అంతర్జాతీయ బాలల చిత్రోత్సవంలో ‘అప్పూ’

నవంబర్‌ 8 నుంచి 14 వరకూ హైదరాబాద్‌లో జరగనున్న అంతర్జాతీయ బాలల చలన చిత్రోత్సవంలో ప్రదర్శనకు ‘అప్పూ’ ఎంపికైంది. చిన్నారుల చిన్ని చిన్ని కోరికలను తల్లిదండ్రులు నిర్లక్ష్యం చేస్తే ఏమౌతుంది? పసి వయసులో తల్లిదండ్రుల నుంచి పిల్లలు ఏం కోరుకుంటారు? అనే సందేశంతో రూపొందిన చిత్రమిది. ‘ది క్రేజీ బాయ్‌..’ అనేది ఉపశీర్షిక. మాస్టర్‌ సాయి శ్రీవంత్‌ టైటిల్‌ రోల్‌లో మోహన్‌ మూవీ మేకర్స్‌ పతాకంపై స్వీయ దర్శకత్వంలో మోహన్‌ నిర్మించిన ఈ సినిమాలో జాకీ, లోహిత్‌ కుమార్, పూజ, బిందు, జ్వాలా చక్రవర్తి, దిలీప్ రాథోడ్ ప్రధాన తారాగణం. రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించిన స్క్రిప్ట్‌తో రూపొందిన సినిమా కావడం విశేషం.
ఈ సందర్భంగా దర్శక–నిర్మాత కె. మోహన్‌ మాట్లాడుతూ – ‘‘ఎనిమిదేళ్ల అప్పూకి ఏనుగును చూడాలని కోరిక. అతని తల్లిదండ్రులకు చూపించే తీరిక ఉండదు. ఎవరి ఉద్యోగాల్లో వాళ్లు బిజీ. అప్పుడు అప్పూ ఏం చేశాడనేది చిత్రకథ. అప్పూగా సాయి శ్రీవంత్‌ అద్భుతంగా నటించాడు. చిన్నారులతో పాటు తల్లిదండ్రులు అందరూ చూడాల్సిన చిత్రమిది’’ అన్నారు.
బాలలు సుమిత్‌ జాషు, సాయి అభిషేక్, లాస్య, మనోజ్ఞ, ఆదా, చిరుహాస్, సద్దాంలు ఇందులో కీలక పాత్రల్లో నటించారు.