రీ ఎంట్రీలో క్రేజీ ఆఫర్స్ ఖాయం !

రానా – సాయిపల్లవి జంటగా నటించే చిత్రంలో ఒక ప్రత్యేక పాత్రను విజయశాంతి పోషించనుందనే వార్తలు వినిపించాయి. అయితే ఎందుకోగానీ ఇప్పుడు ఆ సినిమాలో ఆమె నటించడం లేదని, ఆమె స్థానంలో వేరే బ్యూటీ నటిస్తోందని తెలుస్తోంది.
‘నీదీ నాదీ ఒకే కథ’ మూవీతో విమర్శకుల ప్రశంసలు అందుకున్న దర్శకుడు వేణు ఉడుగుల దర్శకత్వంలో రూపొందబోయే రెండో సినిమాలో రానా- సాయి పల్లవి జంటగా నటిస్తున్న సంగతి తెలిసిందే. దీనికి ‘విరాట పర్వం 1992’ అనే టైటిల్ పరిశీలనలో ఉంది. ముందు ఈ పాత్రకు విజయశాంతిని అనుకున్నారట. కథకు బాగా ఇంప్రెస్ అయిన ఆమె.. ఆ సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని టాక్ కూడా వినిపించింది. అయితే ఏవో రాజకీయ కారణాల వల్ల ఆమె తప్పుకుందని తెలుస్తోంది. దీంతో ఇప్పుడామె స్థానాన్ని బాలీవుడ్ బ్యూటీ టబుతో రీప్లేస్ చేయనున్నారట.
తెలుగులో దాదాపు అందరు అగ్ర కథానాయకుల సరసనా నటించిన టబు.. చివరగా నటించిన చిత్రం బాలయ్య ‘పాండురంగడు’. ఆ సినిమా తర్వాత ఆమె మళ్ళీ టాలీవుడ్‌లో కనిపించలేదు. ప్రస్తుతం టబు అల్లు అర్జున్-త్రివిక్రమ్ కాంబో మూవీలో తల్లిగా నటిస్తూండడం ఇప్పటికే ఖరారైపోయింది. ఇప్పుడు ‘విరాట పర్వం 1992’ కూడా కన్ఫర్మ్ అయితే ఆమె టాలీవుడ్‌లో బిజీ అయ్యే అవకాశాలు చాలా ఉన్నాయి. హిందీలో రీసెంట్‌గా ‘అంధాధున్’ సక్సెస్ పుణ్యమా అని సెకండ్ ఇన్నింగ్స్‌ను జోరుగా సాగిస్తోన్న టబుకు ఇక్కడ రీ ఎంట్రీలో మరిన్ని క్రేజీ ఆఫర్స్ రావడం ఖాయం అంటున్నారు.