గుణ‌శేఖ‌ర్ ప్యాన్ ఇండియా చిత్రం `శాకుంత‌లం` ప్రారంభం!

త‌న‌కంటూ ప్ర‌త్యేక గుర్తింపు తెచ్చుకున్న డైరెక్ట‌ర్ గుణ‌శేఖ‌ర్ ఆదిప‌ర్వంలోని ఆహ్లాద‌క‌ర‌మైన ప్రేమ‌క‌థ ఆధారంగా తెర‌కెక్కిస్తోన్న చిత్రం `శాకుంతలం’. ప్యాన్ ఇండియా మూవీగా రూపొందుతోన్న ఈ చిత్రాన్ని దిల్‌రాజు స‌మ‌ర్ప‌ణ‌లో డిఆర్‌పి,గుణా టీమ్ వర్క్స్‌ ప‌తాకంపై గుణ‌శేఖ‌ర్ కుమార్తె నీలిమ గుణ  నిర్మిస్తున్నారు. స్టార్ హీరోయిన్ స‌మంత అక్కినేని శకుంతలగా టైటిల్ పాత్ర పోషిస్తున్నఈ చిత్రంలో.. మలయాళ హీరో దేవ్ మోహన్ దుష్యంతుడుగా నటిస్తున్నారు. ఈ మూవీ షూటింగ్‌ హైద‌రాబాద్ అన్నపూర్ణ స్టూడియోస్‌లో పూజా కార్య‌క్ర‌మాల‌తో ప్రారంభ‌మైంది. ముహూర్త‌పు స‌న్నివేశానికి అల్లు అర‌వింద్ క్లాప్ నివ్వ‌గా, దిల్‌రాజు కెమెరా స్విఛాన్ చేశారు.
గుణ శేఖర్ మాట్లాడుతూ.. ” ‘శాకుంతలం’ అనే ప్యాన్ ఇండియా‌ సినిమాని దిల్ రాజు ప్రొడక్షన్స్ అండ్ గుణ టీం వర్క్స్కలిసి నిర్మించడం ఎంతో ఆనందంగా ఉంది. ముఖ్యంగా దిల్ రాజు వంటి మేకర్ ప్రాత్సాహం ఉంటే ఆ సినిమా మేకింగ్, నిర్మాణ విలువలు ఎలా ఉంటాయో అంద‌రికీ తెలిసిందే. నా ప్రథమ పుత్రిక నీలిమ గుణ. త‌ను ఆర్ట్స్ అండ్ విజువల్ కల్చర్‌లో మాస్టర్స్ చేసింది. ఈ మూవీతో నిర్మాతగా పరిచయం అవుతోంది. కథానాయిక ప్రాధాన్యమున్న చిత్రం చేయడమంటే మామూలు విషయం కాదు. శాకుంతలం సినిమాలో శకుంతలగా ఎవరు నటిస్తారని .. ఆ సున్నితత్త్వం ఎవరికి ఉంది? అనుకుంటుండగా.. ప‌బ్లిక్ నుండి విశేషంగా నాకు సమంత పేరు  సూచించారు. ఆమె చాలా సెలెక్టివ్‌గా కథలు ఎంచుకుంటారు. ఈ కథ వినడంతోనే ఓకే చెప్పారు. ‘శాకుంతలం’ లోని శ‌కుంత‌ల‌ భావాలను త‌ను అర్థం చేసుకోవ‌డం, “త‌న‌లో శ‌కుంత‌ల‌ను చూసుకుని ఇలాంటి పాత్ర‌లో న‌న్ను నేను చూసుకోవ‌డానికి సిద్దంగా ఉన్నాను. ఎలాంటి ఎఫ‌ర్ట్ కావాల‌న్నా పెడ‌తాను”.. అని దీని కోసం నాలుగు నెలల క్రితమే అన్నింటిని నేర్చుకున్నారు. క్లాసికల్ డ్యాన్సులు కూడా నేర్చుకున్నారు. స్టోరీలో డెవలప్ మెంట్స్, పూర్తి స్క్రిప్ట్ వింటూ ఎంతో ఇన్వాల్వ్ అయ్యారు. దిల్ రాజు వంటి మేకర్, సమంతగారి లాంటి నటి ఉన్నప్పుడు క‌చ్చితంగా మ‌నం అనుకున్నవిధంగా సినిమాను తీయ‌గ‌లం అన్న న‌మ్మ‌కం క‌లిగింది. ఇక దుష్యంతుడిగా దేవ్ మోహన్ గారిని కూడా నీలిమనే సెలెక్ట్ చేసింది. అతను సినిమాకు కావాల్సిన హార్స్ రైడింగ్‌, స్వోర్డ్‌
ఫైటింగ్  ఇలా అన్నీ నేర్చుకున్నారు. రేపు వీరిద్ద‌రూ సినిమాలో శకుంతలా? దుష్యంతుడా? అనేలా పోటాపోటీగా ఉంటారు” అన్నారు
దిల్ రాజు మాట్లాడుతూ.. “సమంత మేనేజర్ మ‌హేంద్ర వచ్చి నాతో శాకుంతలం సినిమా గురించి చెప్పాడు. గుణ శేఖర్ మళ్లీ నిర్మాతగా ఎందుకు చేస్తున్నారు.. ఆయన వెనక ఎవరైనా ఉంటే బాగుంటుంది అన్నాను. ‘మీరు ఉంటారా స‌ర్’ అని అన్న‌ప్పుడు ‘స‌రే కాని నేను క‌థ వినాలి’ అని చెప్పాను. ‘ఒక్కడు’ సినిమా రిలీజ్ రోజు సత్యం థియేటర్లో చూశాను. అలాంటి సినిమా ఒకటి తీయాలని కలలు కన్నాను.. కానీ తీయలేకపోయాను. ఇలాంటి సినిమాలు తీయాలనే కోరిక అప్పుడే మొదలైంది. ‘శాకుంతలం’ లాంటి హిస్టారికల్ సినిమాను తీయడం మామూలు విషయం కాదు. సమంత ఆల్రెడీ కథకు ఓకే చెప్పింది కాబట్టి.. గుణ శేఖర్ కథ చెప్పేటప్పుడే సమంతను శ‌కుంత‌ల‌గా ఊహించుకున్నాను. అన్ని ఎమోషన్స్‌ బాగా కుదిరాయి. ‘సినిమాను ఇంకో లెవెల్‌కు తీసుకెళ్తాను’ అని గుణ శేఖ‌ర్ అన్నారు. నాలుగు నెలల నుంచి దీనికి సంబంధించిన పనులు జరుగుతున్నాయి. గుణశేఖ‌ర్ ఈ సినిమాతో త‌న కూతురిని నిర్మాతగా ప‌రిచ‌యం చేస్తున్నారు. వారి వెనుక నేనున్నాను. ఇక దుష్యంతుడిగా దేవ్ నిజంగా కింగ్‌లాగే ఉన్నాడు. మంచి దుష్యంతుడు దొరికాడు అనుకున్నాను. గుణ శేఖర్‌కు తగ్గ టీం దొరికింది. అద్భుతమైన సినిమా మీకు అందించేందుకు ప్రయత్నం చేస్తాం” అన్నారు.
సమంత అక్కినేని మాట్లాడుతూ..”నాకు ఎప్పుడూ ఓ చిన్న బాధ ఉండేది. నేను కొన్ని పాత్రలు పోషించలేనేమోనని అనుకున్నాను. రొమాంటిక్, విలన్, యాక్షన్ ఇలా అన్ని పాత్రలు చేశాను. కానీ నా డ్రీమ్ రోల్ అంటే పీరియాడిక‌ల్‌ రోల్. రాజకుమారి పాత్రను చేయాలని అనుకున్నాను. ఇప్ప‌టికీ నేను ఖాళీగా ఉంటే డిస్నీ సినిమాలు చూస్తుంటాను. నా కెరీర్‌లో ఇలాంటి సమయంలో ఈ పాత్ర  మరిచిపోలేని గొప్ప బహుమతి.  గుణ శేఖర్ గారు ప్రతీ సీన్‌ను అద్భుతంగా చెప్పారు. రిఫరెన్సెస్ అడిగితే కూడా లేదని నీలిమ చెప్పింది. అంతా దర్శకుడి మైండ్‌లోనే ఉందని అన్నారు. దిల్ రాజు గారు, గుణ శేఖర్ గారు అద్భుతమైన అవకాశాన్ని ఇచ్చారు. వంద శాతం నేను చేయాల్సింది చేస్తాను. ఈ సినిమా బడ్జెట్ నా రేంజ్‌ను మించి ఉంది. అయినా సరే నేను నా ప్రయత్నం చేస్తాను” అన్నారు. ఈ కార్య‌క్ర‌మంలో దిల్‌రాజు కుమార్తె హ‌న్షిత రెడ్డి పాల్గొన్నారు.
ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫ‌ర్‌: శేఖ‌ర్ వి జోసెఫ్‌. సంగీతం: మ‌ణిశ‌ర్మ‌, ఆర్ట్ డైరెక్ట‌ర్‌: అశోక్ కుమార్‌, ఎడిట‌ర్‌: ప్ర‌వీణ్ పూడి, కాస్ట్యూమ్ డిజైన‌ర్‌: నీతా లుల్లా, డైలాగ్స్‌: సాయి మాధ‌వ్ బుర్రా, లిరిక్స్‌: చైత‌న్య ప్ర‌సాద్‌, శ్రీ‌మ‌ణి, కొరియోగ్రాఫ‌ర్‌: రాజు సుంద‌రం, విఎఫ్ఎక్స్ సూప‌ర్ వైజ‌ర్‌, అల‌గ‌ర్‌స‌మీ, స్టంట్ కొరియోగ్రాఫ‌ర్‌: వెంక‌ట్‌,  సౌండ్ డిజైన‌ర్‌: బిస్వ‌దీప్ చ‌ట‌ర్జీ, లైన్ ప్రొడ్యూస‌ర్‌: య‌శ్వంత్‌, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్‌: కొమ్మినేని వెంక‌టేశ్వ‌ర రావు, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్‌: హేమంబ‌ర్ జాస్తి