‘సాహో’ షూటింగ్‌ కి ‘నో’ చెప్పిన దుబాయ్

‘బాహుబలి’  తర్వాత ప్రభాస్ చేస్తున్న సినిమా ‘సాహో’. సుజిత్ డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రభాస్ కెరీర్‌లో 19వ సినిమా కావడం విశేషం. ఈ సినిమా తెలుగు, తమిళ్, హిందీ, మలయాళం భాషల్లో తెరకెక్కుతోంది. ఈ సినిమా భారీ బడ్జెట్‌తో రూపొందుతోంది.
 బడ్జెట్‌లో ఎక్కువ భాగం స్టంట్లు, యాక్షన్ సీన్స్ కోసం ఖర్చు చేస్తున్నారు. హాలీవుడ్ నుంచి ఫైట్ మాస్టర్స్‌ని రప్పించి యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఈ సినిమాలో ప్రభాస్ సరసన బాలీవుడ్ భామ శ్రద్ధా కపూర్ హీరోయిన్‌గా నటిస్తోంది. అయితే ఈ సినిమా షూటింగ్‌ను దుబాయ్‌లో నిర్వహించాలని చిత్రబృందం భావించింది. దీనికి దుబాయ్ అధికారులు పర్మిషన్ ఇవ్వలేదని సమాచారం. దీంతో రామోజీ ఫిలిం సిటీలో భారీ సెట్ వేసి షూటింగ్‌ చేయాలని చిత్రబృందం ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది.
డాన్స్ మాస్టర్  దర్శకత్వంలో యంగ్ రెబెల్ స్టార్‌ ? 
 ‘బాహుబలి’ సిరీస్ చిత్రాల తర్వాత యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ నేషనల్ స్టార్ అయిపోయాడు. దీంతో ప్రభాస్ తాను చేయబోతున్న తర్వాతి సినిమాలను కూడా ఆ రేంజ్‌లోనే ఎంపిక చేసుకుంటున్నాడు. ప్రస్తుతం సుజీత్ దర్శకత్వంలో భారీ బడ్జెట్‌తో ‘సాహో’ చేస్తోన్న ఈ స్టార్ హీరో ఆ తర్వాత ‘జిల్’ ఫేమ్ రాధాకృష్ణ డైరెక్షన్‌లో ఓ సినిమా చేయనున్నాడు. ఇక ఈ రెండు చిత్రాల తర్వాత ప్రభాస్ డాన్స్ మాస్టర్ రాజుసుందరం దర్శకత్వంలో ఓ సినిమా చేయడానికి కమిట్ అయ్యాడనే న్యూస్ ఇప్పుడు టాలీవుడ్‌లో చక్కర్లు కొడుతోంది.
 ఇప్పటికే ప్రభాస్ డాన్స్ మాస్టర్ లారెన్స్ దర్శకత్వంలో ‘రెబెల్’ చేశాడు… ఈ చిత్రం యంగ్ రెబెల్ స్టార్‌ను బాగా నిరాశపరచడమే కాకుండా నిర్మాతలకు భారీ నష్టాల్ని మిగిల్చింది. ఈనేపథ్యంలో ఇప్పుడు మరో డాన్స్ మాస్టర్ రాజు సుందరంతో ప్రభాస్ అంత ఈజీగా సినిమా చేయడానికి ఎలా ఒప్పుకున్నాడనే వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి. ఇక స్టైలిష్ డాన్స్ కంపోజింగ్స్‌తో స్టార్ హీరోల హాట్ ఫేవరెట్‌గా ఉన్న రాజు సుందరం దర్శకుడుగా మాత్రం ఘోరంగా విఫలమయ్యాడు.. పదేళ్ల క్రితమే కోలీవుడ్ స్టార్ హీరో అజిత్‌తో ‘ఏగన్’ చిత్రాన్ని తెరకెక్కించగా అది అట్టర్ ఫ్లాప్‌గా మిగిలింది. ఈ చిత్రం బాలీవుడ్ మూవీ ‘మై హూ నా’కి రీమేక్.
 చాలా కాలం నుంచి రాజు సుందరం తెలుగు సినిమాకి దర్శకత్వం వహించాలనే పట్టుదలతో ఉన్నాడు.. గతంలో పవన్ కళ్యాణ్‌ను డైరెక్ట్ చేసే అవకాశం దక్కిందనే ప్రచారం కూడా జరిగింది. ఎందుకో ఏమో అప్పట్లో ఆ ప్రాజెక్ట్ ముందుకు కదలలేదు. ఆ తర్వాత ఎ.కె. ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌లో ‘యాక్షన్ త్రీడి’ సినిమాని డైరెక్ట్ చేద్దామనుకున్నాడు. చివరకు ఆ సినిమాలో కేవలం నటుడిగానే మిగిలిపోయాడు. తెలుగులో డైరెక్షన్ చేయాలనే ఈ డాన్స్ మాస్టర్ కోరికకు ఇప్పుడు ప్రభాస్ సపోర్ట్ దొరికిందంటున్నారు.