తెలుగులో నటించడానికీ వీళ్ల అనుమతి తీసుకోవాలా ?

 ‘‘నేను భారతదేశ పౌరురాలిని. ఎక్కడికైనా వెళతాను. ఏమైనా కొంటాను’’ అని తెగేసి చెప్పారు అమలాపాల్‌. లగ్జరీ కారు కొనుగోలు వివాదంలో చిక్కుకున్న ప్రముఖ నటి అమలాపాల్‌ గురువారం తీవ్రస్థాయిలో స్పందించారు. కేరళకి చెందిన అమలాపాల్‌.. పుదుచ్చేరిలో కారు రిజిస్టర్‌ చేయడం ద్వారా రూ.20లక్షల వరకు పన్ను ఎగ్గొట్టినట్టు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారంపై ఓ మలయాళ పత్రిక కథనం ప్రచురించింది. దీనిపై ఆమె ఒక ప్రకటన విడుదల చేశారు. ‘ఓ దినపత్రిక సర్క్యులేషన్‌ పెంచుకోవడానికి ఇలాంటి చౌకబారు విధానాలను అనుసరించడం తీవ్ర దిగ్భ్రాంతి కలిగించింది. ‘మాతృభూమి’ అని పేరు పెట్టుకున్న ఆ పత్రిక, జాతి సమైక్యతను దెబ్బతీసే విధంగా కథనాలు ప్రచురించడం దురదృష్టకరం.
చట్టాన్ని గౌరవించే భారతీయ పౌరురాలిని నేను. ఈ ఏడాది రూ.కోటికి పైగా పన్ను చెల్లించాను. ఆ పత్రిక కథనంలో పేర్కొన్న అవకతవకలేవీ జరగలేదని అధికారులు గుర్తించారు. అయినా నాపై, నా కుటుంబంపై కొందరు కావాలని బురద చల్లుతున్నారు.దేశంలోని అన్ని రాష్ట్రాల్లో ఒకే కరెన్సీ చలామణీలో ఉంది. జీఎస్టీ కూడా అమల్లోకి వచ్చింది. ఆ విషయం మరిచిన ఈ ‘జ్ఞానులకు’ గుణపాఠం చెప్పాలి. తెలుగు సినిమాల్లో నటించడానికి లేక బెంగళూరులో ఆస్తులు కొంటానికీ వీళ్ల (పత్రికను ఉద్దేశించి) అనుమతి తీసుకోవాలా’’ అని ఆమె ప్రశ్నించారు. తమిళులం, మలయాళీలం, గుజరాతీలమన్న తారతమ్యాలు లేకుండా అందరం భారతీయులుగా ముందుకు సాగాలని కోరుకుంటున్నట్టు ఆ ప్రకటనలో తెలిపారు.