|
''ఒక సినిమా విజయవంతమైతే అందుకు సంబంధించినవాళ్లే సంతోషిస్తారు. 'సింహా' విజయంతో
తెలుగు చిత్రసీమ అంతా ఆనందించింది. బాలకృష్ణ మంచితనమే కారణం'' అన్నారు ప్రముఖ
దర్శకులు దాసరి నారాయణరావు. హైదరాబాద్లో నిర్వహించిన 'సింహా' అర్థ శతదినోత్సవ
కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా
నటించిన 'సింహా' 338 కేంద్రాల్లో 50 రోజులు పూర్తి చేసుకొంది. బోయపాటి శ్రీను దర్శకత్వం
వహించారు. పరుచూరి కిరీటి నిర్మించారు. ఈ వేడుకని నందమూరి కథానాయకులు, తెలుగు సినీ
ప్రముఖుల సమక్షంలో ఘనంగా నిర్వహించారు. బాలకృష్ణ, నమిత, బోయపాటి శ్రీనులకు దాసరి
చేతుల మీదుగా జ్ఞాపికలు అందించారు.
ఈ సందర్భంగా దాసరి ప్రసంగిస్తూ ''తెలుగు చిత్రసీమ
అంతా బాలకృష్ణ సింహా కోసం ఎదురు చూసింది. మన సినీ పరిశ్రమకి ఘన విజయం అవసరమైన
తరుణంలో ఈ చిత్రం వచ్చింది. ఇలాంటి విజయాలు ప్రతి యేటా అవసరం. ఈ సినిమా వెనక
ఎంతో శ్రమ, తపన ఉన్నాయి. దర్శకుడు బోయపాటి శ్రీను ప్రతి సన్నివేశాన్ని చక్కగా తీర్చిదిద్దారు.
ఈ సినిమా చూస్తుంటే నాకు పెద్దాయన ఎన్టీ రామారావే గుర్తుకొచ్చారు. లో ప్రొఫైల్ సన్నివేశాల్లో
బాలకృష్ణ సంభాషణలు పలికిన తీరు అద్భుతంగా ఉంది. బాలకృష్ణ చరిత్రలో నిలిచిపోయే పాత్రలు
చేయాలి. సింహా నాలో భయాన్నీ, బాధ్యతనీ పెంచాయి. దీన్ని మించిపోయేలా నేను పరమవీరచక్ర
చేయాలి'' అన్నారు.
బాలకృష్ణ మాట్లాడుతూ ''ఇన్ని కేంద్రాల్లో 50 రోజులు పూర్తి చేసుకొని శత
దినోత్సవం వైపు అడుగులు వేయడం అంటే ఈ రోజుల్లో మాటలు కాదు. ఇందుకు ప్రేక్షకుల
ఆదరణే కారణం. 'సింహా' విజయం తెలుగు పరిశ్రమ విజయం. ద్విపాత్రాభినయం నాకెంతో
తృప్తినిచ్చింది. నా నటన, వేషభాషల్ని ప్రేక్షకులు స్వీకరించారు. ఈ చిత్ర విజయంలో కీలక పాత్ర
బోయపాటి శ్రీనుదే. చక్రి మంచి స్వరాలిచ్చార''న్నారు. ''తెలుగు సినీ రంగం ఆశించిన ఘన
విజయమిది. గొప్ప చిత్రం కావాలని ప్రేక్షకులు తొలి నుంచీ ఎదురు చూశారు. అందర్నీ
సంతోషపరచినందకు బాబాయ్కీ, చిత్ర బృందానికీ థ్యాంక్స్'' అన్నారు యువ కథానాయకుడు
ఎన్టీఆర్. ఈ వేడుకలో సినీ ప్రముఖులు కల్యాణ్రామ్, రామ్, తారకరత్న, అశ్వనీదత్, అంబికా కృష్ణ,
కేఆర్ విజయ, ఉదయ్కిరణ్, చక్రి, సి.కల్యాణ్, పరుచూరి గోపాలకృష్ణ, బెల్లంకొండ సురేష్, తమ్మారెడ్డి
భరద్వాజ, పరుచూరి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
|