|
‘ఏ రంగంలోనైనా రాణించిన వారి ప్రతిభను గౌరవిస్తే.. అది ఇతరులకూ స్ఫూర్తిగా నిలుస్తుందని ముఖ్యమంత్రి కె.రోశయ్య అన్నారు. '2008 టీవీ నంది బహుమతులు, 2009-10 రాజీవ్ ప్రతిభా పురస్కారాల' ప్రదానోత్సవం శనివారమిక్కడ ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ముఖ్యమంత్రి మాట్లాడుతూ బుల్లితెర ప్రజల్లో చైతన్యం నింపుతోందన్నారు. ప్రాంతాల మధ్య దూరాలను చెరిపేస్తూ సమాచారం అందిస్తోందని పేర్కొన్నారు. టీవీల్లో వార్తల్ని వేగంగా అందించే సమయంలో జాగ్రత్త వహించాలని సూచించారు. నేర కథనాలు ఆందోళనకర రీతిలో వస్తున్నాయనీ, వీటి రూపకల్పనలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలనేది తన వ్యక్తిగత అభిప్రాయమన్నారు.
హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ.. నేర కథనాలు, అత్తా కోడళ్ల సంబంధాలను చూపే సీరియళ్లలో వివాదాలకు తావులేకుండా రూపొందించాలని సూచించారు. పర్యాటక శాఖ మంత్రి గీతారెడ్డి మాట్లాడుతూ.. అవార్డు గ్రహీతలకు నగదు మొత్తాన్ని పెంచామనీ, వచ్చే ఏడాది నుంచి టీవీలో వార్తలు చదివే వారికి కూడా బహుమతులు ఇవ్వనున్నట్లు వెల్లడించారు.
కార్యక్రమంలో గ్రేటర్ హైదరాబాద్ మేయర్ కార్తీకరెడ్డి, ఎఫ్డీసీ సంచాలకులు పార్ధసారథి, సినీ దర్శకుడు రాఘవేంద్రరావు తదితరులు పాల్గొన్నారు.
|