నాని, సుధీర్‌బాబు `వి` మార్చి 25 విడుద‌ల

నాని, సుధీర్‌బాబు హీరోలుగా నివేదా థామ‌స్‌, అదితిరావు హైద‌రి హీరోయిన్లుగా రూపొందుతున్న చిత్రం `వి`. “ఈ క్షణం నుంచి నా శత్రువులకి నా దయా దాక్షిణ్యాలే దిక్కు“ ట్యాగ్ లైన్‌. హీరో నాని 25వ చిత్ర‌మిది. నిర్మాత దిల్‌రాజు సమర్పణలో శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై శిరీష్‌,ల‌క్ష్మ‌ణ్‌,హ‌ర్షిత్ నిర్మాత‌లుగా మోహ‌న‌కృష్ణ ఇంద్ర‌గంటి ద‌ర్శ‌క‌త్వంలో ఈ చిత్రం తెర‌కెక్కుతోంది. ప్ర‌స్తుతం చిత్రీక‌ర‌ణ జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని ఉగాది సంద‌ర్భంగా మార్చి 25న విడుద‌ల చేస్తున్నారు.
నిర్మాతలు శిరీష్‌,ల‌క్ష్మ‌ణ్‌,హ‌ర్షిత్ మాట్లాడుతూ… “నాని 25వ చిత్రం మా బ్యాన‌ర్‌లో చెయ్యడం ఆనందంగా ఉంది. అలాగే సుధీర్‌బాబు, నివేదా థామ‌స్‌, అదితిరావు కాంబినేష్ కుదిరింది. మోహనకృష్ణ‌ ‘స‌మ్మోహ‌నం’ వంటి సూప‌ర్‌హిట్ త‌ర్వాత తెర‌కెక్కిస్తున్న చిత్ర‌మిది. 80 శాతం చిత్రీక‌రణ పూర్త‌య్యింది. రెండు ఫైట్స్, ఓ సాంగ్ మాత్రం బ్యాలెన్స్ ఉంది. ఇప్ప‌టి వ‌ర‌కు చూడ‌ని ఓ కొత్త పాత్ర‌లోనాని క‌న‌ప‌డ‌తారు. త‌ప్ప‌కుండా అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కుల‌కు సినిమా న‌చ్చేలా ఉంటుంది. ఉగాది సంద‌ర్భంగా సినిమాను మార్చి 25న విడుద‌ల చేస్తున్నాం“ అన్నారు.