మ్యూజిక్ మ్యాస్ట్రో, ఇసైజ్ఞాని ఇళయరాజా ‘షష్టిపూర్తి’ సినిమాకు పని చేశారు. తన సంగీతంతో సినిమా స్థాయిని పెంచిన ఇళయరాజా ప్రస్తుతం ప్రమోషన్స్ కూడా చేస్తుండటం విశేషం. ‘షష్టిపూర్తి’ కోసం ఇళయరాజా ఓ స్పెషల్ ఇంటర్వ్యూ ఇచ్చారు. మా ఆయి (MAA AAIE) ప్రొడక్షన్స్ పతాకంపై డా. రాజేంద్ర ప్రసాద్, అర్చన, రూపేశ్, ఆకాంక్ష సింగ్ ప్రధాన పాత్రలుగా రూపేశ్ నిర్మించిన ఈ చిత్రానికి పవన్ ప్రభ దర్శకత్వం వహించారు. ఈ చిత్రాన్ని మే 30న విడుదల చేయబోతోన్నారు. ఈక్రమంలోనే లిరిసిస్ట్ చైతన్య ప్రసాద్ ఇసైజ్ఞాని ఇళయరాజాతో ప్రత్యేకంగా ముచ్చటించారు….
చైతన్య ప్రసాద్ : ఇన్నేళ్ల సినీ ప్రయాణం.. ఎన్నో వేల పాటలు అందించారు.. పైగా సింఫనీ కూడా చేశారు? సింఫనీ అంటే ఏంటి? అసలు ఆ ఆలోచన ఎలా వచ్చింది?
ఇళయరాజా : సింఫనీ అంటే ఏంటి? అనేది ఎవ్వరూ చెప్పలేరు.. సింఫనీ అనే ఓ అనుభూతి. దాన్ని ఎక్స్పీరియెన్స్ చేస్తేనే తెలుస్తుంది. త్వరలోనే నేను చేసిన ఆ ప్రయోగం వస్తుంది. అప్పుడు వినండి.. ఆస్వాధించండి.. అనుభూతి చెందండి. ఓ సినిమాకు సంగీతం చేయమని మాత్రమే దర్శక, నిర్మాతల నా వద్దకు వస్తుంటారు. నా పాండిత్యాన్ని వినియోగించి ఓ సింఫనీ చేయమని అడగరు. అందుకు నాకు నేనుగా, నాకోసం అన్నట్టుగా ఈ సింఫనీ చేస్తున్నాను.
చైతన్య ప్రసాద్ : ఎక్కడో కుగ్రామం నుంచి వచ్చారు.. ఇంతటి స్థాయికి ఎదిగారు.. మీ ప్రయాణం, యాత్ర గురించి చెప్పండి?
ఇళయరాజా : నేను ఎక్కడో చిన్న గ్రామంలో పుట్టాను. ఆ కుగ్రామంలో సంగీతాన్ని నేర్పించేవారు కూడా ఉండరు. అలాంటి చోట నుంచి ఈ స్థాయికి వచ్చాను. మీరు నా ప్రయాణాన్ని యాత్ర అన్నారు. యాత్ర అంటే ప్రారంభ స్థలం ఉండాలి.. ఓ దారి ఉండాలి.. ఓ గమ్యస్థానం ఉండాలి. కానీ నాకు ప్రారంభం లేదు.. గమ్యస్థానం లేదు. అందుకని మీరు యాత్ర అని చెప్పొద్దు.
చైతన్య ప్రసాద్ : మీ మ్యూజిక్ మీద ఎలా ఇంట్రెస్ట్ ఏర్పడింది? మీరు ఈ రంగంలోకి ఎలా వచ్చారు?
ఇళయరాజా : చిన్నప్పుడు మా అన్న గారు పాటలు పాడుతుండేవారు. అలా ఆ పాటలు వింటూ వింటూ నాకు కూడా పాటల మీద మక్కువ ఏర్పడింది. మా అన్న పాటలు వింటూ నేను ఏదో ఒకటి వాయిస్తూ ఉండేవాడిని. ఈ ప్రపంచంలో నాలాంటి వాళ్లు ఎవ్వరూ ఉండరు. గతంలోనూ లేరు.. భవిష్యత్తులోనే రారు. ఎందుకంటే నేను ఎవ్వరి దగ్గర సంగీతాన్ని నేర్చుకోలేదు. నాకు సంగీతంలో ఓనమాలు కూడా తెలియవు. కానీ ఈ ప్రపంచంలో ఏ ఫేమస్ మ్యూజిషీయన్ను అయినా తీసుకోండి.. వారు సంగీతాన్ని నేర్చుకుని ఉంటారు.. లేదా ఎవరి వద్దైనా శిష్యరికం చేసి ఉంటారు. కానీ నేను మాత్రం ఎవ్వరి దగ్గర సంగీతాన్ని నేర్చుకోలేదు. నాకు ఆ దేవుడు ఈ వరాన్ని ఇచ్చినట్టుగా అనిపిస్తుంది. అసలు నాకు సంగీతం ఎలా వచ్చింది? నా నుంచి పాటలు ఎలా ఉద్భవిస్తాయో నాకు కూడా తెలియదు.
చైతన్య ప్రసాద్ : మ్యూజిక్ డైరెక్టర్ అవ్వాలని, పాటల్ని కంపోజ్ చేయాలని ఎప్పుడు అనిపించింది?
ఇళయరాజా : మా అన్న గారు పాటలు పాడుతుంటే వాటికి మధ్యలో మ్యూజిక్ వాయించేవాడిని. అప్పుడు అందరూ చప్పట్లు కొడుతుండేవారు. ఆ చప్పట్లు వింటుంటే నాకు అలా గర్వం పెరుగుతూ వచ్చేది. అయితే వాళ్లు చప్పట్లు కొట్టేది నేను వాయించినందుకా? ఆ సంగీతానికా? అని అనుకునేవాడిని. కచ్చితంగా సంగీతానికి చప్పట్లు కొడుతున్నారు. అంటే అది కంపోజ్ చేసిన ఎంఎస్వి గారి కోసం చప్పట్లు కొడుతున్నారని అర్థమైంది. మనకు కూడా ఈ చప్పట్లు కావాలంటే.. మనం కూడా మ్యూజిక్ కంపోజ్ చేయాలి అని అలా కంపోజింగ్ మీద దృష్టి సారించాను.
చైతన్య ప్రసాద్ : ప్రస్తుతం ఉన్న ట్రెండ్ను ఎలా ఫాలో అవుతుంటారు?.. ఇక ఏఐ కూడా మ్యూజిక్ ఇండస్ట్రీని శాసిస్తుందని అంటున్నారు?
ఇళయరాజా : అసలు ఈ ట్రెండ్ అనే మాటే నాకు అర్థం కాదు. పాట బాగుంటే ఎప్పుడైనా వింటారు. మనం చేసే పాట జనాలకు నచ్చాలంతే. అందులో ట్రెండ్ అనేది ఏం ఉంది. ఏఐ అనేది స్వతాహాగా ఏం చేయలేదు. మనిషి మెదడు లక్ష ఏఐలతో సమానం. ఏఐ ఏం చేసినా కూడా అందులో జీవం ఉండదు. ముందే మనం ఫీడ్ చేసిన ఇన్స్ట్రక్షన్స్తో ఏఐ పని చేస్తుందంతే. మనిషి ఏఐని కనిపెట్టాడు.. కానీ ఓ ఏఐ మనిషిని గాని, మానవ మెదడుని గానీ సృష్టించలేదు.
చైతన్య ప్రసాద్ : మీలాంటి వారు ఇలాంటి కొత్త టీం కోసం ముందుకు వచ్చారు. ‘షష్టిపూర్తి’లో మీకు నచ్చిన అంశం ఏంటి?
ఇళయరాజా : నా కెరీర్ ఆరంభం నుంచి కూడా కొత్త వారిని ఎంకరేజ్ చేస్తూనే ఉన్నాను. భారతీరాజా, మణిరత్నం ఇలా అందరూ అప్పట్లో కొత్త వాళ్లే. నాతో సినిమాలు చేసిన తరువాత వారికి ఆ స్టార్డం, గుర్తింపు వచ్చింది. వాళ్లని వాళ్లు నిరూపించుకుని ఆ స్థాయికి వెళ్లారు. అలా కొత్తగా వచ్చే వారిని ఎంకరేజ్ చేయాలనే ఉద్దేశంతోనే ‘షష్టిపూర్తి’ని ఒప్పుకున్నాను. ఇందులో మేం చేసిన పని ఎలా ఉంది? అనేది ఆడియెన్స్ చెప్పాలి. మంచి కథ ఉందా? లేదా? అన్నదే నేను చూస్తాను. స్టార్స్ ఉన్నారా? లేదా? అన్నది నేను పట్టించుకోను.