భారత సినీ పరిశ్రమ మార్గదర్శి ఎల్‌.వి.ప్రసాద్‌ 112 వ జయంతి

“నేనంటే నేనే’ తర్వాత డిఫరెంట్‌ క్యారెక్టర్స్‌ చేసి ఈరోజు ఈ స్థాయిలో నిలబడ్డానికి దోహదపడిన ఎల్‌.వి.ప్రసాద్‌గారికి రుణపడి ఉంటాను. ఆ రోజు అయన నా వెన్ను తట్టకపోతే ఈ రోజు ఈ స్థాయిలో వుండేవాడినా?” …అంటూ రెబల్‌స్టార్‌ కృష్ణంరాజు ఎల్‌.వి.ప్రసాద్‌గారితో తన సాన్నిహిత్యాన్ని గుర్తుచేసుకున్నారు.
 
భారత చలనచిత్ర పితామహుడు, మూకీ యుగం నుండి డిజిటల్ మూవీస్ వరకు నటుడిగా, దర్శకుడిగా, నిర్మాతగా, డిస్ట్రిబ్యూటర్ గా, ఎగ్బిబిటర్ గా, ఫిలిం ల్యాబ్ అధినేతగా భారత సినీ పరిశ్రమ మార్గదర్శకుడు ఎల్.ప్రసాద్, 112 వ జయంతి జనవరి 17 న హైదరాబాద్ ప్రసాద్ లాబ్స్ లో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధి గా రెబల్ స్టార్ కృష్ణం రాజు,ఆయన సతీమణి, తెలంగాణ రాష్ట్ర ఐ టి ప్రిన్సిపాల్ సెక్రటరీ జయేష్ రంజన్, ప్రసాద్ లాబ్స్ అధినేత రమేష్ ప్రసాద్, ప్రసాద్ క్రియేటివ్ మెంటార్స్ ఫిలిం అండ్ మీడియా స్కూల్ ఎం డి కొవ్వూరి సురేష్ రెడ్డి, రమేష్ ప్రసాద్ తనయ శ్రీమతి రాధ పాల్గొన్నారు.
 
‘రెబల్‌స్టార్‌’ కృష్ణంరాజు మాట్లాడుతూ – ”ఎల్‌.వి. ప్రసాద్‌గారు సంపాదించినదంతా సినిమా పరిశ్రమ ఎదుగుదలకి, సినిమా ఇండస్ట్రీ కి గౌరవం రావడానికి ఖర్చు చేసారు. అంతే కాకుండా ‘సర్వేద్రియానం నయనం ప్రదానం’ అన్నారు కదా. ఆ స్పూర్తితో భారత దేశం గర్వించ దగ్గ ‘ఎల్‌.వి.ప్రసాద్‌ కంటి హాస్పిటల్‌’ ని స్థాపించారు. ఆయనతో నాకున్న అనుబంధం తోనే నేను ఇండస్ట్రీలో నిలబడ్డాను. ‘చిలకా గోరింక’ సినిమా విడుదలై ఆశించిన స్థాయిలో విజయవంతం కాలేదు. సినీ పరిశ్రమ వదిలేసి వెళ్ళిపోదామనుకున్నాను. అదే సమయంలో ‘నేనంటే నేనే’ సినిమా కోసం డూండీగారు ఒక పాత్ర కోసం నన్ను అడిగారు. అది కొంత నెగిటివ్‌ షేడ్‌ ఉన్న క్యారెక్టర్‌ కావడంతో నేను అంగీకరించలేదు. ఆ సమయంలో ఎల్‌.వి.ప్రసాద్‌గారిని కలవడం జరిగింది. ఆయనకి ఈ విషయం చెప్పగానే..దానికి అయన “సినిమాలో నువ్వు ‘హీరోవా, విలన్‌వా? రాజువా పేదవా’ అన్నది కాదు.. ఆ పాత్ర ద్వారా నువ్వు ఆడియన్స్‌కి ఎంత దగ్గరయ్యావన్నదే ముఖ్యం. ఎన్టీర్ చూడు హీరోయిన్ ప్రధాన పాత్ర అయినా సరే.. గుడ్డివాడుగా, కుంటివాడిగా అన్ని పాత్రలు చేసి మెప్పించాడు. అయన చేసిన పాత్రల ద్వారానే ప్రజల మనసులు దోచుకున్నాడు”… అని చెప్పి నన్ను ఆ క్యారెక్టర్‌ చేసేలా హిత బోధ చేసారు. వెంటనే డూండీగారిని కలిసి కొన్ని మార్పులతో ‘నేనంటే నేనే’ చిత్రం లో నటించాను . ఆ చిత్రం విజయవంతం కావడం..ఆ తర్వాత డిఫరెంట్‌ క్యారెక్టర్స్‌ చేసి ఈరోజు ఈ స్థాయిలో నిలబడ్డానికి దోహదపడిన ఎల్‌.వి.ప్రసాద్‌గారికి రుణపడి ఉంటాను. ఆ రోజు అయన నా వెన్ను తట్టకపోతే ఈ రోజు ఈ స్థాయిలో వుండేవాడినా? వారి ఫ్యామిలీతో నాకు మంచి సాన్నిహిత్యం ఉండటం నా అదృష్టంగా భావిస్తున్నాను” అన్నారు.
 
‘ప్రసాద్ క్రియేటివ్ మెంటార్స్ ఫిలిం అండ్ మీడియా స్కూల్’ మేనేజింగ్ డైరెక్టర్ కొవ్వూరి సురేష్ రెడ్డి మాట్లాడుతూ -”ఎల్‌.వి. ప్రసాద్‌గారి గురించి నాకు మాట్లాడే స్థాయి లేదు. కానీ అయన సంస్థలో ఒక భాగస్వామిగా ఈ రోజు నేను ఇక్కడ నిలపడటం నిజంగా నా అదృష్టంగా భావిస్తున్నాను. ఈ విషయం లో రమేష్ ప్రసాద్ గారు నన్ను గుర్తించి మంచి స్తానం ఇవ్వడం నా జీవితం లో ప్రత్యేక ఘట్టం రమేష్ ప్రసాద్ గారికి కృతజ్ఞతలు. ఈ ఎల్‌.వి. ప్రసాద్‌గారి 112 వ జయంతి సందర్భంగా ప్రసాద్ క్రియేటివ్ మెంటార్స్ ఫిలిం అండ్ మీడియా స్కూల్ లో శిక్షణ పొందిన వారికి గోల్డ్ మెడల్స్ ప్రీ కాన్వకేషన్ ప్రదానం చేయడం జరుగుతుంది. సినీ రంగం లో మంచి టెక్నీషియన్ గా డైరెక్టర్స్ గా సినిమాటోగ్రాఫర్ గా రాణించడానికి మా వద్ద అన్ని విధాలా సౌకర్యాలు వున్నాయి”. అన్నారు
 
తెలంగాణ ప్రభుత్వ ఐటి ప్రిన్సిపల్‌ సెక్రటరీ జయేష్‌ రంజన్‌ మాట్లాడుతూ – ”ఎల్‌.వి.ప్రసాద్‌గారి వంటి లెజెండరీ ఫంక్షన్‌కి రావడం చాలా సంతోషంగా ఉంది. ఆయన అన్ని భారతీయ భాషల్లో సినిమాలు నిర్మించారు. ముఖ్యంగా ఆయన నిర్మించిన ‘ఏక్‌ దూజే కేలియే’ చిత్రం అంటే నాకు చాలా ఇష్టం. ఆ చిత్రాన్ని చాలాసార్లు చూశాను.ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీకి చెందిన మహానటులు ఆయన చిత్రాల్లో పరిచయం అయ్యారు. అలాంటి ఎల్‌.వి.ప్రసాద్‌గారి 112వ జయంతి సందర్భంగా ‘ప్రసాద్‌ క్రియేటివ్‌ మెంటార్స్‌ ఫిలిం అండ్ మీడియా స్కూల్’ ప్రారంభించడం, వివిధ రంగాలలో ఔత్సాహిక యువతి యువకులకు శిక్షణ పొందే అవకాశం కల్పించటం మంచి పరిణామం. భారతదేశం గర్వించదగ్గ ‘బాహుబలి’వంటి భారీ చిత్రానికి విఎఫ్‌ఎక్స్‌ని గ్రాఫిక్స్ అందించడం మన హైదరాబాద్ గర్వించ తగ్గ గొప్ప విషయం. అలాంటి టెక్నీషియన్స్‌ మరింత మంది రావాలని, విఎఫ్‌ఎక్స్‌ గ్రాఫిక్స్ రంగం అభివృద్ధికి ‘ప్రసాద్‌ క్రియేటివ్‌ మెంటార్స్‌’ మరింత తోడ్పాటునందించాలని కోరుకుంటున్నాను” అన్నారు.
 
ఎల్‌.వి.ప్రసాద్‌ గ్రూప్స్‌ అధినేత, రమేష్ ప్రసాద్ మాట్లాడుతూ – ”నా జీవితంలో మా నాన్నగారితో గడిపిన క్షణాలన్నీ మధుర జ్ఞాపకాలే. ‘గ్రేట్‌ హ్యూమన్‌ బీయింగ్‌’. ఆయనకి పని తప్ప మరే ధ్యాస ఉండేది కాదు. ముఖ్యంగా సినిమానే ఆయన జీవితంగా మార్చుకున్నారు. నాన్నగారు చదువుకోలేదు. వంద రూపాయలతో బొంబాయికి వెళ్ళి అక్కడ ఒక స్టూడియోలో గేట్‌ కీపర్‌గా జాయిన్‌ అయ్యి ఎన్నో ఇబ్బందులు పడి మంచి స్థాయికి చేరుకున్నారు.ఆయన కమిట్‌మెంట్‌ చాలా గొప్పది. దాంతోనే అన్ని భాషలు మాట్లాడటం నేర్చుకున్నారు. అందరితో చాలా సాన్నిహిత్యంగా ఉండేవారు. రామారావు, నాగేశ్వరరావు, సావిత్రి, జమున, కృష్ణ, కృష్ణంరాజు అంటే చాలా ఇష్టపడేవారు. ప్రసాద్ ప్రొడక్షన్స్ బ్యానర్ లో ఎన్నో విజయవంతమైన చిత్రాలు తీసారు. ప్రజల్లో మంచి రెస్పెక్ట్‌ వచ్చింది. “నా సినిమాలు చూసి నన్ను ఇంత గొప్పవాడిని చేసిన ప్రజలకి మంచి చేయాల”ని ఒక ట్రస్ట్‌ ఏర్పాటు చేసి.. దానికి సినిమాల ద్వారా వచ్చిన కోటి రూపాయలు డొనేషన్‌ ఇవ్వడం జరిగింది. ఆ డబ్బుతోనే ‘ఎల్‌.వి.ప్రసాద్‌ ఐ ఇన్‌స్టిట్యూట్‌’ స్థాపించారు. ఈరోజు అది వరల్డ్‌లోనే బెస్ట్‌ ఐ హాస్పిటల్‌గా ఎంతో పేరు తెచ్చుకుంది. అలాగే ప్రసాద్‌ ఐమాక్స్‌ కూడా స్థాపించారు. ఆయన గౌరవార్థం భారత ప్రభుత్వం 2006 లో పోస్టల్ స్టాంప్‌ విడుదల చేసింది. ఇప్పుడు ‘ప్రసాద్‌ క్రియేటివ్‌ మెంటార్స్‌’లో యానిమేషన్‌, గేమింగ్‌వంటి వాటికి శిక్షణ ఇస్తున్నాం. ‘బాహుబలి’లాంటి గొప్ప సినిమాలు మరిన్ని రావడానికి మా సపోర్ట్‌ను కంటిన్యూ చేస్తాం” అన్నారు.
 
సీనియర్ జర్నలిస్ట్ నాగేంద్ర కుమార్ వ్యాఖ్యాత గా వ్యవహరించిన ఈ కార్యక్రమం లో “ప్రసాద్ క్రియేటివ్ మెంటార్స్ ఫిలిం అండ్ మీడియా స్కూల్” విద్యార్థులకు గోల్డ్ మెడల్స్, సర్టిఫికెట్స్ ప్రదానం చేసారు.