దుల్కర్, నిత్యా ‘జనతా హోటల్’ విడుదలకు సిద్ధం !

విజయవంతమైన చిత్రాలు…పైగా, కేవలం కమర్షియల్ హిట్ చిత్రాలుగా మాత్రమే కాకుండా, ప్రేక్షకుల హృదయాలను కూడా తాకే చిత్రాలుగా పేరు తెచ్చుకోవడం అంటే చిన్న విషయం కాదు. ‘ప్రేమిస్తే’ నుంచి ”శoభో శంకర’ మూవీ వరకు సురేష్ కొండేటి అందించిన చిత్రాలూ ఈ కోవకే వస్తాయి. ఫీల్ గుడ్ కమర్షియల్ ఎంటర్ టైనర్స్ గా ఇలా సురేశ్ అందించిన అన్ని చిత్రాలు ప్రేక్షకులను ఆకట్టుకుని ఆయనకు మంచి నిర్మాత అనే పేరు తెచ్చాయి. ఇప్పుడు సురేష్ కొండేటి ‘జనతా హోటల్’ చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రవిశేషాల్లోకి వస్తే…
‘మహానటి’ మూవీ తరువాత దుల్కర్ సల్మాన్ కు మంచి పేరు తెచ్చి పెట్టె గొప్ప చిత్రమిది.
‘ఓకే బంగారం’తో తెలుగు, తమిళ ప్రేక్షకులతో కూడా మంచి జోడీ హిట్ పెయిర్ అనిపించుకున్న’.
దుల్కర్ సల్మాన్ నిత్య మీనన్ జంటగా రూపొందిన సూపర్ హిట్ మలయాళం చిత్రం ‘ఉస్మాద్ హోటల్’ .
ఈ చిత్రాన్ని ‘జనతా హోటల్’ పేరుతో తెలుగులోకి అనువదించారు సురేష్ కొండేటి. అన్వర్ రషీద్ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందింది. ఈ చిత్రం తొలి కాపీ సిద్ధమైంది. సెన్సార్ కార్యక్రమాలు కూడా పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని ఈ నెలలోనే విడుదల చేయాలనుకుంటున్నారు .
 
ఈ చిత్రవిశేషాలను సురేష్ కొండేటి తెలియజేస్తూ – “మలయాళంలో మంచి మ్యూజికల్ హిట్ గా నిలిచిన చిత్రం ఇది. కథ-కథనంతో పాటు దుల్కర్, నిత్యామీనన్ల జంట ఈ చిత్రానికి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. లవ్, సెంటిమెంట్, పేద, ధనిక వర్గాల మధ్య ఉండే భేదం.. తదితర అంశాల సమాహారంతో రూపొందిన చక్కని ఫీల్ గుడ్ కమర్షియల్ ఎంటర్ టైనర్ ఇది. సాహితి రాసిన సంభాషణలు హైలైట్ గా నిలుస్తాయి. మా సంస్థలో వచ్చిన ‘జర్నీ’, ‘పిజ్జా’, ‘డా. సలీమ్’ చిత్రాలకు ఆయన మంచి సంభాషణలు అందించారు. ఇప్పుడు ‘జనతా హోటల్’కి కూడా అద్భుతమైన మాటలు రాశారు. ఈ చిత్రానికి గోపీ సుందర్ స్వరపరచిన పాటలు ప్రత్యేక ఆకర్షణ అవుతాయి” అని చెప్పారు.
 
ఈ చిత్రానికి సంగీతం: గోపీ సుందర్, కెమెరా: ఎస్. లోకనాథన్, దర్శకత్వం: అన్వర్ రషీద్ ,
నిర్మాత : సురేష్ కొండేటి .