‘డిటెక్టివ్‌’ ఆడియన్స్‌కు కొత్త ఫీల్‌ ఇస్తుంది !

మాస్‌ హీరో విశాల్‌ కథానాయకుడుగా విశాల్‌ ఫిల్మ్‌ ఫ్యాక్టరీ సమర్పణలో మిస్కిన్‌ దర్శకత్వంలో జి.హరి నిర్మించిన సస్పెన్స్‌ అండ్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ‘డిటెక్టివ్‌’. ఈ అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి నవంబర్‌ 10న ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి నిర్మాత జి.హరి సన్నాహాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా ఆదివారం ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో హీరో విశాల్‌, హీరోయిన్‌ ఆండ్రియా, నిర్మాత హరి, మాటల రచయిత రాజేష్‌ ఎ.మూర్తి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా…

మాస్‌ హీరో విశాల్‌ మాట్లాడుతూ – ”మంచి థ్రిల్లర్‌, ఎంటర్‌టైనింగ్‌గా సాగుతుంది. నాకు నటుడిగా మంచి పేరు, నిర్మాతగా మంచి కలెక్షన్స్‌ సాధించి పెట్టిన చిత్రమిది. అక్టోబర్‌ నెలలో తమిళంలో ‘తుప్పరివాలన్‌’ పేరుతో తమిళంలో విడుదలై మంచి విజయాన్ని సాధించింది. ఇక్కడ దర్శకుడు మిస్కిన్‌గారి గురించి ప్రత్యేంగా ప్రస్తావించాలి.. ఆయనొక విభిన్నమైన వ్యక్తి.ఈ సినిమాకు ఫైట్స్‌ను ఆయనే కంపోజ్‌ చేసుకున్నాడు. సాధారణంగా ఓ హీరోకు అభిమానులుంటారు. సదరు హీరో సినిమా రిలీజ్‌ అవుతుందంటే కొన్ని ఎక్స్‌పెక్టేషన్స్‌ ఉంటాయి. ఆ ఎక్స్‌పెక్టేషన్స్‌తో ఆ సినిమాకు మంచి ఓపెనింగ్స్‌ వస్తాయి. కానీ దర్శకుడు మిస్కిన్‌ సినిమాకు ప్రత్యేకంగా అభిమానులుంటారు. అలాంటి ఓ దర్శకుడితో సినిమా చేస్తే, నాకు గుర్తుండిపోయే చిత్రమవుతుందనిపించింది. మిస్కిన్‌గారి దర్శకత్వంలో ఎనిమిదేళ్లుగా పనిచేయాలని అనుకుంటూ ఉండేవాడిని. కానీ వీలుకాలేదు. చివరకు ఎనిమిదేళ్ల తర్వాత కుదిరింది. ముందు నాలుగైదు లైన్స్‌ అనుకున్నాం కానీ నచ్చలేదు. చివరకు మిస్కిన్‌గారు డిటెక్టివ్‌ కాన్సెప్ట్‌తో చెప్పిన ఈ లైన్‌ బాగా నచ్చింది. నటుడు ప్రసన్న ఇందులో నా స్నేహితుడి పాత్రలో నటించారు. సినిమా హాలీవుడ్‌ స్టాండర్డ్స్‌లో కనపడుతుంది. అను ఇమ్మాన్యుయేల్‌ మంచి పాత్రలో నటించింది. సినిమాలో ఓ గ్రే షేడ్స్‌ ఉన్న లేడీ పాత్ర వుంటుంది. దాన్ని ఎవరూ చేస్తే బావుంటుందని ఆలోచిస్తే..నాకు ఆండ్రియా గుర్తుకు వచ్చింది. తనైతే పాత్రకు న్యాయం చేస్తుందని భావించాం. అనుకున్నట్లుగానే తను పాత్రకు న్యాయం చేసింది. సినిమా కోసం తను పడ్డ కష్టం నాకు తెలుసు. క్లైమాక్స్‌ ఫైట్‌ను పిచ్చాగరం అనే ప్లేస్‌లో షూట్‌ చేశాం. అక్కడ కనీస వసతులు కూడా కల్పించలేం. అటువంటి ప్లేస్‌లో , మురికి నీళ్లలో ఆండ్రియా నటించింది.

నా కెరీర్‌లో వన్‌ ఆఫ్‌ ది బెస్ట్‌ మూవీ ఇది. తెలుగు ఆడియెన్స్‌కు కొత్త ఫీల్‌ను ఇస్తుంది. వచ్చే ఏడాది ఈ సినిమాకు సీక్వెల్‌ను ప్లాన్‌ చేస్తున్నాం. వినయ్‌ ఇందులో డెవిల్‌ అనే విలన్‌ పాత్రలో నటించాడు. అలాగే భాగ్యరాజ్‌గారు కూడా నెగటివ్‌ టచ్‌ ఉన్న పాత్రలో కనిపించారు. సినిమాకు బ్యాగ్రౌండ్‌ స్కోర్‌ మెయిన్‌ ఎసెట్‌గా నిలిచింది. తెలుగు సినిమా సక్సెస్‌లలో మీడియా మెయిన్‌ రోల్‌ తీసుకుంటుంది. బి.ఎ.రాజుగారు వారింటి హీరోలా భావించి సినిమా ప్రమోషన్స్‌ చేస్తుంటారు” అన్నారు.

ఇంకా మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు విశాల్‌ సమాధానాలిచ్చారు. తెలుగు, తమిళంలో ఓకేసారి ఎందుకు విడుదల చేయడం లేదు అని అడిగిన ప్రశ్నకు..సెన్సార్‌ చేయించడం పెద్ద సమస్యగా మారింది. ఇప్పుడు తమిళ సినిమా సెన్సార్‌ను ముంబైకి చేంజ్‌ చేశారు. సెన్సార్‌ సర్టిఫికేట్‌ను సాధించడమంటే డిగ్రీ సర్టిఫికేట్‌ను సాధించడమనేటట్టుగా మారింది. దీంతో పాటు తెలుగులో మన సినిమాను విడుదల చేయాలనుకునే సమయానికి పెద్ద హీరో సినిమా రిలీజ్‌కు ఉంటుంది. దాన్ని వల్ల థియేటర్స్‌ విషయంలో సమస్యలుంటాయని అన్నారు. ‘మెర్సల్‌'(అదిరింది) సినిమా విషయంలో ప్రభుత్వ స్పందన గురించి అడిగిన ప్రశ్నకు విశాల్‌ మాట్లాడుతూ..ఓ సినిమాకు సెన్సార్‌ సెంట్రల్‌ బోర్డు అంగీకరించిన తర్వాత సమస్యలు ఉండకూడదు. మధ్యలో రాజకీయ పార్టీలు అన్నీ చేరి సినిమాలోని డైలాగ్స్‌ను కట్‌ చేసుకుంటూ వెళ్లమంటూ ఉంటే చివరకు సెన్సార్‌ సర్టిఫికేట్‌ను మాత్రమే చూపించాల్సి ఉంటుంది. సినిమా చూడటానికి ఏమీ మిగలదు..అన్నారు.

పైరసీపై చేస్తున్న పోరాటం గురించి ప్రశ్నించినప్పుడు విశాల్‌ మాట్లాడుతూ..పైరసీ మీద చేసే పోరాటం నాకు చాలా ఆసక్తికరంగా అనిపిస్తుంది. అయితే పైరసీపై ఏదో ఒకరోజు విజయం సాధిస్తాననే నమ్మకం ఉందన్నారు. విలన్‌గా ఎందుకు నటించారనే ప్రశ్నకు సమాధానంగా విశాల్‌ మాట్లాడుతూ..నాకు నెగటివ్‌ రోల్‌ చేయాలని చాలా రోజులుగా మనసులో కోరిక ఉండేది. అది మోహన్‌లాల్‌గారి ‘విలన్‌’ సినిమాతో తీరిపోయింది. ఆయన కళ్లతోనే హావభావాలను వ్యక్తపరుస్తారు. అటువంటి గొప్ప నటుడితో నటించడం చాలా కష్టం. నా భయాన్ని భయట పెట్టకుండా నటించాను. ఈ ‘విలన్‌’ సినిమాలో అక్రోషంతో కూడిన పాత్రలో కనపడతాను. ఈ సినిమా తమిళం, తెలుగులో డిసెంబర్‌లో విడుదలవుతుందని తెలిపారు.

తెలుగు స్ట్రయిట్‌ సినిమా ఎప్పుడు చేస్తారని ప్రశ్నిస్తే..మంచి స్క్రిప్ట్‌ కోసం వెయిట్‌ చేస్తున్నాను. రాగానే తప్పకుండా తెలుగులో స్ట్రయిట్‌ సినిమా చేస్తానని అన్నారు. సినిమాలపై జిఎస్‌టి ప్రభావం గురించి అడిగినప్పుడు విశాల్‌ చెబుతూ..సెంట్రల్‌ గవర్నమెంట్‌తో చర్చలు జరుపడానికి ప్రయత్నాలు చేస్తున్నాం. రీసెంట్‌గా హోటల్‌కు సంబంధించిన వ్యక్తులంతా సెంట్రల్‌ గవర్నమెంట్‌ను కలిసి రెప్రజెంట్‌ చేస్తే జిఎస్‌టిని 12 శాతానికి తగ్గించారు. అలాంటి రెప్రజెంటేషన్‌ను మేం కూడా కలిసి చేయాలనుకుంటున్నామని అన్నారు.

మీరు ప్రత్యక్ష రాజకీయాల్లోకి ఎప్పుడు వస్తారని అడిగిన ప్రశ్నకు విశాల్‌ బదులిస్తూ..ప్రస్తుతం మంచి సినిమాలే వస్తున్నాయి. డబ్బులు కూడా బాగానే సంపాదిస్తున్నాను. ప్రస్తుతం ఎమ్మెల్యే జీతం రెండు లక్షలుంటుంది. ఆ డబ్బుతో నాలైఫ్‌ను లీడ్‌ చేస్తూ..ప్రజలకు మేలు చేయాలి. అధికారం ఉంటేనే ప్రజలకు మేలు చేయవచ్చునని అనిపించిన రోజున తప్పకుండా రాజకీయాల్లోకి వస్తానంటూ బదులిచ్చారు విశాల్‌.

హీరోయిన్‌ ఆండ్రియా మాట్లాడుతూ – ”థ్రిల్లింగ్‌ డిటెక్టివ్‌ మూవీ. డైరెక్టర్‌ మిస్కిన్‌ ఓ కల్ట్‌ డైరెక్టర్‌. సినిమా తమిళంలో మంచి విజయాన్ని సాధించింది. నవంబర్‌ 10న విడుదల కానున్న ఈ సినిమా తెలుగులో కూడా మంచి సక్సెస్‌ను సాధిస్తుందనే నమ్మకముంది. ఈ సినిమాలో నేను గ్రే షేడ్స్‌ ఉన్న పాత్ర చేశాను. నా పాత్ర కోసం యాక్షన్‌ సీక్వెన్స్‌ కష్టపడి నేర్చుకున్నాను. అలాగే, హార్లీ డేవిడ్‌ సన్‌ బైక్‌ను నడపడం నేర్చుకున్నాను. నన్ను ఎగ్జయిట్‌ చేసే ఎలిమెంట్స్‌ ఉన్నప్పుడే సినిమాలు చేస్తాను. ప్రస్తుతం తెలుగులో మూడు సినిమాలు విడుదల కానున్నాయి. ‘డిటెక్టివ్‌’ చిత్రం అందులో ఒకటి. అలాగే ‘తారామణి’, ‘గృహం’ చిత్రాలు కూడా ఉన్నాయి. మంచి పాత్రలు వస్తే తెలుగులో కూడా చేయడానికి నేను సిద్ధం. అన్నారు. హ్యాష్‌ టాగ్‌ ‘మీ టూ’పై మీ స్పందనేంటి…. అని అడిగిన ప్రశ్నకు ఆండ్రియా బదులిస్తూ..ఓ అమ్మాయి ఎవరితో పడుకుంటుందనేది ఆమె వ్యక్తిగత విషయం. ఆ విషయంపై మరొకరు బలవంతం చేయకూడదు. చేయలేరు కూడా. నా సినీ కెరీర్‌లో నాకు లైంగికంగా ఇబ్బందులకు గురిచేసే సమస్యలు ఎక్కడా ఎదురు కాలేదు. అలాంటి సమస్యలుంటే ఆ సినిమాను వదులుకోవడానికి నేను సిద్ధం అని బదులిచ్చారు.

మాటల రచయిత రాజేష్‌ ఎ.మూర్తి మాట్లాడుతూ – ”నవంబర్‌ 10న సినిమా విడుదలవుతుంది. తమిళంలో సినిమా ఘన విజయం సాధించింది. తెలుగులో కూడా పెద్ద హిట్‌ అవుతుందని కాన్ఫిడెంట్‌గా ఉన్నాను” అన్నారు.

మాస్‌ హీరో విశాల్‌, అను ఇమ్మానుయేల్‌, ఆండ్రియా, ప్రసన్న, కె.భాగ్యరాజ్‌, సిమ్రాన్‌, జాన్‌ విజయ్‌, అభిషేక్‌ శంకర్‌, జయప్రకాష్‌ ముఖ్యపాత్రలు పోషించిన ఈ చిత్రానికి సంగీతం: అరోల్‌ కొరెల్లి, సినిమాటోగ్రఫీ: కార్తీక్‌ వెంకట్రామన్‌, పాటలు: డా.చల్లా భాగ్యలక్ష్మి, మాటలు: రాజేష్‌ ఎ.మూర్తి, నిర్మాత: జి.హరి, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: మిస్కిన్‌.