ఈమెకు సెంచరీ కొట్టాలనుందంట !

తెలుగు చిత్ర సీమలో నటిగా 12 వసంతాలను అధిగమించిన కాజల్‌ నేటికీ అగ్ర కథానాయకిగా రాణిస్తోంది.  వెండితెరపై దశాబ్ధ కాలంపాటు హీరోయిన్‌గా వెలగడం అంటే మాటలు కాదు. అందివచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకుంటూ అగ్రతారగా ఎదగడం అసలు సులభం కాదు. కానీ నటి కాజల్‌ అగర్వాల్‌ వీటన్నింటిన దాటుకుంటూ తెలుగు, తమిళ చిత్ర సీమల్లో అగ్రనాయికగా పేరుపొందింది. ఈ బ్యూటీ కేరీర్‌ ప్రారంభంలో నటిగా కాస్త తడబడినా తర్వాత మంచి అవకాశాలే అందుకొంది.

తొలి చిత్రం ‘లక్ష్మీకళ్యాణం’ నిరాశపరిచినా, క్రియేటివ్‌ డైరెక్టర్‌ కృష్ణ వంశీ ‘చందమామ’ సినిమాతో అలరించింది. అనంతరం రామ్‌చరణ్‌, రాజమౌళి కాంబినేషన్‌లో తెరకెక్కిన టాలీవుడ్‌ అద్భుతం ‘మగధీర’లో  మిత్రవిందగా అభిమానులను చూపు తిప్పుకోకుండా చేసింది. అతర్వాత కాజల్‌ వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకుండా పోయింది. ఇటీవలే నటిగా యాభై చిత్రాల్లో నటించిన ఈ అమ్మడు ఇప్పుడు సెంచరీ(100) కొట్టాలన్న కోరికను వ్యక్తం చేసింది.

ఇటీవల ‘వివేగం’ చిత్రంలో అజిత్‌కు జంటగా నటించిన కాజల్‌, విజయ్‌ సరసన ‘మెర్శల్‌’ చిత్రంలో నటిస్తోంది. ఈ చిత్రం తనకు మరింత పేరు తెచ్చి పెడుతుందనే నమ్మకంతో ఉంది. మరో పక్క తెలుగులో నందమూరి కళ్యాణ్‌ రామ్‌ సరసన ‘ఎంఎల్‌ఏ’ అనే చిత్రం చేస్తోంది. ఇండస్ట్రీకి వచ్చి ఇన్నేళ్ళయినా స్టార్‌ హీరోలు మొదలుకుని యువ హీరోల వరకూ కాజల్‌తో  సినిమా చేయాలని చూస్తుండటం విశేషం.