ఎల్.విజయలక్ష్మికి నంద‌మూరి బాల‌కృష్ణ గౌర‌వ స‌త్కారం!

ఎల్.విజయలక్ష్మి …. బాల నటిగా సిపాయి కూతురు సినిమాతో  తెలుగు ఇండస్ట్రీ కి పరిచయమై ఆ తరువాత, జగదేకవీరుని కథ, ఆరాధన, గుండమ్మ కథ, నర్తన శాల, పూజా ఫలం, బొబ్బిలి యుద్ధం, రాముడు – బీముడు, భక్త ప్రహ్లాద వంటి ఎన్నో సినిమాలలో నటించి ప్రేక్షకులను ఊర్రూతలూగించి ఎన్నో అద్భుతాలు సృష్టించిన అలనాటి అందాల తార ఎల్. విజయలక్ష్మి…  50 సంవత్సరాల క్రితం పెళ్లి చేసుకొని సినిమా ఇండస్ట్రీ కి దూరంగా ఉన్నారు. అప్పట్లో సీనియర్ ఎన్టీఆర్ తో సుమారు15 సినిమాలకు పైగా నటించి సినీ ప్రేక్షకుల గుండెల్లో  నిలిచి పోయారు.

50 సంవత్సరాల తర్వాత మొదటి సారిగా తెనాలి లో జరుగుతున్న, లెజెండరీ నటుడు,యన్టీఆర్ శతజయంతి ఉత్సవాల్లో భాగంగా ఆదివారంనాడు తెనాలిలో ఆమెకు అవార్డు అంద‌జేశారు. ఈ సంద‌ర్భంగా సోమ‌వారంనాడు హైద‌రాబాద్‌లో ఆమెను వ్య‌క్తిగ‌తంగా క‌లిసి అభినంద‌న‌లు తెలపాల‌ని బాల‌కృష్ణ భావించారు. అందులో భాగంగా సినీ ప్ర‌ముఖులు స‌మ‌క్షంలో నంద‌మూరి బాల‌కృష్ణ ఎఫ్‌.ఎన్‌.సి.సి.లో ఆమెకు గౌర‌వ స‌త్కారం చేశారు.

నంద‌మూరి బాల‌కృష్ణ మాట్లాడుతూ… శ‌క‌పురుషుడి శ‌తాబ్డి పుర‌స్కార గ్రహీత ఎల్‌. విజ‌య‌ల‌క్ష్మిగారికి శిర‌స్సు వ‌చ్చి వంద‌నాలు స‌మ‌ర్పిస్తున్నాను. 60 ద‌శ‌కంలో చ‌ల‌న‌చిత్ర ప‌రిశ్ర‌మ‌ను ముందుకు న‌డిపిన‌ అతిర‌థులు నిర్మించిన చిత్రాల్లో ఆమె న‌ట‌ ప్ర‌యాణాన్ని కొన‌సాగించారు. ఈ సంద‌ర్భంగా  సురేష్‌బాబు, త‌మ్మారెడ్డి, ప‌రుచూరిగోపాల‌కృష్ణ‌, బ‌సిరెడ్డి వంటివారికి ధ‌న్య‌వాదాలు. అస‌లు శ‌క‌పురుషుడి శ‌తాబ్డి ఉత్స‌వాలకు అంకురార్ప‌ణ చేసింది కొమ్మినేని వెంక‌టేశ్వ‌ర‌రావు. బుర్రా సాయిమాధ‌వ్‌, ఆల‌పాటి రాజా, వైవి.ఎస్. చౌద‌రి  ముందుండి న‌డిపారు. న‌న్ను గౌర‌వాధ్య‌క్షునిగా పెట్టి తెనాలిలో ప‌లు కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించ‌డం గొప్ప విష‌యం. సినిమాలేకాక అటు రాజ‌కీయ‌, ప్ర‌జా సేవా రంగంలో కూడా సేవ‌లు చేసిన వారిని స‌త్క‌రించుకొనే మ‌హ‌త్క‌ర కార్య‌క్ర‌మం ఇది. అందులో భాగంగా విజ‌య‌ల‌క్ష్మిగారికి ఇవ్వ‌డం జ‌రిగింది

ఎల్‌. విజ‌య‌ల‌క్ష్మిగారు ఎర్నాకుళంలో పుట్టి, నాట్యం నేర్చుకుని 59 నుంచి 69వ‌ర‌కు ప‌దేళ్ళ సుదీర్ఘ ప్ర‌యాణం సినిమారంగంలో చేశారు. వంద‌కుపైగా సినిమాల్లో న‌టిస్తే అందులో 60కి పైగా నాన్న‌గారితో న‌టించారు. నాట్యంలో ప‌లువురు న‌టీమ‌ణులు వున్నా, ఎల్‌. విజ‌య‌ల‌క్ష్మిగారు కూచిపూడి, భ‌ర‌త‌నాట్యం, క‌థాక‌ళి, జావ‌లి వంటి ఎన్నో నాట్యాలు ప్ర‌ద‌ర్శించారు. అలా క‌ళామ‌త‌ల్లి సేవ చేశారు. ముఖ్యంగా న‌టీన‌టులు ఒక స్థాయికి చేరుకున్నాక సినీ ప్ర‌యాణం ఆగిపోతే ఒంట‌రిత‌నానికి గురికావ‌డం స‌హ‌జం. కానీ ఆమె నాన్న‌గారిని స్పూర్తిగా తీసుకుని అమెరికా వెళ్ళి సి.ఎ. చ‌దివి  వ‌ర్జీనియా యూనిర్శిటీలో బ‌డ్జెట్ మేనేజ‌ర్‌గా వుండ‌డం.చాలా విశేషం. ఇప్పుడు జూంబా డాన్స్ కూడా నేర్చుకుంటున్నారు. మ‌నిషికి ప‌నిలేకుండా ఖాళీగా వుంటే రోగం. ఆమె మ‌హిళా సాధికారిక‌త‌కు ప్ర‌తీక‌. ఆమె ఎక్కిన‌ మెట్లును భావిత‌రాలు ఆద‌ర్శంగా తీసుకోవాలి. ఆవిడ‌ను ఇక్క‌డ‌కు తీసుకు వ‌చ్చేలా చేసిన వైవిఎస్‌. చౌద‌రికి ధ‌న్య‌వాదాలు  అన్నారు.

ఎల్‌. విజ‌య‌ల‌క్ష్మి మాట్లాడుతూ…  ఎంతో అభిమానంతో న‌న్ను పిలిపించి గౌర‌వించ‌డం చూస్తుంటే క‌ళ్ళు చెమ‌ర్తున్నాయి. మీరంతా చాలా ద‌య‌తో, ప్రేమ‌తో న‌న్ను ఇక్క‌డికి ర‌ప్పించినందుకు బాల‌కృష్ణ‌గారికి ఆల‌పాటి రాజా, బుర్ర‌సాయిమాద‌వ్ గారికి ధ‌న్య‌వాదాలు. నేను చిన్న‌త‌నంనుంచి రామారావుగారిని ఆద‌ర్శంగా తీసుకునేదానిని. ఆయ‌న‌తో న‌టించేట‌ప్పుడు మొద‌ట చాలా భ‌య‌మేసేది.అయితే  పెద్ద హీరో అని ఫీలింగ్ ఉండేదికాదు. ఆయ‌న‌తో న‌టించేట‌ప్పుడు చాలా విలువ‌లు నేర్చుకున్నాను. క్ర‌మ‌శిక్ష‌ణ‌, మాట‌తీరు, సిన్సియారిటీ, చెప్పిందే చేయ‌డం, అంకిత భావం, నిబద్ధ‌త వంటి విష‌యాలు గ్ర‌హించాను. సినిమాలు అయ్యాక నేను చదివానంటే.. ఎన్‌.టి.ఆర్‌స్పూర్తి వ‌ల్లే జ‌రిగింది. అప్ప‌టి రామానాయుడుగారు త‌రం, ఎన్‌టిఆర్‌. త‌రం చూస్తుంటే నాకు ఎంతో ఆనందంగా వుంది. మ‌ర‌లా ఇలాంటి ఫంక్ష‌న్‌ల‌కు రావాల‌నుంది అని అన్నారు.

డి. సురేష్‌బాబు షీల్డును అంద‌జేసి మాట్లాడుతూ…  1964లో రాముడు భీముడు మా బేన‌ర్‌లో నిర్మించిన సినిమాలో విజ‌య‌ల‌క్ష్మిగారు న‌టించారు. అందులో దేశ‌మ్ము మారిందే.. అనే సాంగ్ వ‌చ్చిన‌ప్పుడు ఒళ్ళు నిక్క‌బొడుచుకునేవి. నాగార్జున‌సాగ‌ర్‌లో ఆ డాన్స్ తీశారు. దీనికోసం వారు ఎంత క‌ష్ట‌ప‌డ్డారో నాన్న‌గారు చెబుతుండేవారు. న‌టిగా 10 ఏళ్ళ‌లో 100 సినిమాలు చేయ‌డం పెద్ద గౌర‌వంగా భావించి ఇప్పుడు యూనివ‌ర్శిటీలో బాధ్య‌త‌లు నిర్వ‌హించ‌డం చాలా విశేషం. అప్ప‌టిత‌రం హీరోయిన్లు ఎక్క‌డున్నారో అని తెలుసుకుంటున్న క్ర‌మంలో ఇప్పుడు విజ‌య‌ల‌క్ష్మిగారు రావ‌డం చాలా సంతోషంగా వుంద‌ని అన్నారు.

త‌మ్మారెడ్డి భ‌ర‌ద్వాజ మాట్లాడుతూ…  నాన్న‌గారు నిర్మించిన జ‌మిందార్ సినిమాలో విజ‌య‌ల‌క్ష్మిగారు న‌టించారు. మాట‌ల్లో  మ‌ధుసూద‌న‌రావుగారు ద‌ర్శ‌కుడుగ‌దా అన్నారు. ఇంకా ఆమెకు అన్నీ గుర్తుకు వున్నాయి. ఎన్‌.టి.ఆర్‌. పుర‌స్కారం ఆమెకు రావ‌డం సంతోషకరం . ఆమె బ‌యోగ్ర‌ఫీ చూస్తుంటే, ఆవిడ‌ను అంద‌రూ స్పూర్తిగా తీసుకోవాలి. సినిమాలు వదిలినా యూనిర్శిటీని చూసుకోవ‌డం చాలా గొప్ప విష‌యం. చాలామంది న‌టీన‌టులు ఆమెను ఆద‌ర్శంగా తీసుకోవాలి అని సూచించారు.

వైవిఎస్‌. చౌద‌రి మాట్లాడుతూ… అమెరికా నుంచి విజ‌య‌ల‌క్ష్మిగారు వ‌స్తున్నార‌ని తెలియ‌గానే బాల‌కృష్ణ‌గారు స్వయంగా స‌త్క‌రించాల‌ని హైద‌రాబాద్ పిలిపించారు అన్నారు.
సి.క‌ళ్యాణ్‌గారి వంద‌న స‌మ‌ర్ప‌ణ చేసారు.ఈ కార్య‌క్ర‌మంలో ప‌రుచూరి గోపాల‌కృష్ణ‌, కాజ సూర్య‌నారాయ‌ణ‌, ప్ర‌స‌న్న‌కుమార్‌, బ‌సిరెడ్డి, రామ‌స‌త్య‌నారాయ‌ణ త‌దిత‌రులు పాల్గొన్నారు.