‘తారామణి’ మొదటి పాటను విడుదల చేసిన శ్రీలేఖ

అంజలి, ఆండ్రియా, వసంత్‌ రవి ప్రధాన పాత్రల్లో రామ్‌ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘తారామణి’. ఈ చిత్రం తమిళ్‌లో విడుదలై ఘనవిజయం సాధించింది. ఈ చిత్రాన్ని తెలుగులో అదే పేరుతో జె.ఎస్‌.కె. ఫిలిం కార్పొరేషన్‌ సమర్పణలో డి.వి. సినీ క్రియేషన్స్‌ పతాకంపై డి.వెంకటేష్‌ తెలుగులో అందిస్తున్నారు. ‘చేతులు చాచి.. యుగములు వేచి, నీకై ఎదురుచూస్తుంటాలే.. నీ కనుమేరల దారులలోన.. నా ఎద లాంతర వెలుగయ్యాలే..’ అంటూ సాగే మొదటి పాటను ప్రముఖ సంగీత దర్శకురాలు, సింగర్‌ యం.యం.శ్రీలేఖ విడుదల చేశారు.
ఈ సందర్భంగా యం.యం.శ్రీలేఖ మాట్లాడుతూ ”’తారామణి’ మొదటి పాటను విడుదల చేయడం చాలా హ్యాపీగా ఉంది. ఈ సినిమా గురించి నేను ముందే విన్నాను. తమిళ్‌లో సక్సెస్‌ఫుల్‌గా రన్‌ అయిన సినిమా. తెలుగులో ఈ సినిమాను తీసుకురావడం చాలా హ్యాపీగా ఉంది. ఇది నార్మల్‌ మూవీ కాదు. కరెంట్‌ ఎఫైర్స్‌తో ఉండే సినిమా ఇది. అన్ని ఎలిమెంట్స్‌ ఉంటూనే లేడీస్‌కి బాగా కనెక్ట్‌ అయ్యే సినిమా. ఎందుకంటే నేను కూడా ఈ సినిమా చూశాను. బాగా కనెక్ట్‌ అయ్యాను. మహిళలు ఎలా కష్టపడుతున్నారు, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్‌ని ఎలా ఫేస్‌ చేస్తున్నారు, వాటిని ఎలా అధిగమిస్తున్నారు అనేది ఈ సినిమాలో చూపించారు. వీటితోపాటు లవ్‌, ఎమోషన్‌.. ఇలా అన్నీ కలిసి ఉన్న సినిమా. వెంకటేష్‌గారు ఈ సినిమాని తెలుగులో రిలీజ్‌ చేస్తున్నారు. ఆయనకు ఈ సినిమా మంచి పేరుతోపాటు మంచి లాభాలు కూడా తెచ్చిపెట్టాలి. అలాగే యువన్‌ శంకర్‌రాజా పాటలంటే ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. వండర్‌పుల్‌ సాంగ్స్‌. డైరెక్టర్‌ రామ్‌ చాలా బాగా సినిమాని తీశారు. టీమ్‌కి ఆల్‌ బెస్ట్‌ చెప్తున్నాను. వెంకటేష్‌గారు స్ట్రెయిట్‌ మూవీస్‌ తీసి సక్సెస్‌ఫుల్‌ ప్రొడ్యూసర్‌గా మంచి పేరు తెచ్చుకోవాలని కోరుకుంటున్నాను” అన్నారు.
నిర్మాత డి.వెంకటేశ్‌ మాట్లాడుతూ ”శ్రీలేఖగారు ఫస్ట్‌ సాంగ్‌ని రిలీజ్‌ చేశారు. సినిమా గురించి కూడా చాలా బాగా చెప్పారు. ఇది ఖచ్చితంగా లేడీ ఆడియన్స్‌కి బాగా రీచ్‌ అవుతుందనుకుంటున్నాను. అందుకే శ్రీలేఖగారితో ఈ పాటను రిలీజ్‌ చేయించాం. తమిళ్‌లో ఏడెనిమిది వారాలు ఆడి మంచి కలెక్షన్స్‌ రాబట్టిన సినిమా ఇది. తెలుగులో అంతకంటే పెద్ద హిట్‌ అవుతుందని ఆశిస్తున్నాను” అన్నారు.
ఈ చిత్రానికి సంగీతం: యువన్‌ శంకర్‌రాజా, నిర్మాత: డి.వెంకటేష్‌, దర్శకత్వం: రామ్‌.