందర్ కళా ప్రతిభ చూపిన ఈ చిత్రంలో గ్రాఫిక్స్ ను రాజమౌళి తరహాలో సందర్భోచితంగా ఉపయోగించుకున్నారు.