‘జీఎస్టీ’ తో వర్మ నన్ను మరో మెట్టు పైకెక్కించాడు !

రొటీన్  సినిమా సంగీతానికి అప్పుడప్పుడు అడ్డుకట్టవేసి, శాస్త్రీయ సంగీతపు బాటవైపు మళ్లిస్తున్న సంగీతకర్త ఎం. ఎం. కీరవాణి. తెలుగు భాష మాధుర్యం తెలిసిన ఇప్పటి సంగీత దర్శకుల్లో కీరవాణి ఒకరు. భాష గురించి, భావం గురించి, సాహిత్యం గురించి అతనికి  బాగా తెలుసు.  అయితే కీర‌వాణి విలక్షణ దర్శకుడు రామ్‌ గోపాల్‌ వర్మ తెరకెక్కించిన వివాదాస్పద చిత్రం ‘గాడ్ సెక్స్ అండ్ ట్రూత్’ (జీఎస్టీ) కి కీరవాణి సంగీతం అందించ‌డం హాట్ టాపిక్‌గా మారింది. ‘పోర్న్ స్టార్’ మియా మాల్కోవా తో రూపొందిన వీడియోకి కీర‌వాణి సంగీతం అందించ‌డ‌మేంట‌ని అంద‌రు ఆశ్చ‌ర్య‌పోతున్నారు.

వర్మ తెరకెక్కించిన ‘గాడ్ సెక్స్ అండ్ ట్రూత్’ (జీఎస్టీ) పై ఎట్టకేలకు సంగీత దర్శకుడు కీరవాణి స్పందించారు…. జీఎస్టీతో తన సంగీతాన్ని వర్మ మరో మెట్టు ఎక్కించాడంటూ కీరవాణి పొగడ్తలు కురిపించారు. పొర్న్‌ స్టార్‌ మియా మల్కోవాతో వర్మ రూపొందించిన వీడియోకు కీరవాణి సంగీతం అందించిన విషయం తెలిసిందే.

‘‘సెల్యులాయిడ్ పై పలు రకాల భావాలను పలికించే ఆయన తెలివితేటలు తనతో 1991లో ‘రొమాన్స్’ను, 1992లో ‘కామెడీ’ని, 2018లో ‘సెక్స్’ను పలికించాయి. ఇక ఈ సంవత్సరంలో ఆయన తీయనున్న హారర్, వయొలెన్స్ చిత్రాలకు సంగీతాన్ని అందించబోతున్నా. నన్ను నమ్మిన పిచ్చి దర్శకుడికి(వర్మను ఉద్దేశించి) కృతజ్ఞతలు’’ అంటూ కీరవాణి ఓ ట్వీట్‌ చేశారు.

కాగా, కీరవాణి చేసిన ఈ ట్వీట్ కి ‘థ్యాంక్స్ కీరూ’ అని వర్మ రీట్వీట్ చేశారు.

దీనికి వర్మ తాజాగా రియాక్ట్ అయ్యారు…. ‘‘నువ్వు నాకంటే పిచ్చోడివి కాబట్టే నేను నిన్ను నమ్మాను ఎందుకంటే నీలాంటి ఒక తెలివైన పిచ్చోడు మాత్రమే క్షణక్షణం – అన్నమయ్య – బాహుబలి – గాడ్ సెక్స్ అండ్ ట్రూత్‌కి జంప్ చేయగలడు’’ అని వర్మ రీ ట్వీట్ చేశారు.

రెహమాన్ స్వర సారధ్యంలో కీరవాణి పాట 

సంగీత దర్శకులు తాము సంగీతమందించిన చిత్రాల్లో పాటలు పాడినా.. ఇతర సంగీత దర్శకుల చిత్రాల్లో పాటలు పాడటం చాలా అరుదు. ముఖ్యంగా సంగీత దర్శకులుగా అత్యున్నత స్థాయిలో ఉన్నవారు ఇతర సంగీత దర్శకుల కోసం సమయమివ్వటం మరింత అరుదు. అలాంటి అరుదైన కలయిక త్వరలో సంగీత అభిమానులను అలరించనుంది.

అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న దక్షిణాది స్వర సంచలనం ఏఆర్ రెహమాన్ స్వర సారధ్యంలో టాలీవుడ్ టాప్ మ్యూజిక్ డైరెక్టర్ ఎం ఎం కీరవాణి ఓ పాట పాడారు. తాను రెహమాన్ కోసం ఏ సినిమాలో పాట పాడిని విషయాన్ని తెలుపకపోయినా.. ‘స్వదేశ్’ సినిమాలో ‘ఏ జో దేశ్ హై తేరా’ లాంటి అద్భుతమైన మెలోడీని పాడినట్టుగా తన ట్విట్టర్ లో వెల్లడించారు కీరవాణి. మరి రెహమాన్ బాణీలో కీరవాని ఆలపించిన ఆ పాట ఏదో తెలుసుకోవాలంటే మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే.