|
బాలల చలనచిత్రోత్సవాలకు శాశ్వత వేదిక అయిన హైదరాబాద్లో బాలల దినోత్సవం నాడు ‘అంతర్జాతీయ 16వ బాలల చలనచిత్సోత్సవం’ శనివారం వైభవంగా ప్రారంభమయింది. హైదరాబాద్ పబ్లిక్గార్డెన్స్లోని లలిత కళాతోరణంలో జరుగుతున్న ఈ కార్యక్రమాన్ని కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అంబికా సోని జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు.ఈ చిత్రోత్సవానికి ముఖ్యమంత్రి కె.రోశయ్య, రాష్ట్ర పర్యాటక, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి జె.గీతారెడ్డి, రాజ్యసభ సభ్యుడు దాసరి నారాయణరావుతోపాటు పలువురు చలనచిత్ర, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. ఈ సందర్భంగా చిన్నారులు ప్రదర్శించిన నృత్య,గాన కళా ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. హీరో వెంకటేష్, యువహీరో రామ్చరణ్ తేజ, బోర్నవిటా గర్ల్ హాన్సిక ఈ చిత్రోత్సవాల్లో సందడి చేసారు. అలాగే దర్శకరత్న దాసరి నారాయణ రావు, తమ్మారెడ్డి భరద్వాజ, రేవతి, ఆశీష్ విద్యార్ధి తదితర సినీ రంగ ప్రముఖులు కూడా ఈ వేడుకలకు హాజరయ్యారు. కాంగ్రెస్ సీనియర్ నేత ఎమ్.సత్యనారాయణ రావు సహా పలువురు నేతలు వేడుకల్లో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా నందితాదాస్ ఆహుతులను ఉద్దేశించి స్వాగతోపన్యాసం చేసారు. ఈ బాలల చలనచిత్రోత్సవ పోటీకి మొత్తం అన్ని దేశాల నుంచి 70 చిత్రాలు వచ్చినట్లు ఆమె చెప్పారు. అలాగే వివిధ దేశాల నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న జ్యూరీ సభ్యులను సభకు పరిచయం చేసారు. సినీ, రాజకీయ ప్రముఖులు ఆహూతులను ఉద్దేశించి ప్రసంగించారు.
|